తన క్లాస్ విద్యార్థుల కోసం నగలు అమ్మిన ఉపాధ్యాయురాలు
దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరైన సదుపాయాలు ఉండవు. చదువుకునేందుకు ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలకు కూడా ఇబ్బందే.
చెన్నై: దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరైన సదుపాయాలు ఉండవు. చదువుకునేందుకు ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలకు కూడా ఇబ్బందే. ఉపాధ్యాయులు ఉన్న సదుపాయాలతో చదువు చెబుతారు.
అయితే, తమిళనాడులో ఓ ఉపాధ్యాయురాలు మాత్రం పిల్లలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ చదువు కోసం తన నగలు అమ్మి వేయాలని నిర్ణయించుకుంది. ఆమె పేరు అన్నపూర్ణ మోహన్. విల్లుపురంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువు చెబుతోంది.
తమ క్లాస్ పిల్లలకు మంచి విద్యను అందించేందుకు తన నగలను అమ్మివేసింది. తద్వారా తన క్లాస్ రూంకు ఇంటర్నేషనల్ లుక్ ఇవ్వాలని భావించింది.
ఆమె మూడో తరగతి క్లాస్ టీచర్. ఆ తరగతి గదిలో ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. స్మార్ట్ బోర్డు, ఫర్నీచర్ తదితర అన్ని సౌకర్యాలను కల్పించింది. ప్రయివేటు స్కూల్లో పిల్లలకు ఉండే సౌకర్యాలకు ధీటుగా తీసుకు వచ్చింది.
ఆమె ప్రయత్నం తోటి ఉపాధ్యాయులను, పిల్లల తల్లిదండ్రులను అందరినీ ఆకట్టుకుంది. సోషల్ మీడియా కూడా ఆమె మంచి ప్రయత్నాన్ని ప్రసంసిస్తోంది. అన్నపూర్ణ మోహన్ తన క్లాస్ పిల్లలకు ఫ్లూయెన్సీగా ఇంగ్లీష్ మాట్లాడేలా ప్రోత్సహిస్తోంది.
తన క్లాస్ రూంలో మంచి వాతావరణాన్ని కోరుకుంటున్నానని, తాను పిల్లలతో ఇంగ్లీష్లో మాట్లాడి ప్రోత్సహిస్తానని, పిల్లలకు చిన్నప్పుడే ముఖ్యమని ఆ టీచర్ చెబుతోంది. తాను ఏదీ బరువుగా భావించడం లేదని, తనకు తోచినంత సాయం చేస్తానని చెబుతోంది.