వస్తే అంతులేని నష్టం: భారత్కు భారీభూకంప ముప్పు
ఢిల్లీ: భారత్లోని తూర్పు భాగం, బంగ్లాదేశ్ల కింద భారీ భూకంపం వచ్చే ప్రమాదం ఉందని ఒక అధ్యయనం తెలిపింది. ఈ విపత్తు తలెత్తితే దాదాపు 14 కోట్ల మంది ప్రాణాలు ప్రమాదంలో పడతాయని పేర్కొంది. ఈ భూకంపం తప్పనిసరిగా వస్తుందని కాదని, అయితే వచ్చే అవకాశాలున్నాయని పేర్కొంది.
బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని భూమి అంతర్భాగంలో ఇది ఏర్పడే ప్రమాదముందని కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో తేలింది. భూమి అడుగున ఉన్న టెక్టానిక్ట్ ప్లేట్ల మధ్య ఒత్తిడి అధికంగా పెరుగుతోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
దీనివల్ల భారతలోని ఈశాన్య భారతంలోని పట్టణ ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతాయని హెచ్చరించారు. దీనివల్ల అనేక దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ముఖ్యంగా ప్రధాన నదుల్లోని నీటి మట్టాల్లో, నీటి ప్రవాహాల్లో గణనీయమార్పులు చోటుచేసుకుంటాయన్నారు.
ముఖ్యంగా బంగ్లాదేశ్లో నియంత్రణలేని, పేలవమైన భవన నిర్మాణాలు, భారీ పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, సహజవాయు క్షేత్రాల్లోని నిర్మాణాలు దెబ్బతినే అవకాశముందన్నారు. భూమి పొరల్లోని టెక్టానిక్ట్ ప్లేట్లు కుంగిపోవడం వల్ల ఆ భూభాగంలో ఒత్తిడి పెరిగి, ఎక్కువగా భూకంపాలు సంభవిస్తున్నాయన్నారు.
గంగా, బ్రహ్మపుత్ర నదుల డెల్టాలో ఉపరితలం నుంచి 19 కిలోమీటర్ల లోపల కూరుకుపోయిన బురద మట్టి.. జిలాటిన్లా ఊగిపోతుందని దీని వల్ల అనేక ప్రాంతాలు జలమయంగా మారుతాయని హెచ్చరించారు. భవనాలు, రోడ్లు, ప్రజలు ఇందులో కూరుకుపోతారన్నారు. మొత్తంమీద 62వేల చ.కి.మీ. పరిధిలోని ప్రాంతంలో ముప్పు విస్తరించి ఉందన్నారు.
హిందూ మహాసముద్రంలోని భూకంపం, 2004లో సుమారు 2,30,000మందిని పొట్టన పెట్టుకున్న సునామీ, 2011 తొహోకూలో భూకంపం సంభవించిన ప్రాంతాలన్నీ ఇలా ఏర్పడినవేనని చెప్పారు. ఊహించని పరిణామాలు ఎదురైతే బీభత్సం తప్పదని, రిక్టర్ స్కేల్పై 8.2 కంటే ఎక్కువ తీవ్రతలో భూకంపం విరుచుకుపడుతుందన్నారు. ఇది 9 వరకు కూడా ఉండవచ్చునని పేర్కొన్నారు.