వసుంధరకు పదవీగండం: చర్యలకు అమిత్ షా రెఢీ!
న్యూఢిల్లీ: ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ వ్యవహారంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే పైన వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి అవినీతిపరమైన కారణాలతో పాటు రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని సమాచారం.
వసుంధరకు - మోడీ, అమిత్ షాలకు మధ్య దూరం నెలకొంది. ఈ ప్రభావం పడనుందని తెలుస్తోంది. రాజస్థాన్లో బీజేపీ 25 లోకసభ స్థానాలు గెలుచుకుంది. అయినప్పటికీ మోడీకీ, వసుంధరకు మధ్య మంచి సంబంధాలు లేవు. వసుంధర కంటే ఆమె వ్యతిరేక వర్గానికి నేతృత్వం వహిస్తున్న ఓంమాథుర్తో అమిత్ షాకు సన్నిహితం ఎక్కువ.
తన కుమారుడు దుష్యంత్కు మంత్రి పదవి ఇవ్వాలని వసుంధర చెప్పినప్పటికీ మోడీ పట్టించుకోలేదు. ఆమె వ్యతిరేక లేదా తటస్థ వైఖరి కలిగిన ఇద్దరు ఎంపీలు నిహాల్ చంద్, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్లను మంత్రి పదవులు వరించాయి. ఓంమాథుర్కు ఆరెస్సెస్తోను మంచి సంబంధాలున్నాయి.
మరోవైపు, లలిత్ మోడీ వ్యవహారంతో వసుంధర వ్యవహారంతో బీజేపీ కూడా ఇరుకున పడినట్టయ్యింది. లలిత్ మోడీతో రాజెకు వ్యాపార సంబంధాలున్నట్టు రుజువు కావటంతో పార్టీ హైకమాండ్ ఖంగుతింది. లలిత్ మోడీతో ఉన్న వ్యాపార సంబంధాలు బయటపడిన వెంటనే పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు ఫోన్ చేసి రాజె వివరణ ఇచ్చుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే రాజె ఇచ్చిన వివరణతో అమిత్ షా సంతృప్తి చెందలేదని తెలిసింది. ఈ కారణంగానే నిజానిజాలు పూర్తిగా బయటపడేంత వరకూ రాజెకు అనుకూలంగా ఎవ్వరూ ఎలాంటి ప్రకటనలు చేయరాదని పార్టీ నాయకత్వం పంపాల్సిన తీరులో సందేశాన్ని పంపినట్టు చెబుతున్నారు.
రాజే తనకు అత్యంత సన్నిహితురాలని లలిత్ మోడీ ప్రకటించటం, లండన్లో ఉంటున్న మోడీ పోర్చుగల్ వెళ్లటానికి అవసరమైన కొన్ని పత్రాలపై రాజె సంతకాలు చేయటం పార్టీ నాయకత్వానికి మింగుడు పడటం లేదు. రాజెపై వచ్చిన అభియోగాలపై విచారించి తగిన చర్యలు తీసుకునే బాధ్యతను ప్రధాని ఆదేశాల మేరకు అమిత్ షా తీసుకుంటారని తెలిసింది.
వసుంధర రాజె కుమారుడు, పార్లమెంట్ సభ్యుడైన దుష్యంత్కు చెందిన కంపెనీలో లలిత్ మోడీ పదకొండు కోట్లు పెట్టుబడిగా పెట్టినట్టు బయటపడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్తో ఆనంద్ పుర్లో వసుంధర వేదికను పంచుకోలేదు.