కాంగ్రెస్, బిజెపిలతో ఢీ: మరోసారి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ మాట
హైదరాబాద్: తృణమూల్ కాంగ్రెసు అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓ వైపు ఢిల్లీలో పలు పార్టీల నాయకులను కలుస్తూ సందడి చేస్తున్నారు. ఈ సమయంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి చీఫ్ కె. చంద్రశేఖర రావు నోట మరోసారి ఫెడరల్ ఫ్రంట్ మాట వెలువడింది.
ఫెడరల్ ఫ్రంట్ను తక్షణమే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. బిజెపి, కాంగ్రెసులకు వ్యతిరేకంగా ఇది దేశంలో కీలకమైన పాత్ర పోషిస్తుందని ఆయన చెప్పారు. దాన్ని ఆయన పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాగా అభివర్ణించారు.
క్రియాశీలక పాత్ర పోషిస్తా...
జాతీయ రాజకీయాల్లో తాను ఇక కీలక పాత్ర పోషిస్తానని కేసిఆర్ చెప్పారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చకు మంగళవారం సమాధానమిస్తూ ఆయన ఆ విషయం చెప్పారు. దేశానికి ఉత్తమ పాలనను అందించడంలో కాంగ్రెసు, బిజెపిలు విఫలమయ్యాయని అన్నారు. ప్రస్తుత రాజకీయ అనిశ్చితిలో తెలంగాణ రాష్ట్రం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.
ఇది పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా
దేశంలోని అన్ని రాజకీయ పార్టీల సహకారంతో పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆవిర్భవిస్తుందని కేసిఆర్ చెప్పారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా న్యాయం గెలిచినట్లే జాతీయ స్థాయిలో కొత్త ఫ్రంట్కు ప్రజల ఆదరణ లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర పాలనపై దేశ ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని అన్నారు.
ఆ ఫ్రంట్ ఇదీ....
పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనేది పార్టీల కూటమి కాదని, దేశ ప్రజలను ఏకం చేయడమని కేసీఆర్ అన్నారు. రాజకీయాల కోసం రెండు, మూడు పార్టీలను ఏకం చేయడమనేది ఆలోచన, దృక్పథం కాదనీ ఉమ్మడి ఎజెండాపై అన్ని రాష్ట్రాల్లోని ప్రజాసమూహాలను ఏకం చేయడం తన ఆలోచన, దృక్పథమని కేసిఆర్ చెప్పారు. తాను పీపుల్స్ ఫ్రంట్ను ఏర్పాటు చేయదలుచుకుంటున్నట్లు తెలిపారు.
ఆ పార్టీల 70 ఏళ్ల పాలనలో....
కాంగ్రెసు, బిజెపిలు ఈ దేశాన్ని 70 ఏళ్లు పాలించాయని, దేశమూ దేశ ప్రజానీకమూ తీవ్రమైన కష్టాలను ఎదుర్కున్నాయని కేసిఆర్ అన్నారు. చైనా, జపాన్, మలేసియా లేదా సింగపూర్ల వైపు చూస్తే మానవ వనరుల విషయంలోనూ సహజ, ఆర్థిక వనరుల విషయంలోనూ భారత్ ముందు ఏమీ కావని తెలుస్తుందని, కానీ ఇప్పుడు ఆ దేశాలు ఎక్కడ నిలబడ్డాయి మనం ఎక్కడున్నామని అన్నారు. ఆ దేశాలు అద్బుతమైన ప్రగతి సాధించాయని, మనం సాధించలేకపోయామన అన్నారు. గత 70 ఏళ్ల కాంగ్రెసు, బిజెపి ప్రభుత్వాల విధానాలే అందుకు కారణమని అన్నారు.
ఇప్పటికే వివాదం...
ప్రస్తుత పరిస్థితి ఇంకా కొనసాగితే దేశసమగ్రతకు మంచిది కాదని, కేంద్ర నిధుల కేటాయింపుల్లో దక్షిణ, ఉత్తర వివక్ష అంటూ ఇప్పటికే వాదనలు ప్రారంభమయ్యాని కేసిఆర్ అన్నారు. తాను ఆ విధమైన వాదనలతో ఏకీభవించను గానీ తగిన చర్యలతో సవరించకపోతే ప్రమాదకరమైన స్థితి దారి తీయవచ్చునని అన్నారు.
అప్పుడు నన్ను ఎద్దేవా చేశారు.
తాను 2001లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు అందరూ తనను ఎద్దేవా చేశారని, నవ్వారన, గత ఐదు దశాబ్దాల కాలంలో ఎవరూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించలేకపోయారని అన్నారని, కెసిఆర్ ఎలా సాధిస్తారని ప్రశ్నించారన కేసఆర్ వివరించారు. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారమైందని, అదే స్ఫూర్తితో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తానని, ఇందులో కూడా తాను విజయం సాధస్తానని అన్నారు.