కళ్లలో నీళ్లు తిరిగాయి: ఎన్టీఆర్ చేయలేనిది కేసీఆర్ చేసి చూపించారు
హైదరాబాద్: తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. దసరా పర్వదినాన సిద్దిపేట నుంచి కొత్త జిల్లాల ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. సిద్దిపేట జిల్లా ప్రారంభించిన అనంతరం అంబేద్కర్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మంత్రి హరీశ్రావుతో కలిసి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
30 ఏళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఇదే రోడ్డు మీదుగా కరీంనగర్ వెళ్తుంటే, అంబేద్కర్ విగ్రహం వద్ద ఆపి, దండ వేయించి, సిద్దిపేట జిల్లా ఏర్పాటు చేయాలని దరఖాస్తు ఇచ్చానని అన్నారు. అయితే అప్పట్లో జిల్లా ఏర్పాటుకాలేదు గానీ, కానీ ఇప్పుడు కొత్తగా జిల్లా ఏర్పాటుకావడం సంతోషంగా ఉందన్నారు.
అది కూడా తన సిద్ధిపేటను తన చేతుల మీదుగా ప్రారంభించే అదృష్టం కలగడం దేవుడిచ్చిన వరమని కేసీఆర్ అన్నారు. ఇక మంత్రి హరీశ్ రావుకు తన ఆశీస్సులు సంపూర్ణంగా ఉంటాయన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావును ప్రశంసలతో ముంచెత్తారు.
సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేసి వెళ్లేటప్పుడు రెండు కళ్లలో నీళ్లు తిరిగాయని, ఈ ప్రాంతం ఏమైపోతుందో అని తాను బాధపడ్డానని అన్నారు. కానీ హరీశ్ రావు కూడా తనకు దీటుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ సిద్దిపేటను స్వర్గసీమ చేస్తున్నారని కొనియాడారు.
మంత్రి హరీశ్ కోరినట్లుగా సిద్దిపేట ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేకంగా వంద కోట్ల రూపాయల ఆర్థిక సాయంతో పాటు, ఇక్కడకు ప్రభుత్వ వైద్య కళాశాలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. తాను ఇక్కడి ప్రజల చేతుల్లో పెరిగిన బిడ్డనని, తాను సిద్దిపేటలో తిరగని గ్రామంలేదని వివరించారు.
సిద్దిపేటకు తాను ఇంతకుముందు మూడు విషయాల్లో బాకీ ఉన్నానని, వాటిలో రైలు వచ్చేస్తోందని, అందులో అనుమానం లేదని చెప్పారు. గోదావరి నీళ్లు రావాలని ఎటూ ఇరిగేషన్ మంత్రి సొంత ఎమ్మెల్యేనే కాబట్టి అవి కూడా వస్తాయని తెలిపారు. మూడోది జిల్లా అని అది ఇప్పటికే వచ్చేసిందని అన్నారు.
ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకేనని, అందుకే తాను ఎక్కడ ఏం చేసినా ముందు సిద్దిపేటకే చేస్తానని తెలిపారు. రాబోయే రోజుల్లో ఇక్కడ ఒక యూనివర్సిటీ కూడా ఏర్పాటుకావాలన్నారు. ఇక్కడ అద్భుతమైన భవనాలు వస్తాయన్నారు. సిద్ధిపేటకు నాలుగు మూలలా కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం, కోర్టుల సముదాయం, జడ్పీ భవనం వచ్చేలా కట్టాలన్నారు.
తెలంగాణలో అందరూ సంతోషంగా బతకాలని, కొందరు మాత్రమే పెత్తనం చెలాయించే విధానం పోవాలని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని ఆయన స్పష్టం చేశారు. ప్రతి రూపాయి కూడా లబ్ధిదారునికి అందాలన్న ఉద్దేశంతోనే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామన్నారు.