కుప్పం ఫైలు: చంద్రబాబు వర్సెస్ అచ్చెన్నాయుడు
హైదరాబాద్: కుప్పం ఫైలు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నిర్ణయాన్ని కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యతిరేకించడమే ఆ సంచలనానికి కారణం. అయితే, ముఖ్యమంత్రి నిర్ణయం అమలవుతుందా, మంత్రి నిర్ణయం అమలవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించిన వార్తాకథనం మీడియాలో వచ్చింది.
వెనుకబడిన ప్రాంతమైన తన కుప్పం నియోజకవర్గంలో నిర్మాణ కార్మికుల కోసం శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. హైదరాబాద్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(న్యాక్) తరహాలో అన్ని సదుపాయాలతో శిక్షణ కేంద్రం ఏర్పాటుకు రూ.15 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. దీనికి కార్మిక శాఖ పరిధిలో ఉన్న భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి నిదులు మంజూరు చేయాలని సీఎం నిర్దేశించారు. ఈ మేరకు ఫైలు కార్మిక శాఖకు వెళ్లింది.
అయితే, కార్మిక శాఖ అధికారులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిధి నుంచి కేవలం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ కార్యక్రమాలకు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఇటీవల సుప్రీం కోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని చెబుతున్నారు. అందువల్ల భవన నిర్మాణానికి ఈ నిధి నుంచి డబ్బు ఇవ్వలేమని కార్మిక శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫైలుపై నోట్ రాశారు.
కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటిస్తూ అది నిర్మాణ పని కాబట్టి రోడ్డు భవనాల శాఖ నుంచి నిధులు సమకూర్చుకోవచ్చని సూచన కూడా చేశారని తెలిసింది. చట్టంలోని నిబంధనలు, సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ కార్మిక సంక్షేమ నిధి నుంచి డబ్బు ఇవ్వడం కుదరదని మంత్రి స్పష్టం చేశారు.
ఈ వ్యవహారం అక్కడ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్దకు వెళ్లింది. చీఫ్ సెక్రెటరీ కూడా సీఎం ప్రతిపాదనను బలపరుస్తూ కార్మిక సంక్షేమ నిధి నుంచి రూ.15 కోట్లను విడుదల చేయవచ్చని ఫైలుపై రాశారు. తుది నిర్ణయం కోసం ఫైలును సీఎం వద్దకు పంపారు. ముఖ్యమంత్రి కూడా ప్రధాన కార్యదర్శి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నానని పేర్కొంటూ, కార్మిక శాఖ మంత్రి సూచనను తోసిపుచ్చారు.
దీంతో నిధులు విడుదల చేస్తే సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించినట్లవుతుందా అన్న అనుమానం కూడా తలెత్తడంతో ఈ ఫైలును న్యాయసలహా కోసం పంపినట్లు తెలుస్తోంది.