ఆ దెబ్బకు జగన్ భయపడ్డారా, ఎదురుతిరిగిన టిడిపి: బాబుపై బిజెపి ఆగ్రహం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి వరుస షాక్లు తగులుతున్నాయి.నంద్యాల ఓటమి అనంతరం కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో పరాజయం వైసిపిని వేధిస్తోంది.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి వరుస షాక్లు తగులుతున్నాయి. నంద్యాల ఓటమి అనంతరం కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో పరాజయం వైసిపిని వేధిస్తోంది.
చంద్రబాబు పాలనపై ప్రజలకు విశ్వాసం లేదని, త్వరలో నేను ముఖ్యమంత్రిని అవుతానని జగన్ పదేపదే చెబుతూ వస్తున్నారు. అంతేకాదు, వైసిపి నుంచి టిడిపిలో చేరిన 21 మందితో రాజీనామా చేసి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని జగన్ సవాల్ చేస్తున్నారు.
నీరుగారిన వైసిపి, జగన్ మళ్లీ మళ్లీ సవాల్
నంద్యాల ఉప ఎన్నికల వరకు వైసిపి క్యాడర్లో చాలా ధీమా కనిపించింది. ఆ తర్వాత వారు నీరుగారిపోయారు. ఇప్పుడు కాకినాడ ఫలితాల తర్వాత మరింత ఆందోళనకు గురవుతున్నారు. జగన్ చెబుతున్నట్లుగా చంద్రబాబు పాలనపై ప్రజల్లో అసంతృప్తి లేదని అర్థమవుతోందని స్వయంగా వైసిపి నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. కానీ జగన్ పదేపదే సవాల్ చేయడం ఏమాత్రం బాగా లేదని సొంత నేతలే అంటున్నారని తెలుస్తోంది.
Recommended Video
ఇప్పుడు చంద్రబాబును అంగీకరిస్తారా
నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటమి అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. ఇది చంద్రబాబు గెలుపు కాదని చెప్పారు. చంద్రబాబుకు దమ్ముంటే 21 మందితో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలన్నారు. మరి కాకినాడలో 30 ఏళ్ల తర్వాత టిడిపి జెండా ఎగిరింది. ఇప్పుడు దీనిపై జగన్ ఏం మాట్లాడుతారని, నంద్యాల ఒక్కటే కాదు.. కాకినాడలోను టిడిపి సత్తా చాటిందని గుర్తు చేస్తున్నారు.
జగన్కు ఎదురు తిరిగిన టిడిపి
నంద్యాల, కాకినాడలో టిడిపి గెలుపు నేపథ్యంలో ఆ పార్టీ నేతలు జగన్పై మరింత రెచ్చిపోతున్నారు. ఇప్పుడు జగన్ సవాల్ను వారు ఏమాత్రం సీరియస్గా తీసుకోవడం లేదు. పైగా, ఎదురు దాడి చేస్తున్నారు. చంద్రబాబుపై ప్రజా వ్యతిరేకత ఉందని జగన్ భావిస్తే ఆయనే పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేసి, ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని సవాల్ విసురుతున్నారు.
జగన్ భయపడ్డారా?
నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో జగన్ ఏకంగా 13 రోజుల పాటు పాల్గొన్నారు. అక్కడే తిష్ట వేశారు. ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కానీ దారుణంగా ఓటమి చవి చూశారు. ఈ దెబ్బకు కాకినాడ ఎన్నికలకు అంత గట్టిగా ప్రచారం చేయలేదని అంటున్నారు. ఏదో మొక్కుబడిగా ప్రచారం చేసి వెళ్లిపోయారని అంటున్నారు.
వైసిపి నేతల్లో ఆందోళన
ఎన్నికలకు ఏడాదిన్నర ముందు వరుస ఓటములు వైసిపి జీర్ణించుకోలేని పరిస్థితి. ఇది వైసిపి నేతల్లో ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు.
టిడిపిపై బిజెపి ఆగ్రహం
మరోవైపు, కాకినాడ ఎన్నికల్లో టిడిపి రెబల్ అభ్యర్థులు బిజెపికి షాకిచ్చారు. టిడిపి రెబల్ అభ్యర్థులు పోటీ చేయడంతో 9 స్థానాల్లో పోటీ చేసిన బిజెపి 3 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇద్దరు టిడిపి రెబెల్స్ గెలిచారు. దీనిపై స్థానిక బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నచ్చ చెప్పితే టిడిపి రెబల్స్ పోటీ చేయకుండా ఉండేవారని మండిపడుతున్నారు.