జగన్ కేసులో మోడీకి నోటీసులు: ఆంధ్రజ్యోతి ఎల్లో ఎత్తుగడ?
Recommended Video
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కేసులో ప్రధాని నరేంద్ర మోడీకి నోటీసులు జారీ అంటూ ఆంధ్రజ్యోతి రాసిన వార్తాకథనంపై సాక్షి మీడియా దుమ్మెత్తి పోసింది. ఆంధ్రజ్యోతి మీడియాను నేరుగా ప్రస్తావించకుండా ఎల్లో మీడియా అంటూ తీవ్రంగా విరుచుకుపడింది.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రాజీలేని పోరాటానికి పెరుగుతున్న ప్రజా మద్దతు చూసి ఓర్వలేని ఎల్లో మీడియా మరో దిగజారుడు ప్రచారానికి పూనుకుందని సాక్షి వ్యాఖ్యానించింది. చంద్రబాబు కోంస.. హోదా ఒత్తిడిలో ఎల్లో ఎత్తుగడ అనే శీర్షికతో ఆ వార్తాకథనాన్ని ప్రచురించింది.
బట్ట కాల్చి మీద వేస్తోంది...
బట్టకాల్చి ముఖాన వేసేందుకు ఎల్లో మీడియా విఫలయత్నం చేసిందంటూ సాక్షి మీడియా వ్యాఖ్యానించింది. జగన్ కేసులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి నోటీసులు వచ్చాయంటూ దీనికి జగన్ కారణమంటూ ఎల్లో మీడియా విషం చిమ్మే ప్రయత్న చేస్తోందని వ్యాఖ్యానించింది.
గతంలోనూ ఇలాగే...
ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం కాగానే ప్యారడైజ్ పేపర్ల పేరుతోనూ అనుకూల మీడియాలో జగన్పై దుష్ప్రచారం చేసేందుకు ఇలాగే ప్రయత్నించారని సాక్షి మీడియా రాసింది. విదేశాల్లో నత పేరుపై ఒక్క రూపాయి అస్తి ఉన్నట్లుు 15 రోజుల్లో నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, నిరూపించలేకపోతే సిఎం పదవికి చంద్రబాబు రాజీనామా చేస్తారా అని జగన్ సవాల్ చేస్తే తొక ముడిచి కూర్చున్నారని వ్యాఖ్యానించింది.
నంద్యాల ఎన్నికల సమయంలోనూ..
నంద్యాల ఎన్నికల సమయంలోనూ పోలింగుకు ఒక రోజు ముందు ఓటర్లను ప్రభావితం చేసే విధంగా కట్టుకథల ప్రచారం చేశారని సాక్షి మీడియా విమర్సించింది. జగన్ బిజెపిో జత కట్టబోతున్నారంటూ ఆంగ్లచానెల్లో ఓ వార్త ప్రసారం చేయించి, దాన్ని అందుకుని ఎల్లో మీడియా చెలరేగిపోయిందని వ్యాఖ్యానించింది. ఓ పక్క బిజెపితో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారాన్ని పంచుకుంటూ ముస్లిం ఓట్లు పడవనే భయంతో బిజెపి నాయకులను గానీ బిజెపి జెండాలను గానీ నంద్యాల కనబడనీయకుండా చేసిన చంద్రబాబు అదే సమయంలో జగన్పై కట్టుకథలను ప్రచారం చేయించారని ఆరోపించింది.
ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అలా..
తాము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత జగన్పై ఉన్నవీ లేనివీ కల్పించి దుష్ప్రచారం చేయడం, ఎల్లో మీడియా అభూత కల్పనలు, అసత్య కథనాలు ప్రచారం చేయడం అధికార పక్షానికి షరా మామూలుగా మారిందని సాక్షి తన వార్తాకథనంలో వ్యాఖ్యానించింది. హోదాతో పాటు అనేక అంశాల్లో చంద్రబాబుపై ప్రజావ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మారిషస్ కంపెనీ కథనాన్ని ప్రచారంలోకి తెచ్చారని విమర్శించింది.