జెఇఇ మెయిన్స్లో తొలిసారి: ప్రతిభ ఎవరి సొత్తు?
ఓ దళిత విద్యార్థి అత్యంత ప్రతిష్టాత్మకమైన జెఇఇ మెయిన్స్లో వందకు వంద శాతం మార్కులు సాధించడం నమ్మగలమా, కల్పిత్ వీర్వల్ను చూశాక నమ్మాల్సిందే....
న్యూఢిల్లీ: ఐఐటిలతో సహా దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక ఇంజనీరింగ్ కాలేజిల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జెఈఈ-మెయిన్ పరీక్షలో రాజస్థాన్లోని ఉదయ్పూర్కు చెందిన కల్పిత్ వీర్వల్ నూటికి నూరు శాతం మార్కులు సాధించాడు. ఆ రకంగా దేశంలో ఆ ఘనతను తొలిసారి సాధించినవాడిగా రికార్డు సాధించాడు.
జెఈఈ మెయిన్ పరీక్ష ఫలితాలను సిబిఎస్ఇ గురువారం విడుదల చేసింది. 1781 కేంద్రాల్లో 10.2 లక్షలకుపైగా విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. ఏప్రిల్ 2వ తేదీన ఆఫ్లైన్లో, ఏప్రిల్ 8, 9 తేదీల్లో ఆన్లైన్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఉదయ్పూర్కు చెందిన 17 ఏళ్ల కల్పిత్ వీర్వల్ ఈ పరీక్షలో 360 మార్కులకుగాను 360 మార్కులు సాధించి టాపర్గా నిలిచాడు.
ఇతను అంతకుముందు ఇండియన్ జూనియర్ సైన్స్ ఒలింపియాడ్, నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్లోను టాపర్గా నిలిచాడు. కల్పిత్ తండ్రి వృత్తి రీత్యా ప్రభుత్వ ఆస్పత్రిలో కాంపౌండర్గా పని చేస్తున్నారు. తల్లి పుష్ప వీర్వల్ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. కల్పిత్ వీర్వల్ విషయంలో చెప్పుకోవాల్సింది ఆ ఒక్క ఘనత మాత్రమే కాదు.
కల్పిత్ వీర్వల్ దళితుడు కావడం విశేషం. ఓ దళిత విద్యార్థి అత్యంత కష్టతరమైన జెఇఇ మెయిన్ పరీక్షలో వందకు వంద శాతం మార్కులు సాధించడం విశేషం. అగ్రకులాల్లో మాత్రమే ప్రతిభ దాగి ఉంటుందనే భ్రమను కల్పిత్ వీర్వల్ బద్దలు కొట్టాడు. ప్రతిభ అనేది కొంత మంది సొత్తు కాదని నిరూపించాడు.
కోట, హైదరాబాదు వంటి నగరాల్లో కోచింగ్ తీసుకోవాలని అతనిపై ఒత్తిడి పెట్టారు. కానీ అతను ఇష్టపడలేదు. అపూర్వమైన ఆత్మవిశ్వాసంతో అతను ముందుకు సాగాడు. తనకు ఫస్ట్ క్లాస్ వస్తుందని తెలుసు గానీ వందకు వంద మార్కులు వస్తాయని అనుకోలేదని అతను అంటున్నాడు.