కెసిఆర్ వారసుడు కెటిఆరే: రాజీకి హరీష్, కవిత?
కెటిఆర్ నాయకత్వానికి హరీష్ రావు, కవితల నుంచి ఆటంకాలు తొలగినట్లు చెబుతున్నారు. అందువల్లనే కెటిఆర్ పార్టీ సభల్లో దూకుడు పెంచారని సమాచారం.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) చీఫ్ కె. చంద్రశేఖర రావు వారసుడిగా ఆయన కుమారుడు కెటి రామారావు దూసుకొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీ కార్యక్రమాల్లో ఆయనే చురుగ్గా పాల్గొనడం ఇందుకు సంకేతంగా చెబుతున్నారు. వచ్చే ఎన్నికలను తెలంగాణ రాష్ట్ర సమితి ఆయన నాయకత్వంలోనే ఎదుర్కునే సూచనలు కనిపిస్తున్నాయి.
కెటిఆర్ను ముందుకు పెట్టడానికి కెసిఆర్ మేనల్లుడు హరీష్ రావు, కూతురు కల్వకుంట్ల కవిత అంగీకరించినట్లు తెలుస్తోంది. నాయకత్వం కోసం కుటుంబంలో చిచ్చు రగలకుండా కెసిఆర్ ఇప్పటికే జాగ్రత్తలు తీసుకున్నట్లు చెబుతున్నారు. ఆ కారణంగానే హరీష్, కవిత కెటిఆర్ను అంగీకరించడానికి ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూరు బహిరంగ సభ వేదికను కెటిఆర్, సోదరి కవిత కలిసి పంచుకోవడం అందులో భాగంగానే జరిగిందని అంటున్నారు. తొలిసారి వారిద్దరు ఒకే వేదికను పంచుకున్నారు. నిజానికి, రాజకీయాల్లోకి పట్టుబట్టి కవిత వచ్చారు. తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేసుకుని, బతుకమ్మను ఒక ఉద్యమంగా మార్చి తన ప్రవేశాన్ని అనివార్యం చేశారు. అయితే, కెటిఆర్కు పోటీకి రాకుండా కెసిఆర్ జాగ్రత్తలు తీసుకున్నట్లు చెబుతున్నారు..
ఇప్పటికే కెటిఆర్పై ఆ ప్రచారం...
కెసిఆర్కు తానే వారసుడిని అనే విధంగా కెటిఆర్ ఇటీవలి ప్రసంగాలు సాగుతున్నాయి. వరుసగా ఆయన ఎన్నికల సభల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వ పథకాలను, హమీలను ప్రస్తావిస్తూ తాము ప్రజలకు చేస్తున్న మంచి పనుల గురించి వివరిస్తున్నారు. ప్రతిపక్షాలపై తన వాగ్ధాటితో విమర్శలను పెంచారు. గురువారం జరిగిన ఆర్మూరు సభ ఎన్నికల సభను తలపించేలా జరిగింది.
వరుసగా సభల్లో కెటిఆర్...
నియోజకవర్గ కేంద్రాల్లో తెరాస ఇటీవల నిర్వహిస్తున్న బహిరంగ సభల్లో కెటిఆర్ పాల్గొంటున్నారు. ఇప్పటికే ఆయన పెద్దపల్లి, తాండూరు, కొల్లాపూర్, సభల్లో పాల్గొన్నారు. తాజాగా గురువారం ఆర్మూరు సభలో పాల్గొన్నారు. దీనికి ఎన్నికల సభను తలపించేలా జనసమీకరణ జరిగింది. పార్టీకి నాయకత్వం వహించేది తానే అనే రీతిలో ఆయన ఈ సభలో మాట్లాడారు. ఆయనకు ముందు ప్రసంగించిన నేతలు కూడా కెసిఆర్ వారసుడు కెటిఆర్ అనే పద్దతిలోనే మాట్లాడారు. చివరగా ప్రసంగించిన కెటిఆర్ మీ అందరి ఆశీర్వాదం ఉండాలని చివరగా మాట్లాడి సంకేతాలు ఇచ్చారు.
తన భాషను మార్చుకున్న కెటిఆర్...
కెటిఆర్ ఆర్మూరు సభలో ప్రభుత్వ కార్యక్రమాలను వివరిస్తూనే ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలపై ఆయన దుమ్మెత్తి పోశారు. తన ప్రసంగం ద్వారా ఆయన కెసిఆర్ శైలిని తలపించారు. పూర్తిగా ఆయన భాష కూడా మారింది. ప్రజలకు దగ్గరయ్యే విధంగా కెటిఆర్ మాట్లాడారు. కెసిఆర్ విసిరేలాంటి చెణుకులు, యాస ఆయనలో కనిపించింది.
నారా లోకేష్ మాదిరిగానే కెటిఆర్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తన కుమారుడు నారా లోకేష్ను తొలుత పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా చేసి, మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు లోకేష్ పార్టీ భవిష్యత్తు గురించి మంత్రులతోనూ, సీనియర్ నేతలతోనూ మాట్లాడుతున్నారు. వారికి సూచనలు చేస్తున్నారు. అదే తరహాలో కెటిఆర్ వ్యవహరిస్తున్నారు. ముందుగానే మంత్రి పదవి చేపట్టిన కెటిఆర్ ఇప్పుడు పార్టీ పగ్గాలను కూడా తన చేతుల్లోకి తీసుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శిగానా, వర్కింగ్ ప్రెసిండెట్గానా అనేది సాంకేతికపరమైందే తప్ప అంతా తానై పార్టీని నడిపించడానికి ఏర్పాట్లు జరిగిపోయినట్లు చెబుతున్నారు.
కెటిఆర్ విషయంలో హరీష్ సరేనన్నారు...
పార్టీ నాయకత్వాన్ని కెటిఆర్కు అప్పగించడానికి హరీష్ రావు కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఆయన ఇటీవల తన మామ నిర్ణయం శిరోధార్యమని చెప్పిన విషయం తెలిసిందే. అందువల్ల కెటిఆర్కు కెసిఆర్ వారసుడిగా ముందుకు రావడానికి అడ్డంకులు తొలగాయని భావిస్తున్నారు. ఇప్పుడు కెటిఆర్ ప్రజల ఆమోదం కోసం సభల్లో చురుగ్గా పాల్గొంటున్నట్లు సమాచారం.