మోదీ, అమిత్ షా బహుముఖ వ్యూహం: రాహుల్ విలవిల
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయం.. బీజేపీ నాయకుడిగా పనిచేసిన దళిత నేత రైజీనా హిల్స్లో రాష్ట్రపతిభవన్లో అడుగు పెట్టిన క్షణం కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం..
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయం.. బీజేపీ నాయకుడిగా పనిచేసిన దళిత నేత రైజీనా హిల్స్లో రాష్ట్రపతిభవన్లో అడుగు పెట్టిన క్షణం కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం.. అధికార బీజేపీలో దూకుడు పెరిగింది.
గతేడాది డిసెంబర్లో అన్నాడీఎంకే అధినేతగా పురుచ్చితలైవి జయలలిత మరణించిన తర్వాత తమిళనాట రాజకీయంగా బలోపేతం కావడానికి కమలనాథులు పకడ్బందీ వ్యూహం రచించారు. ప్రాంతీయ పార్టీలన్నింటిని కేంద్రంలో అధికారంలో బీజేపీ ప్రభుత్వం కకావికలం చేస్తున్నది.
విపక్ష నేతలపై ఉన్న అవినీతి కేసులు, క్రిమినల్ నేరాలను వెలికి తీస్తున్నది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లను విపక్షాల నాయకులపైకి ప్రయోగిస్తున్నది. తమిళనాడులో అన్నాడీఎంకేపై ఆధిపత్య రాజకీయాలు చేయడం నుంచి బీహార్లో మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చిన మహా కూటమి సర్కార్ను కూలదోయడం మొదలు గుజరాత్ రాష్ట్రంలో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు భౌతిక దాడులకు దిగడం పరాకాష్టగా భావిస్తున్నారు.
తమిళనాడులో పట్టుకు ఇలా బీజేపీ వ్యూహం
గతేడాది డిసెంబర్లో తమిళనాడులో జయలలిత మరణించిన తర్వాత సీఎంగా ఓ పన్నీర్ సెల్వం తాత్కాలికంగా బాధ్యతలు స్వీకరించినా తర్వాత జయలలిత నెచ్చెలి శశికళా నటరాజన్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి సీఎం పదవి అలంకరించేందుకు రంగం సిద్ధం చేసుకుంటే బీజేపీ ప్రతివ్యూహం అమలుజేసింది. దాదాపు మూడేళ్ల క్రితం కర్ణాటక హైకోర్టు కొట్టేసిన అక్రమాస్తుల కేసును సుప్రీంకోర్టు తిరిగి తెరిపించి విచారణ జరిపించి జైలుశిక్ష పడేలా చేశారు. జయ నెచ్చెలిగా మొండిగానే శశికళ.. పన్నీర్ సెల్వానికి బదులు పళనిసామితో సీఎంగా ప్రమాణం చేయించారు.
ఆ తర్వాత జయలలిత మరణించినందున ఖాళీ అయిన ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగనుండగా అన్నా డీఎంకే రెండుగా చీలింది. రెండు గ్రూపుల మధ్య ‘అన్నాడీఎంకే' గుర్తు రెండాకులు స్తంభింపజేసింది ఎన్నికల సంఘం. అంతటితో ఆగక ఆర్కేనగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల్లో దినకరన్, పన్నీర్ సెల్వం పోటీ పడితే పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి దినకరన్... రెండాకుల గుర్తు కోసం భారీగా ముడుపులు ఇవ్వడానికి లంచం ఇవ్వజూపారని నమోదైన కేసులో జైలు పాలయ్యారు. అన్నాడీఎంకేకు, బీజేపీకి మధ్య రాజీ కుదిరిన తర్వాత సీన్ మారిపోయింది. అన్నాడీఎంకేలో ఇటు పన్నీర్ సెల్వం, అటు పళనిసామి గ్రూపులు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేతో జత కట్టాయి.
