మెడికో ఆత్మహత్య: అంగడిబొమ్మగా మార్చారా?
అనంతపురం: మెడికో మీనాక్షి అలియాస్ మంజుల ఆత్మహత్య కేసులో మరిన్ని వివరాలు వెలుగు చూశాయి. దిగ్భ్రాంతికరమైన విషయాలతో స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో మీనాక్షి భర్తగా చెబుకుంటున్న శ్రీనివాస్ చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
అనంతపురంలోని శ్రీనివాస్ నగర్లో ఇటీవల మీనాక్షి అలియాస్ మంజలు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఆమెను మరో వ్యక్తితో పంచుకున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఇద్దరు కలిసి ఆమెను ఆంగడిబొమ్మగా మార్చారని తెలుస్తోంది. ఓ శాసనసభ్యుడి వద్దకు, అతని ఇద్దరు మిత్రుల వద్దకు కూడా ఆమెను పంపినట్లు తెలుస్తోంది.
మంజుల సోమవారం ఆర్థరాత్రి అనుమానాస్పద స్థితిలో మణించింది. అయితే, దాన్ని ఆత్మహత్యగా చెబుతున్నారు. ఆమె మృతదేహాన్ని భర్తగా చెబుతున్న శ్రీనివాస్ చౌదరి అనే వ్యక్తి సోమవారం రాత్రి అనంతపురంలోని సర్వజనాస్పత్రి మార్చురీ ఎదుట పడేసి వెళ్లిపోయాడని మీడియాలో వార్తలు వచ్చాయి.
ఆమెను తొలుత బెంగళూరులో మెడిసిన్ చదువుతున్న మీనాక్షిగా భావించారు. అయితే ఆమె పుట్టపర్తి మండలం బత్తలపల్లికి చెందిన వడ్డె మారన్న కూతురిగా తేలింది. నిరుపేద కుటుంబంలో జన్మించిన మంజుల అదే గ్రామానికి చెందిన రాము (వెంకటరమణ చౌదరి)ని ప్రేమించింది. దాంతో అతను ఆమెను తన వెంట తీసుకుని వెళ్లాడు. అనంతపురం ఆర్టీసి, రైల్వే స్టేషన్లలో క్యాంటీన్లు నిర్వహించే తన బంధువైన శ్రీనివాస చౌదరి ఇంటికి ఆమెను తీసుకుని వెళ్లాడు. వారిద్దరికి అతను ఆశ్రయం ఇచ్చాడు.
మీడియా కథనాల ప్రకారం - మంజులపై కన్నేసిన శ్రీనివాస చౌదరి రామును ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి వారిద్దరు కూడా ఆమెతో గడుపుతూ వచ్చారు. వాటిని రహస్యంగా కెమెరాల్లో బంధించి ఆమెను బ్లాక్మెయిల్ చేస్తూ అంగడిబొమ్మగా మార్చారు. ఈ క్రమంలోనే ఆమెను ఓ శాసనసభ్యుడి వద్దకు పంపగా, అతను తనకు చెందిన మరో ఇద్దరు మిత్రుల వద్దకు కూడా పంపాడు.
ఈ వ్యవహారంతో తీవ్ర మనస్తాపానికి గురైన మంజులు శ్రీనివాస్ చౌదరి, రాములతో గొడవ పడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఆమె సోమవారం అర్థరాత్రి శవంగా మారింది. మీడియాలో వార్తాకథనాలు రావడంతో పోలీసులు శ్రీనివాస చౌదరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెబుతున్నారు.
మంజుల మృతదేహానికి ఎట్టకేలకు సర్వజనాస్పత్రి వైద్యులు గురువారం పోస్టుమార్టం చేశారు. మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు.