దటీజ్ కేసీఆర్: మోడీ వీడియోతో షాకిచ్చారు, బాబు కంగు!
హైదరాబాద్: బుధవారం నాడు అపెక్స్ కమిటీ భేటీలో పాలమూరు - రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల పైన ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇవి విభజనకు ముందువేనని, వాటిని ఆపేది లేదని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. అపెక్స్ కమిటీ భేటీలో వీటి పైన తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది.
ఈ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్లాన్గా నరేంద్ర మోడీ వీడియోతో అందరి నోళ్లు మూయించారని తెలుస్తోంది. కేసీఆర్ వ్యూహంతో చంద్రబాబు కంగు తిన్నారని అంటున్నారు.
సమాచారం మేరకు.. ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ప్రాజెక్టులు కొత్తవా? పాతవా? అన్న అంశంలో చర్చ జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశంలో ప్రదర్శించిన మోడీ వీడియో మొత్తం సీన్నే మార్చేసింది.
మోడీ వీడియోతో ఏపీ కంగు
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో మహబూబ్నగర్కు వచ్చిన నరేంద్ర మోడీ చేసిన ప్రసంగానికి సంబంధించినదే ఈ వీడియో. ఎవరూ ఊహించని విధంగా సీఎం కేసీఆర్ ఈ వీడియోను ప్రదర్శించారు. తద్వారా చంద్రబాబు నోటీకి తాళం వేశారని అంటున్నారు. ఈ ప్రసంగాన్ని చూసిన కేంద్ర మంత్రి ఉమాభారతి సైతం ఇక వివాదానికి తావులేదన్నట్టు అవి పాత ప్రాజెక్టులేనని నిర్థారణకు వచ్చారని అంటున్నారు.
పాలమూరులో మోడీ వాగ్ధానం
వీటిని కొత్త ప్రాజెక్టులని వ్యాఖ్యానించినా లేక ప్రసంగాన్ని కాదన్నా మోడీ వాగ్దానానికి ఎలాంటి విలువా లేకుండా పోతుంది కాబట్టి దానిని పరిగణనలోకి తీసుకోవడం మాత్రమే కాకుండా పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు పాతవనే నిర్ధారణకు ఈ సమావేశం రావాల్సి వచ్చిందంటున్నారు.
మోడీ వీడియో
ఈ రెండూ పాత ప్రాజెక్టులేనని నిరూపించేందుకు తెలంగాణ ప్రభుత్వం గతంలోని జీవోలనే మళ్లీ చూపిస్తుందని భావించిన ఏపీ నేతలు.. అనూహ్యంగా మోడీ ప్రసంగం వీడియో, మూడు ప్రధాన పార్టీల ఎన్నికల మ్యానిఫెస్టోల్లో ఈ ప్రాజెక్టుల ప్రస్తావన ఉన్న అంశాలను బయటపెట్టడంతో ఏం మాట్లాడలేకపోయారంటున్నారు.
అదే వేదికపై చంద్రబాబు
అప్పటిదాకా ఇచ్చిన ప్రజెంటేషన్లో ఈ రెండూ కొత్త ప్రాజెక్టులని, ఆపేయాల్సిందేనని వాదించిన ఏపీ.. మోడీ ప్రసంగిస్తున్న వేదిక పైనే చంద్రబాబు కూడా ఉండడంతో అవి పాత ప్రాజెక్టని ఒప్పుకోక తప్పలేదని అంటున్నారు. కేసీఆర్ వ్యూహాత్మకంగా చంద్రబాబును గుక్కతిప్పుకోకుండా చేశారంటున్నారు.
కేసీఆర్
సమావేశం ముగిసిన తర్వాత బయటకు వచ్చిన ఏపీ ఇంజినీర్లు కూడా సీఎం కేసీఆర్ వాగ్ధాటిని, జలవనరులపై ఉన్న లోతైన పరిజ్ఞానాన్ని, ప్రధాని మోడీ ప్రసంగం వీడియోను తెరపైకి తెచ్చి అందరి నోళ్ళు మూయించిన మేధస్సును అభినందించారట. ఏపీ ప్రదర్శించిన ప్రజెంటేషన్ ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్ వ్యూహం ముందు చంద్రబాబు ఎత్తుగడలు బొక్కబోర్లా పడ్డాయంటున్నారు.