Recommended Video
మణిపూర్లో ఇలా కాంగ్రెస్ నుంచి ఫిరాయింపులు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంతోపాటు మణిపూర్, గోవా, పంజాబ్ రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ గెలుపొందగా, పంజాబ్ రాష్ట్రంలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ విజయం సాధించింది. మణిపూర్, గోవా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మణిపూర్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన సభ్యులను బీజేపీలోకి ఫిరాయించేలా చేయడంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్, అసోం రాష్ట్ర మంత్రి హేమంత్ బిశ్వాస్ కలగలిసి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ నేత ఇబోబిసింగ్ మంత్రివర్గంలో పని చేసిన మాజీ కాంగ్రెస్ పార్టీ నేత బీరెన్ సింగ్ సారథ్యంలో రెండో ఈశాన్య రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
పారికర్తో గోవా చేజిక్కించుకున్న బీజేపీ
గోవాలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా ఆరెస్సెస్ బహిష్క్రుత నేత, శివసేన, మహారాష్ట్ర గోమంతక్ పార్టీతో కలిసి పోటీ చేశారు. ఐదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ విజయం కోసం జరిపిన ఎన్నికల సమరంలో మెజారిటీకి మూడు, నాలుగు సీట్ల తక్కువ లభించింది. కానీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాత్రం గోవా రాజధాని పనాజీలో తిష్ఠ వేసి తెర వెనుక మంత్రాంగం జరిపింది. మూడేళ్ల క్రితం గోవా సీఎంగా ఉన్న మనోహర్ పారికర్ను రక్షణ మంత్రిగా నియమించారు ప్రధాని నరేంద్రమోదీ. కానీ గోవా అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి పెరిగి ప్రజలకు దూరమైంది. కానీ చిన్నా చితక పార్టీల నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలను కలుపుకుని.. రక్షణ శాఖ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ను తిరిగి గోవాకు సీఎంగా డిప్యూట్ చేసింది బీజేపీ.
కూతురు వివాహం రోజే సీఎం వీరభద్రసింగ్ నివాసంపై సీబీఐ దాడులు
ఇక కేంద్రంలో 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిమాచల్ ప్రదేశ్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేత వీరభద్రసింగ్ ప్రభుత్వాన్ని అక్రమాస్తుల కేసులతో ఇబ్బందుల పాల్జేసేందుకు ప్రయత్నించింది. ఆయన కూతురు వివాహం నాడే ఆయన ఇంటిపై సీబీఐతో దాడులు చేయించిన ఘన చరిత్ర కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానిది. అంతకుముందు అరుణాచల్ ప్రదేశ్, తర్వాత ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఫిరాయింపుల ద్వారా బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు కోసం చేసిన ప్రయత్నాలను సుప్రీంకోర్టు అడ్డు చెప్పడంతో తప్పిపోయింది. దీనికి పరాకాష్టగా ఢిల్లీలో గెలుపొందిన అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్తో ఘర్షణకు దిగేలా చేసింది. పోలీసులపై నియంత్రణ లేకుండా చేసి, ఆమ్ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలపై తప్పుడు కేసులతో వేధింపులకు పాల్పడుతున్న ఘనత కేంద్రంలోని మోదీ ప్రభుత్వానిదేనని రాజకీయ విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు.
శారద, నారద సాక్షిగా మమతపై ఇలా
కేంద్రం వైఖరిని వ్యతిరేకించినందుకు పశ్చిమ బెంగాల్లోని అధికార త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీ.. దాని అవినీతి కేసులు శారద, నారదా స్టింగ్ ఆపరేషన్ తద్వారా కేసులతో వేధింపులకు పాల్పడుతున్నది. తాజాగా డార్జిలింగ్ కొండల్లో గూర్ఖాలాండ్ రాష్ట్ర సాధన కోసం ఆందోళనకు తెర వెనుక మద్దతు పలికింది బీజేపీ. 2009 తర్వాత రెండోసారి డార్జిలింగ్ నియోజకవర్గం నుంచి బీజేపీ గెలుపొందింది. ఆ పార్టీ నేత అహ్లువాలియా లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. గూర్ఖా జన్ ముక్తి మోర్చా (జీజేఎం) ఆందోళనకు బీజేపీ పరోక్ష మద్దతు ఉన్నదన్న అభిప్రాయాలు ఉన్నాయి.
