జగన్ బాబుపై తణుకు గర్జన: ఆత్మరక్షణ (పిక్చర్స్)
ఏలూరు: పార్టీ నాయకులు పక్క చూపులు చూస్తున్న నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆత్మరక్షణలో పడినట్లు అర్థమవుతోంది. పార్టీ నాయకులు తెలుగుదేశం, బిజెపిల్లోకి జారుకుంటున్న నేపథ్యంలో పార్టీని రక్షించుకోవాల్సిన అనివార్యతలో ఆయన పడ్డారు. దాంతో నాయకులను పట్టి ఉంచుకోవడానికి ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించినట్లు చెబుతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రెండు రోజుల పాటు నిర్వహించిన రైతు దీక్ష అందులో భాగమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో పలువురు నాయకులు ఇటు టిడిపిలోకో, అటు బిజెపిలోకో వెళ్లారు. మరికొంత మంది కూడా జారుకునే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. దానికి బ్రేకులు వేయడానికి జగన్ వ్యూహాత్మకంగా రైతు దీక్షను చేపట్టినట్లు భావిస్తున్నారు.
ఇటు నాయకులకూ కార్యకర్తలకూ అటు ప్రజలకు బలమైన ప్రతిపక్షంగా చూపించుకునేందుకు ఆయన ప్రయత్నించారనడానికి ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. చంద్రబాబుపై ఆయన తణుకు రైతు దీక్ష ముగింపు ప్రసంగంలో తీవ్రంగా ధ్వజమెత్తారు.
చంద్రబాబుపై ఫైర్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తీరు వల్ల రాష్ట్రంలో రైతులు రూ.11,943 కోట్ల అపరాధ రుసుం కట్లాల్సి వస్తోందని జగన్ విమర్శించారు. ఏడాదికి రైతులకు రూ.56 వేల కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యమైతే రూ.13 వేల కోట్లు మాత్రమే ఇచ్చారని ఆయన అన్నారు.
ప్రైవేట్ వ్యాపారుల బారిన రైతులు..
ప్రభుత్వం రూ.13 వేల కోట్లు మాత్రమే ఇవ్వడంతో మిగతా రూ.43 వేల కోట్లకు రైతులు అధిక వడ్డీకి ప్రైవేట్ వ్యాపారుల నుంచి అప్పులు తెచ్చుకునే దుస్థితి నెలకొందని జగన్ అన్నారు.
రైతుల అత్మహత్యలు
అప్పుల బాధ భరించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదని, మృతుల కుటుంబాలకు ఐదేసి లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుందని చంద్రబాబు ఆత్మహత్యలు జరిగాయని అంగీకరించడం లేదని జగన్ అన్నారు.
పాత బకాయిలు జమ చేసుకుంటున్నారు..
వచ్చిన ధరకు పంటలు అమ్ముకుని ఆ చెక్కులను తీసుకుని బ్యాంకులకు పోతే పాత బాకీల కింద జమ చేసుకుంటున్నారని జగన్ చెప్పారు.
ఆందోళన చేస్తాం..
చంద్రబాబు మనసు మార్చుకుని హామీలను నిలబెట్టుకోవాలని, లేదంటే ఆంధ్రప్రదేశ్లో పెద్ద యెత్తున ఆందోళనకు దిగుతామని జగన్ హెచ్చరించారు.
పెనుభారం మోపారు..
గత పాలనలో చంద్రబాబు ఖజానా ఖాళీ అయిందంటూ ప్రజలపై పెను పన్నుల భారాన్ని మోపారని వైయస్ జగన్ గుర్తు చేశారు. ఇప్పుడు అన్నింటినీ ఎగ్గొట్టడానికి ముందస్తు ఎత్తుగడగానే ఖజానా ఖాళీ అయిందంటూ ప్రచారం ప్రారంభించారని ఆయన విమర్శించారు.
చంద్రబాబును అడుగుతున్నా...
ఎంత మంది డ్వాక్రా అక్కాచెల్లెళ్లకు రుణమాఫీ చేశావని, ఎంతమంది రైతలకు రుణ మాఫీ చేశావని తాను చంద్రబాబును అడుగుతున్నానని వైయస్ జగన్ అన్నారు.
వైయస్ పాలనలో అయితే..
దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఒక మాట చెప్పి ఆ మేరకు తొలి సంతకం పెడితే మరుసటి రోజే అన్నీ మాఫీ అయ్యాయని జగన్ చెప్పుకున్నారు.
ఐదు సంతకాలూ అంతే..
ముఖ్యమంత్రి సంతకం పెడితే శాసనంగా మరుసటి రోజే అమలవుతుందని ప్రజలు నమ్ముతారని, కానీ చంద్రబాబు సిఎం అయిన తర్వాత ప్రమాణ స్వీకారం సందర్భంగా పెట్టిన తొలి ఐదు సంతకాలూ ఏ మాత్రం అమలు కాలేదని ఆయన అన్నారు.
రోజుకో కొత్త అబద్ధం
చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడు నెలలవుతోందని, హామీలు నెరవేర్చలేక ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవాడనికి చంద్రబాబు రోజుకో కొత్త అబద్ధం చెబుతున్నాడని వైయస్ జగన్ ధ్వజమెత్తారు.