చిండీ అన్నందుకే డేను రాజన్ చంపేశాడట
ముంబై: జర్నలిస్టు జె డే హత్య కేసులో గ్యాంగ్స్టర్ ఛోటా రాజన్పై సిబిఐ శుక్రవారం అనుబంధ చార్జిషీట్ను దాఖలు చేసింది. సిబిఐ కొత్తగా మరింత మంది సాక్షులతో, పత్రాలతో ముందుకు వచ్చింది. సాక్షుల్లో ఒకరిని నిందితుల జాబితాలో చేర్చింది. ఇప్పుడతను పరారీలో ఉన్నాడు.
సిబిఐ ప్రత్యేక న్యాయవాది భరత్ బాదామీ ప్రత్యేక మోకా కోర్టు న్యాయమూర్తి సమీర్ అడ్కర్కు చార్జిషీట్ ప్రతిని సమర్పించారు. దాని ప్రతులను నిందితులకు ఇవ్వడానికి కొంత సమయం కావాలని కోరారు. సాక్షుల పేర్లు లేకుండా చార్జిషీట్ ప్రతిని నిందితులకు ఇసస్తామని, వారికి ఇవ్వడానికి కొంత సమయం కావాలని బాదామీ చెప్పారు.
రాజన్ జరిపిన సంభాషణల స్వరంతో అతని గొంతు సరిపోలినట్లు వాయిస్ స్పెక్ట్రోగ్రాప్ పరీక్షలో తేలిందని, జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు రాజన్ వాయిస్ను తీసుకున్నామని చెప్పారు. తాజాగా నిందితుల జాబితాలో చేరి పరారీలో ఉన్న వ్యక్తి రవి రామ్ రతేశ్వర్గా తెలుస్తోంది. ముంబై క్రైమ్ బ్రాంచ్ అతన్ని చార్జిషీట్లో సాక్షిగా చేర్చింది. ఆ తర్వాత సిబిఐ అతన్ని నిందితుల జాబితాలో చేర్చింది.
అతను పలువురికి 20 గ్లోబల్ సిమ్ కార్డులు ఇచ్చాడని, అతని ద్వారా సిమ్ కార్డులు అందుకున్నవాళ్లలో నిందితులు కూడా ఉన్నారని సిబిఐ తెలిపింది. దాంతో అతన్ని నిందితుడిగా చేర్చినట్లు చెప్పింది.
కాగా, తాను రాసిన కొన్ని ఆర్టికల్స్లో చిండీగా పేర్కొన్నందుకే జే డేను రాజన్ చంపించినట్లు సిబిఐ చెప్పింది. అండర్ వరల్డ్పై జే డే ఇప్పటికే రెండు పుస్తకాలు రాశాడు. మరో రెండు పుస్తకాలు రాయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. చిండీ - రాగ్స్ టూ రిచెస్ అనే పేరుతో రాయడానికి సిద్ధం చేసుకున్న పుస్తకంలో జే డే రాజన్ను చిండీగా అభివర్ణించాడు.
రాజన్ దేశభక్తి ముసుగును తొలగించడానికి జే డే సిద్ధపడ్డాడని, తాను ఎదగడానికి సహకరించినవారి పట్ల రాజన్కు ఏ మాత్రం ఆపేక్ష లేదని డే రాయదలుచుకున్నట్లు సిబిఐ తన చార్జిషీట్లో తెలిపింది. డే జర్నలిజాన్ని వదిలేయాలని అనుకున్నాడని, దానికి ముందు రెండు పుస్తకాలు రాయాలనుకున్నాడని, దానికోసం ఆయన చాలా మందిని కలిశాడని, పిలిప్పైన్స్తో పాటు ఇతర దేశాలు తిరిగాడని సిబిఐ వివరించింది. తనను కలవాలనే రాజన్ విజ్ఞప్తిని డే తిరస్కరించినట్లు కూడా సిబిఐ తెలిపింది.