సీమాంధ్ర రాజధానిపై కేంద్రమంత్రుల ఢీ, లాబీయింగ్
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అనివార్యమని భావిస్తున్న సీమాంధ్ర కేంద్రమంత్రులు ఇక కొత్త రాజధాని పైన దృష్టి సారించారు. పలువురు కేంద్రమంత్రులు రాజధానులను తమ పట్టణాలలో ఏర్పాటు చేయించేందుకు లాబీయింగ్ ప్రారంభించినట్లుగా కనిపిస్తోంది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు తదితర నగరాలను రాజధానిగా చేయాలనే డిమాండ్లు జోరుగా వినిపిస్తున్నాయి.
సీమాంధ్ర రాష్ట్రానికి విశాఖపట్నాన్ని రాజధానిగా తక్షణం ప్రకటించాలని కిషోర్ చంద్రదేవ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రుల బృందాన్ని కలిసి ప్రత్యేక నివేదిక సమర్పించారు. సోమవారం సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులతో జివోఎం భేటీ అయ్యింది. వీరితోపాటు భేటీకి హాజరైనప్పటికీ కిశోర్ చంద్రదేవ్ వారితో కలవలేదు. ఎనిమిది మంది మంత్రులు జివోఎంకు ఇచ్చిన లేఖ, నివేదికలపై సంతకం పెట్టలేదు.
విభజన అనివార్యమైతే సీమాంధ్రకు విజయవాడ - గుంటూరు మధ్యే కొత్త రాజధాని నిర్మించాలని కేంద్రమంత్రి పనబాక లక్ష్మి డిమాండ్ చేశారు. ఈ మేరకు జివోఎంకు ఆమె ప్రత్యేకంగా నివేదిక సమర్పించారు. 'విజయవాడ సీమాంధ్రకు సరిగ్గా మధ్యలో ఉంది. రాజధాని ఏర్పాటుకు అదే సరైన నగరం. అక్కడ స్థలం కొరత ఉంది కాబట్టి హైదరాబాద్ జిహెచ్ఎంసి చేసినట్లుగా విజయవాడ పరిధిని విజిటిఎం వుడాకు విస్తరించాలి. హైదరాబాద్-సికింద్రాబాద్లాగా విజయవాడ-గుంటూరు జంటనగరాలు ఏర్పడతాయి. వీటి మధ్యలో హుస్సేన్సాగర్లాగా కృష్ణా నది ఉంటుంది' అనేది పనబాక వాదన.
కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సీమాంధ్ర కొత్త రాజధానిని కర్నూలులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు తాము రాజధానిని తెలంగాణకు కోల్పోయామని, ఇంకోసారి కోల్పోవడానికి సిద్ధంగా లేమనేది సీమ నేతల వాదన. అందుకోసమే వారు కర్నూలు కోసం పట్టుబడుతున్నారు. రాయల తెలంగాణ అంటున్న జెసి దివాకర్ రెడ్డి కూడా సీమాంధ్ర రాష్ట్రం అయితే కర్నూలును రాజధాని చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పురంధేశ్వరి విజయవాడను రాజధానిగా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.