పోలవరం బిల్లు: కెవిపి హల్చల్, చదివేసిన చిరు
కెవిపికి కేటాయించిన వ్యవధి పూర్తికాగానే ఆపి వేసి కూర్చోవలసిందిగా కురియన్ ఆదేశించారు. ఆయితే తన వాదనను పూర్తిగా విని తీరాలని కెవిపి పట్టుపట్టారు. అయితే కురియన్ అందుకు అంగీకరించలేదు. కెవిపి తన ప్రసంగాన్ని ఆపకుండా చదవటం కొనసాగించటంతో కురియన్ అసహనానికి లోనయ్యారు. కెవిపి ఒక్కసారిగా తన సీటు నుంచి లేచి వెల్లోకి దూసుకొచ్చారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని లేదా తన ప్రసంగం ప్రతిని ఆమోదించాలని డిమాండ్ చేశారు.
అయితే సభ్యుల ప్రసంగం ప్రతిని టేబుల్పై పెట్టి ఆమోదించే సంప్రదాయం లేదని కురియన్ తేల్చేశారు. కెవిపి డిమాండ్ను ఆమోదిస్తే తనకూ ఆ ఆవకాశం ఇవ్వాలని నినాదాలు చేస్తూ వి.హనుమంతరావు కూడా వెల్లోకి వచ్చే ప్రయత్నం చేయటంతో సభలోని కాంగ్రెస్ సభ్యుల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ప్రతిపక్ష నాయకుడు గులామ్ నబీ అజాద్ సూచన మేరకు సీనియర్ నాయకులు సుబ్బిరామి రెడ్డి, జెడి.శీలం తదితరులు కేవీపీని బుజ్జగించి వెనక్కి తీసుకువచ్చారు. రామచంద్రరావు తన స్థానానికి తిరిగి వెళ్తూ తన ప్రసంగం ప్రతిని సెక్రటరీ జనరల్ టేబుల్పైకి విసిరేశారు.
మాజీ మంత్రి చిరంజీవి కూడా ముందుగా తయారు చేసుకున్న ప్రసంగాన్ని చదివారు. ఆయనకు కేటాయించిన మూడు నిమిషాల వ్యవధి పూర్తికాగానే కురియన్ ఆయనను కూర్చోవలసిందిగా ఆదేశించారు. అయినా చిరంజీవి తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ దశలో సుబ్బిరామిరెడ్డి తన సమయాన్ని కూడా చిరంజీవికి విడిచిపెడుతున్నట్లు చెప్పారు.
ఈ వ్యవధి ముగిసిపోయిన తరువాత కూడా చిరంజీవి తయారు చేసుకువచ్చిన ప్రసంగాన్ని పూర్తి చేయలేకపోయారు. చిరంజీవి తన ఆదేశాన్ని ఖాతరు చేయకపోవటంతో కురియన్ ఆగ్రహంతో ఒకరు తయారు చేసి ఇచ్చిన ప్రసంగాన్ని చదవటం ఆపండని ఆదేశించారు.