స్వీట్ మెమొరీస్: కేసీఆర్ చదివిన బడికి మహర్దశ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాను చిన్నతనంలో చదువుకున్న స్కూలుకి ప్రత్యేకంగా నిధులను మంజూరు చేశారు. మెదక్ జిల్లా దుబ్బాక బాలురు ఉన్నత పాఠశాలలో సీఎం కేసీఆర్ 5వ తరగతి నుండి 8వ తరగతి వరకు చదివారు.
తాను చదువుకున్న స్కూలు పూర్తిగా శిథిలావస్ధకు చేరుకుందని, వానపడితే విద్యార్ధులు ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయాన్ని ఎమ్మెల్యే రామలింగారెడ్డి ద్వారా కేసీఆర్ తెలుసుకున్నారు. ఇంకేముంది తాను చదువుకున్న స్కూలు పరిస్థితి అంత అద్వానంగా ఉందా? అని వెంటనే స్పందించారు.
తాను చదువుకున్న స్కూలుని దేశంలోనే ఓ ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకొచ్చారు. అనుకున్న వెంటనే విద్యాశాఖ నుంచి ప్రత్యేక నిధుల ద్వారా 4.67 కోట్లు మంజూరు చేశారు. అంతేకాదు ఈ స్కూలు నిర్మాణం కోసం ప్రముఖ ఇంజనీర్లతో ఓ అద్భుతమైన ప్లాన్లను తయారు చేయించి అందులో ఒక దానిని ఆయన స్వయంగా ఎంచుకున్నారు.
ఇంద్రభవనాన్ని తలపించేలా అత్యాధునిక సౌకర్యాలతో స్కూలుని నిర్మించనున్నారు. ఈ స్కూలు కాంట్రాక్టుని గెలాక్సీ కన్స్ట్రక్షన్ కంపెనీ కాంట్రాక్టు చేజిక్కించుకుంది. ఈ స్కూలు శంకుస్థాపనకు సీఎం కేసీఆర్ ఈనెల 11న దుబ్బాకకు రానున్నారు.
ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో పాత భవనాన్ని కూల్చి కొత్త భవనం నిర్మాణానికి చదును చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. సీఎం కేసీఆర్ చదువుకున్న ఈ స్కూలు కావడం వల్లనే దుబ్బాక హైస్కూల్కు మహార్దశ పట్టిందని, దేశంలోనే ఈ స్కూలుని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ముందుకు వచ్చారని ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.