ఎందుకిలా:కేజ్రీవాల్ వీడియో రిలీజ్, అవును ఏడ్చాను
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ మండలి సమావేశంలో శనివారం పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీాల్ చేసిన ప్రసంగం వీడియోను ఆదివారం యూట్యూబ్లో పెట్టారు. అందులో కేజ్రీవాల్ తన ఆవేదనను వెళ్లగక్కారు. ఢిల్లీ అంతా ఏఏపీకి మద్దతుగా నిలిస్తే, మనలో కొందరు వెన్నుపోటు పొడిచారని వ్యాఖ్యానించారు. తాను బరువెక్కిన హృదయంతో ఈ వ్యాఖ్యలు చేస్తున్నానన్నారు.
ఎన్నికల్లో సొంత పార్టీ ఓడిపోవాలని కొందరు కుట్ర పన్నారని కేజ్రీవాల్ అన్నారు. పార్టీ ఓడితేనే పార్టీకి, కేజ్రీవాల్కు కూడా గుణపాఠం అవుతుందని ప్రశాంత్ భూషణ్ అనేక మందికి చెప్పారన్నారు. అలా ఓడించలేకుంటే పత్రికలకెక్కి పార్టీని నాశనం చేస్తామని హెచ్చరించారని చెప్పారు. తనకు వ్యతిరేకంగా మీడియాలో కథనాలు వచ్చేలా చేశారన్నారు. దీని వెనుక యోగేంద్ర యాదవ్ ఉన్నట్లు టీవీ ఛానళ్ల వారు చెప్పారన్నారు.
అలాంటి వారు ఈ పార్టీలో ఎందుకున్నారని, వారు ఈ విషయం చెప్పాలని కేజ్రీవాల్ అన్నారు. పార్టీని చంపివేయవద్దని, అవినీతి, మతశక్తులతో పోరాటం చేస్తున్నామని, ఇలాంటి వారితో కాదన్నారు. తాను ఓటమిని అంగీకరించానని, అసమ్మతి నేతలే గెలిచారన్నారు. ఇంతటితో ఈ పోరాటానికి ముగింపు చెప్పాలన్నారు. కార్యవర్గ సభ్యులకు నేను కావాలా లేక అస్మతి నేతలు కావాలా చెప్పాలని ప్రశ్నించారు.
తాను మొండివాడినని చాలామంది చెబుతారని, నిజాయితీలేనివాడిని అని మాత్రం ఎవరు చెప్పలన్నారు. లోకసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత జరిగిన తొలి జాతీయ కార్యవర్గ సమావేశంలో తాను ఏడ్చింది నిజమే అన్నారు. అప్పుడు రాజకీయాలు వదిలేయాలనుకున్నానని చెప్పారు. యోగేంద్ర, ప్రశాంత్ భూషణ్లు ఏఏపీకి వ్యతిరేకంగా పని చేశారని చెప్పారు.
కాగా, ఏఏపీ అంతర్గత లోక్పాల్ అడ్మిరల్ (రిటైర్డ్) ఎల్ రామ్దాస్తో పాటు ఆ పార్టీ క్రమశిక్షణా కమిటీ నుంచి ప్రశాంత్ భూషణ్కు ఆదివారం ఉద్వాసన పలికారు. వెన్నుపోట్లకు పాల్పడుతూ కుట్రలు పన్నుతున్నారన్న ఆరోపణలతో పార్టీ వ్యవస్థాపక సభ్యులైన ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్లను శనివారం జాతీయ కార్యవర్గం నుంచి బహిష్కరించిన ఏఏపీ మరుసటి రోజే వీరిపై వేటు వేసింది.
ఏఏపీ ఆదివారం న్యూఢిల్లీలో అత్యవసర జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించి పార్టీ అంతర్గత లోక్పాల్ పదవి నుంచి రామ్దాస్ను తొలగించింది. అంతేకాకుండా మాజీ ఐపీఎస్ అధికారులు ఎన్ దిలీప్ కుమార్, రాకేష్ సిన్హా, ప్రముఖ విద్యావేత్త ఎస్పీ వర్మలతో కొత్త లోక్పాల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఏఏపీ లోక్పాల్ కమిటీలో సభ్యులుగా వ్యవహరించేందుకు వీరంతా అంగీకరించారని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి పంకజ్ గుప్తా తెలిపారు.
పార్టీ క్రమశిక్షణా కమిటీ నుంచి ప్రశాంత్ భూషణ్ను తొలగించిన ఏఏపీ జాతీయ కార్యవర్గం ముగ్గురు సభ్యులతో కొత్త క్రమశిక్షణా కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దినేష్ వాఘేలా అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు అత్యంత విధేయుడైన ఆశిష్ ఖేతన్, గుప్తా ఇతర సభ్యులుగా ఉన్నారు.