రాముడు క్రీపూ5114 జనవరి 10న పుట్టారు, లెక్కేశారు
న్యూఢిల్లీ: శ్రీరాముడు ఎప్పుడు పుట్టాడో ఘడియలు సహా తమకు తెలుసంటున్నది ఓ పరిశోధన సంస్థ. రామాయణం, మహాభారతం పుక్కిటి పురాణాలు కావని, వాస్తవంగా జరిగినవేనని బల్లగుద్దిమరీ చెబుతోంది. అశోకవనంలో సీతాదేవిని హనుమంతుడు ఎప్పుడు కలిశాడో కూడా చెబుతున్నారు.
వీరి లెక్కల ప్రకారం రాముడు క్రీస్తు పూర్వం 5,114 సంవత్సరంలో జనవరి 10వ తేదీన మధ్యాహ్నం 12.05 గంటలకు జన్మించాడు. లంకలోని అశోకవనంలో సీతాతల్లిని ఆంజనేయుడు క్రీస్తు పూర్వం 5,076వ సంవత్సరం సెప్టెంబర్ 12న కలిశాడని ఆ సంస్థ లెక్కలేసింది.
మహాభారత యుద్ధం క్రీస్తుపూర్వం 3,139, అక్టోబర్ 13 నుంచి ప్రారంభమైందని పేర్కొంది. రుగ్వేదం నుంచి రోబోటిక్స్దాకా అనే పేరుతో ఒక ఎగ్జిబిషన్ను ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రిసెర్చ్ అనే సంస్థ ఢిల్లీలోని లలిత కళా అకాడెమీలో ఏర్పాటు చేసింది.
గురువారం ఈ ఎగ్జిబిషన్ను ప్రారంభించిన కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి మహేశ్ శర్మ ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నామని, పూర్తి వివరాలను నివేదిక రూపంలో అందించాలని సంస్థను కోరామని చెప్పారు.
అమెరికా నుంచి ఏడు వేల రూపాయలకు కొనుగోలు చేసిన ఒక సాఫ్ట్వేర్, పరిశోధన సహాయంతో తాము గ్రహాల గమనాలను అంచనా వేసి ఈ తేదీలను రూపొందించామని సంస్థ డైరెక్టర్ సరోజ్ బాల చెప్పారు. ఈ ఎగ్జిబిషన్ను ఆరెస్సెస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి కృష్ణగోపాల్తో కలిసి కేంద్ర మంత్రి మహేష్ ప్రారంభించారు.
మహాభారతం, రామాయణం ఉనికిపై ప్రశ్నలకు ఈ ఎగ్జిబిషన్ శాస్త్రీయ సమాధానాలు ఇస్తుందని కేంద్ర మంత్రి మహేశ్ శర్మ చెప్పారు. రామాయణ, మహాభారతాలు పురాణాలు కాదని చారిత్రక గ్రంథాలని ఆ సంస్థ అంటోంది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రిసెర్చ్ అనే ఈ సంస్థ నిరూపించడానికి సాధ్యం కావని చరిత్రకారులు ఇప్పటివరకు చెప్తూ వచ్చిన అనేక విషయాలను సాక్ష్యాధారాలతో వెల్లడించింది.
కాగా, క్రీస్తుపూర్వం ఏడువేల సంవత్సరాలలోనే మెహర్గఢ్ ప్రాంతంలో దంతవైద్య శాస్త్రం ఉందనేదానికి సంబంధించి ప్రాథమిక సాక్ష్యాధారాలను, అశోకవనంలో హనుమంతుడు సీతను చూసిన సమయంలో చంద్రగ్రహణం సంభవించిన విషయాన్ని, అలాగే క్రీస్తుపూర్వం 3153లో పాండవులు జూదంలో సర్వస్వం కోల్పోయి అరణ్యవాసానికి బయలుదేరినప్పుడు సూర్య గ్రహణం సంభవించిందని చెప్పడానికి ఖగోళశాస్త్ర ఆధారాలతో రూపొందించిన చార్ట్లు, రాముడికి ముందు పాలించిన 63 మందిని, ఆ తర్వాత ఉండిన 59 మంది చక్రవర్తుల గుర్తింపు లాంటి అంశాలు ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శించినట్లు తెలుస్తోంది.