రేవంత్ ఇష్యూ: వాళ్లెవరు, డబ్బుపై పొంతనలేని మాట
నోటుకు ఓటు వ్యవహారంలో మరికొందరు ఉండి ఉంటారని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అనుమానిస్తోంది. ఇందుకోసం ఆధారాలు సేకరిస్తోంది. ఇందులో మరికొందరి పాత్రపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఏ అవకాశాన్నీ వదిలిపెట్టొద్దన్న ఆదేశాల మేరకు దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఇప్పటి వరకు లభించిన ఆధారాలను బట్టి ఈ కేసుతో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి? చట్టపరంగా వారి పేర్లను చేర్చేందుకు అవకాశాలు, అడ్డంకులు ఏమిటన్న అంశాన్ని సమీక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వద్ద జరిగిన సమావేశంలోనూ ఈ అంశంపై చర్చించారు.
ఆధారాలపై చర్చ!
ఏసీబీ డీజీ ఎకె ఖాన్, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిలు గురువారం ముఖ్యమంత్రిని కలిశారు. దర్యాప్తు స్థితిగతులను వివరించారు. ఈ కేసుతో రేవంత్ రెడ్డితో పాటు మరికొందరికి సంబంధాలున్నట్లు నిరూపించేందుకు తమ వద్దనున్న ఆధారాలేంటి, వాటితో చట్టపరంగా ఎంతవరకు ముందుకు వెళ్లవచ్చన్న అంశాలను వారు చర్చించారని సమాచారం.
ఎమ్మెల్యే స్టీఫెన్కు ఇచ్చేందుకు తెచ్చిన రూ.50 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చారన్న దానిపైనా దృష్టి సారించారు. ఇందులో మరికొందరు ఉండి ఉంటారని అనుమానిస్తున్నారు. రేవంత్ రెడ్డి, స్టీఫెన్ల మధ్య జరిగిన సంభాషణలో వెల్లడైన పేర్లు తదుపరి దర్యాప్తులో కీలకం కానున్నాయి.
మరో ముగ్గురితో మాట్లాడారా?
డబ్బు మార్పిడికి ముందు పలువురు టీడీపీ నాయకులు ఫోన్ల ద్వారా స్టీఫెన్, మరో ముగ్గురు తెరాస ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపారని, ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్దనున్నాయని అధికారులు చెబుతున్నట్లుగా తెలుస్తోంది.
వారి పేర్లు చేర్చేందుకు ఆధారాలపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ఫోన్ కాల్స్ను విశ్లేషిస్తే... 14 మందితో ఆయన తరచూ మాట్లాడారని, వారందర్నీ విచారించాలని ఏసీబీ అధికారులు నిర్ణయించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
అరెస్టుకు ముందు స్టీపెన్, ముగ్గురు తెరాస ఎమ్మెల్యేలతో ఎవరెవరు సంప్రదింపులు జరిపారు? వారిని ఎలాంటి ప్రలోభాలకు గురిచేశారు? దానికి సంబంధించిన ఆధారాలు ఏమిటన్న విషయమై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇందులో ప్రమేయమున్న వారిలో ఎక్కువమంది ప్రజాప్రతినిధులే కాబట్టి పూర్తి ఆధారాలతో, చట్టపరిధిలో, పక్కాగా ముందుకు వెళ్లాలని యోచిస్తున్నారని తెలుస్తోంది.
కొత్తగా ఎవర్ని చేర్చాలన్నా ముందుగా వారికి నోటీసులు జారీ చేసి, వారి వివరణ తీసుకున్న తర్వాతే తదుపరి చర్యలకు ఉపక్రమించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు, ఈ కేసులో స్వాధీనం చేసుకున్న డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్నది కీలకంగా మారింది.
నిందితులను అరెస్టు చేసిన తర్వాత ఏసీబీ అధికారులు నిందితులు ముగ్గుర్నీ వేర్వేరుగా విచారించారు. డబ్బు గురించి ప్రశ్నించగా ముగ్గురూ పొంతనలేని సమాధానాలే చెప్పినట్లుగా తెలుస్తోంది. వారు మూడు బ్యాంకుల పేర్లు చెప్పడంతో, ఆయా బ్యాంకులకు అనిశా అధికారులు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.