జయ ఎస్టేట్ గార్డ్ హత్య మిస్టరీ: వరుస మరణాల వెనక..?
జయకు చెందిన కొడనాడు ఎస్టేట్లో హత్య, దోపిడీ కేసులో నిందితులు వరుసగా మరణిస్తుండడం క్రైమ్ సినిమాను తలపిస్తున్నాయి.
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ వాచ్మెన్ హత్య కేసులో వరుసగా నిందితులు మరణిస్తారు. ఈ మరణాలు మిస్టరీగానే మారాయి. ఈ మరణాల వెనక అదృశ్యశక్తి ఏదైనా ఉందా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ కేసులో నిందితుడైన మాజీ ముఖ్యమంత్రి జయలలిత కారు డ్రైవర్ కనకరాజ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మరో నిందితుడు సయాన్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. అతడి భార్య వినుప్రియ, కూతురు నీతు మృతి చెందారు.
వారిద్దరి దేహాలపై కత్తిపోటు గాయాలుండటం కూడా అనుమానం కలిగిస్తోంది. కొడనాడు ఎస్టేట్ గార్డు హత్య కేసుకు సంబంధించి శనివారం రాత్రి అరెస్టయిన సతీషన్, దిబు, సంతోష్, ఉదయకుమార్ నిందితులేనా అనే అనుమానం కూడా కలుగుతోంది. ఈ హత్యకేసుతో సంబంధం ఉన్న ప్రముఖులు ఎవరైనా ఉన్నారా, అందుకే కేసును నీరు గార్చే ప్రయత్నాలు చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంతకీ ప్రధాన నిందితులెవరు...
కొడనాడు హత్య, దోపిడీ కేసులో ప్రధాన నిందితులెవరనే విషయం తేలడం లేదు. దానికి తోడు ఈ కేసును త్వరగా ముగించేందుకు ప్రయత్నిస్తుండడం కూడా సందేహాలకు తావు కల్పిస్తోంది. దీనితో ఈ కేసును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్ ముందుకు వచ్చింది.
వంద గదుల భవనం...
నీలగిరి జిల్లా కొడనాడులో జయలలితకు చెందిన 900 ఎకరాల విస్తీర్ణం కల ఎస్టేట్, వంద గదులతో కూడిన భవనం ఉన్నాయి. కొడనాడు బంగళా చుట్టూ విద్యుత్ కంచెల ప్రహారీ, అన్ని వైపులా సీసీ టీవీ కెమెరాలు ఉన్నాయి. ఎవరూ ప్రవేశించడానికి వీలు కాని ఈ భవనంతో జయలలిత ఏడాదిలో కనీసం రెండు మాసాల పాటు బసచేసి అక్కడి నుంచే పాలనను కొనసాగించేవారు. ఆ సమయంలో కీలకమైన దస్తావేజులను ఆమె ఆ బంగళాలోనే భద్రపరిచారని, తన ఆస్తులకు సంబంధించిన పత్రాలను కూడా దాచి ఉంచినట్లు ప్రచారం సాగుతోంది.
శశికళకు ప్రవేశం ఉంది..
ఎస్టేట్లోని భవనంలోకి జయలలిత, ఆమె ప్రియసఖి శశికళ, పనిమనుషులు, కారు డ్రైవర్లు తప్ప ఇతరులెవ్వరూ లోపలికి వెళ్లే పరిస్థితు లు లేవు. జయ మరణించిన తర్వాత కొడనాడు ఎస్టేట్, భవనం శశికళ వశమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈనెల 23వ తేదీ వేకువజాము గుర్తు తెలియని 11 మంది వ్యక్తులు రెండు కార్లలో ఎస్టేట్లో చొరబడి, జయ బంగళా వాచ్మెన్లు ఓం బహదూర్, కృష్ణ బహదూర్లపై దాడి జరిపారు. ఈ దాడిలో ఓంబహదూర్ హత్యకు గురయ్యాడు.
కనకరాజ్ను పోలి ఉన్నట్లు...
గార్డులపై దాడి చేసిన తర్వాత దుండగులు బంగళాలో చొరబడి కీలకమైన దస్తావేజులు, నగలు, నగదును దోచుకెళ్లారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని నీలగిరి పోలీసులు విచారణ జరిపారు. ఎస్టేట్ చుట్టూ ఉన్న సీసీటీవీ కెమరాలలో నమోదైన దృశ్యాలను పరిశీలించారు. వాటిలో దోపిడీ దొంగలు ఉపయోగించిన రెండు కార్లు, దోపిడీ దొంగల ముఖాలు నమోదై ఉండడాన్ని గమనించారు. ఆ వీడియో ఆధారాల పరిశీలిస్తున్నప్పుడు దుండగులలో ఒకడి ముఖం జయలలిత మాజీ కారు డ్రైవర్ కనకరాజ్ను పోలి ఉన్నట్టు గుర్తించారు. అతడి ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టగా కనకరాజ్ సేలం సమీపంలోని ఆత్తూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
మరొకతను ఇలా...
