కెసిఆర్ ఇలాకాలో కోదండరామ్: కోట బద్దలు కొడ్తారా?
అమరుల స్ఫూర్తి యాత్రను కోదండరామ్ వ్యూహాత్మకంగా ప్రారంభించినట్లు అర్థమవుతోంది. ఆయన యాత్రకు లభించిన స్పందనపై కెసిఆర్ ఆరా తీస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ తొలి విడత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును టార్గెట్ చేసుకున్నారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు హరీష్ రావు, కెటి రామారావులను కూడా ఆయన లక్ష్యంగా ఎంచుకున్నట్లు అర్థమవుతోంది.
అమరుల స్ఫూర్తి యాత్ర పేరుతో నాలుగు రోజుల పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలో నిర్వహించిన ఆయన నిర్వహించిన యాత్రకు విశేష స్పందన లభించింది. దీంతో ఆయన యాత్రపై కెసిఆర్ ఆరా తీస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా, హరీష్ రావు, కెటిఆర్లను ఆయన అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది.
ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలను కొట్టేసినట్లుగా కోదండరామ్ ఆరోపణలను, విమర్శలను కొట్టేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేతలకు లేదు. కోదండరామ్ మాటలకు ప్రజల్లో ఇంకా విలువ ఉంది. దాంతో కెసిఆర్ కాస్తా జాగ్రత్తగా వ్యవరించాల్సిన పరిస్థితే ఉంటుంది.
తొలి విడత కెసిఆర్ సొంత జిల్లాలో కోదండరామ్ తన యాత్రను ప్రారంభించి, నాలుగు రోజుల పాటు కొనసాగించారు. కెసిఆర్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రికార్డు మెజారిటీతో గెలుస్తూ వస్తున్న మంత్రి హరీష్ రావు కోటలో ఆయన యాత్ర సాగింది. రెండో విడత ఆయన కెటిఆర్ కోట సిరిసిల్లలో ప్రారంభించనున్నారు.
అలా చెప్పినా...
‘అమరవీరుల స్ఫూర్తియాత్ర' పేరిట కోదండరామ్ తొలి విడత పర్యటన విజయం సాధించిందనే చెప్పాలి. ఆ యాత్ర ప్రదానోదేశ్యం ప్రజా సమస్యలను తెలుసుకోవడం, రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అధ్యయనం చేయడమని ఆయన చెప్పారు. కానీ యాత్ర మొదటిరోజునే సంగారెడ్డి పట్టణంలో జెఎసి అధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో తెరాస ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
మిషన్ భగీరథపై నిప్పులు...
కెసిఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెబుకుంటున్న మిషన్ భగీరథను కెసిఆర్ లక్ష్యం చేసుకున్నారు. మిషన్ భగీరథలో దుబారాను అరికడితే సుమారు 30,000 కోట్లు అదా అవుతుందని, ఆ డబ్బులతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించవచ్చని అన్నారు. ప్రభుత్వం ప్రాజెక్టుల పేరు చెప్పి రైతులను నుంచి బలవంతంగా భూములు గుంజుకొని వాటిని పారిశ్రామికవేత్తలకు, కార్పోరేట్ సంస్థలకు కెసిఆర్ ప్రభుత్వం పంచిపెడుతోందని, కానీ దళిత కుటుంబాలకు 3 ఎకరాల భూమి ఇవ్వడానికి భూమి దొరకడం లేదని చెబుతోందని అన్నారు.
మూడేళ్లయినా...
తెరాస అధికారంలోకి వచ్చి మూడేళ్ళు పూర్తయినా లక్ష ఉద్యోగాలను భర్తీ చేయలేకపోయిందని కోదండరామ్ విమర్శించారు. విద్యార్ధులు, నిరుద్యోగులు, రైతులు అన్ని వర్గాలలో తెరాస ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి చోటు చేసుకుందని అన్నారు. ప్రభుత్వం మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్లు సాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
కెసిఆర్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి
కెసిఆర్ ప్రభుత్వంపై కోదండరామ్కు తీవ్రమైన ఆసంతృప్తి ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించబోమని, వాటిపై తనకు ఆసక్తి లేదని చెబుతున్న కోదండరామ్ తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ దుమారం రేపుతున్నారు. ఇది ఎటు దారి తీస్తుందనేది తెలియడం లేదు.
రెండో విడత కెటిఆర్ టార్గెట్
అమరుల స్ఫూర్తి యాత్రలో రెండో దశ చేపట్టేందుకు టీజేఏసీ చైర్మన్ ఎం.కోదండరామ్ సిద్ధమయ్యారు. మొదటి దశ యాత్ర ముఖ్యమంత్రి సొంత జిల్లాలో చేపట్టిన ఆయన, రెండో దశ యాత్రను మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి ప్రారంభించబోతున్నారు. జూలై 8న ప్రారంభం కానున్న ఈ యాత్ర మూడు రోజులు సాగి 10వ తేదీన ముగియనుంది.
వ్యూహాత్మకంగా కోదండరామ్....
తన యాత్రను కోదండరామ్ వ్యూహాత్మకంగా సాగిస్తున్నట్లు అర్థమవుతోంది. కెసిఆర్, హరీష్ రావులకు చెందిన కోటలో లభించే స్పందనను చూసి ముందుకు అడుగేయాలనే ఉద్దేశంతో ఆయన యాత్రను ప్రారంభించినట్లు అర్తమవుతోంది. అంతే కాకుండా, అక్కడి ప్రజలను కదిలిస్తే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను కదిలించడం సులభమవుతుందని కూడా ఆయన భావించి ఉండవచ్చు. తొలి విడత యాత్ర ఫలితం ఇవ్వడంతో రెండో విడత యాత్రలో కెటిఆర్ను సవాల్ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.