ఒక రాకెట్ ద్వారా 104 ప్రయోగం ముప్పు: మాధవన్ నాయర్ ఇలా...
ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించిన ఇస్రోపై ప్రశంసల జల్లు కురుస్తుంటే ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్ మరో విధంగా వాదిస్తున్నారు.
బెంగళూరు: ఒకే రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలను ఏక కాలంలో అంతరిక్షంలోకి పంపిన ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే ఇస్రో మాజీ చైర్మన్ జి. మాధవన్ నాయర్ వాదన మాత్రం మరో రకంగా ఉంది.
ఆ ప్రయోగంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, ఇస్రోకు 400 ఉపగ్రహాలను పంపించే శక్తిసామర్థ్యాలు ఉన్నాయని ప్రయోగం విజయవంతమైన రోజున మాత్రం ప్రశంసించారు. అయితే, ఇప్పుడు మరో రకంగా అంటున్నారు. ముందుచూపు లేకుండా ఇటువంటి ప్రయోగాలు చేపట్టడం సరి కాదని ఆయన వ్యాఖ్యానించారు.
ఆ విషయంపై ఆయన ఓ వార్తాసంస్థతో ఫోన్లో మాట్లాడారు. ఇస్రో ప్రయోగం వల్ల భవిష్యత్తులో తలెత్తే సమస్యల గురించి ఆయన చెప్పారు. ఇటీవలి ఇస్రో ప్రయోగంతో మన సామర్థ్యం ప్రపంచాకికి తెలిసి వచ్చింది. ఇలాంటివి వందేం కాదు, 400 ఉపగ్రహాలను పంపించే సామర్థ్యం మనకు ఉందని మరోసారి అంటూనే ఆయన భవిష్యత్తు ప్రమాదంపై మాట్లాడారు.
ఈ ప్రయోగాలు ముప్పే...
ఇలాంటి ప్రయోగాలు చేసే ముందు వాటివల్ల భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలపై కూడా దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. మొన్న మనం ప్రవేశపెట్టిన 104 ఉపగ్రహాల్లో కేవలం మూడు మాత్రమే మనవని, మిగతా 101 విదేశాలవని ఆయన చెప్పారు .
వాటిలో 88 నానో ఉపగ్రహాలు...
వాటిలోనూ 88 నానో ఉపగ్రహాలు అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీకి చెందినవని చెప్పారు. డబ్బులు వస్తున్నాయి కదా అని ఇష్టం వచ్చినట్లు ఉపగ్రహాలను పంపుతూ పోతే భవిష్యత్తులో మనకే ముప్పు రావచ్చునని నాయర్ అన్నారు.
ఆ ఉపగ్రహాల వల్ల ఈ ప్రమాదం...
నానో ఉపగ్రహాలు స్వల్పకాలిక ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగపడుతాయని, అవి జంక్ అవుతాయని, ఆ తర్వాత ఏళ్ల తరబడి అంతరిక్షంలో తేలియాడుతూ ఉంటాయని, దావివల్ల ఇస్రో అదే కక్ష్ల్యలో తిరిగే ఇస్రో ఆపరేషనల్ శాటిలైట్స్ను ఢీకొట్టే ప్రమాదం ఉందని మాధవన్ నాయర్ చెప్పారు.
మన ఉపగ్రహాల సేఫ్టీ ముఖ్యం...
నానో ఉపగ్రహాలు బ్రీఫ్ కేసు అంతగా మాత్రమే ఉంటాయని, అవి స్వల్ప కాలం పనిచేసే ఆ తర్వాత వదిలే చెత్త వల్ల మన ఉపగ్రహాలు దెబ్బ తినే ప్రమాదం ఉందని మాధవన్ నాయర్ అన్నారు. మన ఉపగ్రహాల భద్రత ముఖ్యమని ఆయన అన్నారు.
అవి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్కు ముప్పు
కొద్ది పాటి మిలియన్ డాలర్ల కోసం వాణిజ్య దృక్పథంతో అటువంటి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించే విషయంలో ఇస్రో జాగ్రత్త వహించాలని మాధవన్ హెచ్చరించారు. విదేశీ నానో ఉపగ్రహాలను 500 కిలోమీటర్ల కక్ష్యల్లోకి పంపించడం వల్ల ప్రస్తుతం ఉన్న, భవిష్యత్తులో పంపించే ఎర్త్ అబ్జర్వేన్ శాటిలైట్స్కు ప్రమాదం వాటిల్లవచ్చునని ఆయన అన్నారు.
అలా జరిగితే తీవ్ర నష్టం..
నానో ఉపగ్రహాల విషయంలో మరో ప్రమాదం కూడా ఉందని మాధవన్ నాయర్ అన్నారు. ఈ నానో ఉపగ్రహాల వ్యర్థాలు ఇతర దేశాలకు చెందిన వర్కింగ్ శాటిలైట్స్ను ఢీకొడితే వాటికి నష్టం జరగవచ్చునని, అప్పుడు విదేశాలకు భారత్ పెద్ద యెత్తున నష్టం రూపేణా చెల్లించాల్సి వస్తుందని అన్నారు.