జయ ఎస్టేట్లో హత్య, దోపిడీ కేసులో అనుమానితుడైన కేరళకు చెందిన సయాన్ శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడు ప్రయాణించిన కారులో జయలలితకు చెందిన విలువైన వాచీలు, వస్తువులు లభించటం తీవ్ర సంచలనం కలిగిస్తోంది. కోయంబత్తూరు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సయాన్ వద్ద మేజిస్ట్రేట్ సెల్వకుమార్ వాంగ్మూలం పొందారు. డీఎస్పీ శ్రీనివాసులు సయాన్ చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్దకు వెళ్లి విచారణ జరిపారు. సయాన్ భార్య వినుప్రియ, ఐదేళ్ల కుమార్తె నీతు హత్యకు గురై ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
రూ. 200 కోట్ల దాకా..
కొడనాడు భవనంలో రూ.200 కోట్ల దాకా నగదు భద్రపరచి ఉంచారని భావిస్తున్నారు. దుండగులు వాటిని దోచుకునేందుకే వెళ్లారని తెలిసింది. ఆ బంగళాలోని జయలలిత గది అద్దాలు పగులగొట్టుకుని దుండగులు ప్రవేశించి విలువైన చేతి గడియారాలు, అలంకరణ వస్తువులు ఎత్తుకెల్లారు. జయలలిత పడకగదిలో ఉన్న నాలుగు సూట్ కేసులు తెరచి ఉన్నాయి. ఆ సూట్కేసులలో భద్రపరచిన ఆస్తి పత్రాలు, దస్తావేజులు, నగదు కూడా దోపిడీకి గురై ఉంటాయని అనుమానిస్తున్నారు.
నలుగురి వద్ద విచారణ
కొడనాడు ఎస్టేట్ దోపిడీ కేసులో శనివారం అరెస్టయిన సతీషన్, దిబు, సంతోష్, ఉదయకుమార్ నలుగురిని నీలగిరి జిల్లా ఎస్పీ మురళీ రంభా ఆదివారం ఉదయం విచారణ జరిపారు. ఎస్టేట్ ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆ సందర్భంగా నలుగురు దుండగులు కొడనాడు భవనంలోకి ఎలా చొరబడిందీ నటించి చూపారు. అక్కడి నుంచి వారిని కొత్తగిరి పోలీసుస్టేషన్కు తీసుకెళ్లి విచారణ జరిపారు. ఆ తర్వాత కొత్తగిరి మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ వారికి 15 రోజుల కస్టడీకి పంపుతూ ఆదేశించారు. ఆ మేరకు నలుగురిని కోయంబత్తూరు జైలుకు తరలించారు.
మరో ఇద్దరి అరెస్టు
జయలలిత ఎస్టేట్ కేసుతో సంబంధం ఉన్న జిడ్సన్, జంషద్ అనే ఇద్దరిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో జిడ్సన్ ఆలయ పూజారి అని పోలీసులు విచారణలో తెలిసింది. ఇక ఈ కేసులో నిందితులైన మరి ముగ్గురి ఆచూకీ కనుగొనేందుకు నీలగిరి పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు
స్టాలిన్ ఇలా...
కొడనాడు ఎస్టేట్ వాచ్మెన్ హత్య, దోపిడీ సంఘటనలపై ఏడీజీపీ స్థాయి అధికారిచేత సమగ్రంగా విచారణ జరపాలని డీఎంకే కార్యాచరణ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. తొలుత వాచ్మెన్ ఓంబహదూర్ హత్య మాత్రమేనని, ఆ తర్వాత దోపిడీ యత్నమేనని చెబుతూ వచ్చిన పోలీసులు చివరకు జయ భవనంలో దోపిడీ జరిగిందని, ఆమె వాచీలు స్వాధీనం చేసుకున్నామని ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తున్నాయని అన్నారు. జయ బంగళాలలో వాచీలు మాత్రమే దోపిడీకి గురయ్యాయంటే నమ్మలేకున్నామని, వాస్తవాలను వెల్లడించే విధంగా సమగ్రమైన విచారణ జరపాలని ఆయన కోరారు.
ఇలాంగోవన్ ఇలా..
కొడనాడు వాచ్మెన్ హత్య, జయ బంగళాలోదోపిడీ సంఘటనలపై ఉన్నత స్థాయీ విచారణ జరపాలని టీఎన్సీసీ మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇలంగోవన్ డిమాండ్ చేశారు. తిరుచ్చిలో ఆదివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. కొడనాడు సంఘటనలు ఓ దెయ్యం సినిమా సంఘటనలను తలపిస్తున్నాయని, వాచ్మెన్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న కారు డ్రైవర్ కనకరాజ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం, మరో నిందితుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడం అనుమానాలు కలిగిస్తున్నాయని, వాస్తవాలను బహిర్గతం చేయడానికి పోలీసుశాఖ ఉన్నతస్థాయి విచారణ జరపాల్సిన అవసరం ఉందని అన్నారు.