లాస్ట్ మినిట్లో: రెండు ఆఫర్స్తో షాకిచ్చిన కిరణ్?
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నాయకులకు షాకిచ్చారా? అంటే అవుననే అంటున్నారు. తెలంగాణపై సిడబ్ల్యూసి నిర్ణయం జరిగినప్పటి నుండి కిరణ్ బలంగా సమైక్యవాదం వినిపిస్తున్నారు. అవసరమైతే కేంద్రాన్ని ఎదిరిస్తానని చెప్పారు. ఆయన తీరు చూసి కొత్త పార్టీ పెడతారనే చర్చ జోరుగా సాగింది. అయితే ఆఖరి నిమిషంలో కిరణ్ నేతలకు షాకిచ్చారని అంటున్నారు.
గురువారం కేంద్ర కేబినెట్ సమావేశానికి ముందు సీమాంధ్ర కేంద్రమంత్రులకు కిరణ్ ఫోన్ చేసి విభజనపై రెండు ప్రతిపాదనలు ముందించినట్లుగా తెలుస్తోంది. పది జిల్లాల తెలంగాణకు కేంద్రం కట్టుబడితే హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కోరాలని లేదంటే నాలుగు జిల్లాలతో కూడిన రాయలసీమను తెలంగాణలో కలిపి పద్నాలుగు జిల్లాలతో రాయల తెలంగాణను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయాలని సూచించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
విభజన అనివార్యమైన నేపథ్యంలో పై రెండు ప్రతిపాదనలలో దేనినైనా అంగీకరించవచ్చునని వారికి కిరణ్ సూచించారట. కేంద్ర జౌళీశాఖ మంత్రి కావూరి సాంబశివ రావు నివాసంలో సీమాంధ్ర మంత్రులు భేటీ అయినప్పుడు హైదరాబాద్ను యూటి చేయడం, రాయల తెలంగాణ ప్రతిపాదనలపై చర్చకు వచ్చిన విషయం తెలిసిందే.
కిరణ్ మాత్రం హైదరాబాదు యూటి, రాయలసీమ నాలుగు జిల్లాలను తెలంగాణలో కలిపితే అంగీకరించవచ్చునని సూచించారట. కిరణ్ ఈ రెండు ఆఫర్స్కు కేబినెట్లో అంగీకారం లభించనప్పటికీ ఆయన ప్రతిపాదనతో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు షాకయ్యారంటున్నారు. సమైక్యవాదం బలంగా వినిపిస్తున్న కిరణ్ ఎన్నికల వరకు ఏ సమయంలోనైనా రాష్ట్ర విభజన అడ్డుకుంటారని తాము భావిస్తుంటే విభజనకు రెండు ప్రతిపాదనలు చేయడమేమిటని ఆశ్చర్యపోతున్నారట.