పిల్లోడి చేతిలో హైదరాబాద్: కెసిఆర్కు కెటిఆర్ థ్యాంక్స్
హైదరాబాద్: తనకు మున్సిపల్ శాఖను అప్పగిస్తానని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యల పైన ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పందించారు. ఈ వ్యాఖ్యలు తన బాధ్యతను మరింత పెంచుతున్నాయన్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటనను తాను సవినయంగా స్వీకరిస్తున్నానని చెప్పారు. ఆదివారం నాడు పరేడ్ మైదానంలోని బహిరంగ సభలో కెసిఆర్ మాట్లాడుతూ... ఈ ఎన్నికల కోసం తన కొడుకు కేటీఆర్ నగరమంతా తిరిగాడని, పార్టీ ప్రచార బాధ్యతను భుజాలకెత్తుకుని నడిపించాడని, నగరాన్ని అభివృద్ది చేసేందుకు తన వద్ద ఉన్న మున్సిపల్ శాఖను ఆయనకు అప్పగిస్తానని చెప్పారు.
కెటిఆర్ తన కొడుకు అని, పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నాడని, కానీ హైదరాబాద్ ప్రచారం భుజాల మీద వేసుకున్నాడని, ప్రస్తుతం మున్సిపల్ శాఖ తన వద్ద ఉందని, ఆ శాఖను ఆ పిల్లోనికి ఇచ్చి, హైదరాబాద్ నగరాన్ని అతని చేతిలో పెడతానని కెసిఆర్ అన్నారు.
నగరమంతా తిరిగి తెలుసుకున్నాడు కాబట్టి నగరాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయగలడని, అభివృద్ధి చేసి చూపిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు.
దీనిపై కెటిఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ బాధ్యతలను నెరవేరుస్తానని కెటిఆర్ చెప్పారు. సీఎం కెసిఆర్ ప్రకటనను సవినయంగా స్వీకరిస్తున్నానని శనివారం రాత్రి విడుదల చేసిన ఓ ప్రకటనలో కెటిఆర్ చెప్పారు. తనకు గురుతర బాధ్యత అఫ్పజెప్పిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు అని, హైదరాబాద్ నగరంలో పెరిగిన నగర వాసిగా, పౌరుడిగా ఈ శాఖ నా బాధ్యతను మరింత పెంచుతుందని తెలిపారు.