ఇలా ప్రతి రాష్ట్రంలోనూ బీజేపీ ఆధిపత్య రాజకీయం
ప్రతి రాష్ట్రంలోనూ ఇష్టారాజ్యంగా బీజేపీ ఆధిపత్య రాజకీయాలకు పాల్పడుతున్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే కేరళలోని కొట్టాయంలో ఒక ఆరెస్సెస్ కార్యకర్త హత్యకు గురయ్యాడు. ఈ పని చేసింది అధికార సీపీఎం కార్యకర్తలన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై వెంటనే ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్కు ఫోన్ చేసి మరి హోంమంత్రి రాజ్ నాథ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 2014లో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో గోరక్షకుల పేరిట ‘బీఫ్' తింటున్నారన్న పేరుతో దాడుల్లో మరణాలకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏమి సమాధానం చెప్తుందని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.
బీహార్లో మహా కూటమికి ఇలా బీటలు
ఇక ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత బీజేపీ.. కీలక రాష్ట్రమైన బీహార్ పై కేంద్రీకరించింది. 1998 నుంచి 2013 వరకు ఎన్డీయేతోనే ఉన్న బీహార్ సీఎం నితీశ్ కుమార్.. ప్రధాని పదవికి మోదీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన బీజేపీపై కోపంతో బయటకు వచ్చారు. 2014లో బీహార్ రాష్ట్రంలో సీట్లన్నీ బీజేపీ గెలుచుకున్నది. దీంతో పాత శత్రువు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్తో జత కట్టారు. కాంగ్రెస్ పార్టీ కూడా తోడైంది. మూడు పార్టీలు మహా కూటమిగా 2015 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందాయి. సీఎంగా నితీశ్ కుమార్ ఎన్నికయ్యారు. కానీ తాజాగా మారిన పరిణామాల్లో గతం అంతా తవ్వి తలకెత్తారు. 2006లో రైల్వేశాఖ మంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ పనిచేసినప్పుడు ఐఆర్సీటీసీకి అనుబంధంగా ఉన్న హొటళ్ల కేటాయింపులో అవకతవకలకు పాల్పడ్డారన్న కేసు బయటకు లాగారు.
సచ్చీలత సాక్షిగా తేజస్వికి నితీశ్ సవాళ్లు
గత నెల ఐదో తేదీన కేసు నమోదు చేయడం.. తర్వాత లాలూ కుటుంబ సభ్యుల ఇళ్లపై దాడులు చేసిందీ సీబీఐ. ఆ వెంటనే రాజకీయ చదరంగం మొదలైంది. నితీశ్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న తేజస్వి యాదవ్ ను బయటకు పంపేందుకు రంగం సిద్ధం చేశారు. సచ్చీలుడిగా బయటకు రావాలని పదేపదే నితీశ్ కుమార్ డిమాండ్ చేశారు. పొమ్మనకుండా పొగబెట్టారు. తేజస్వి యాదవ్ తండ్రిగా లాలూ కాదూ కూడదని తేల్చేయడంతో నితీశ్ కుమార్ తనకు తాను వైదొలిగారు. తర్వాత బలవంతంగా భరించానని నితీశ్ ఫ్లేట్ ఫిరాయించారు. తన పాత మిత్ర పక్షం బీజేపీతో కలిసి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తద్వారా 2015లో ప్రజలిచ్చిన తీర్పును వమ్ము చేశారు.
అహ్మద్ పటేల్ పరాజయానికి ఇలా ప్లాన్
ఆ వెంటనే ఈ నెలలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ను ఓడించాలని లక్ష్యంగా పెట్టుకున్నది బీజేపీ నాయకత్వం. ముందుగా కేంద్ర మాజీ మంత్రి శంకర్ సింగ్ వాఘేలాలను కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేలా వ్యూహం అమలు చేసింది. తర్వాత ఆయన బంధువుతో రాజీనామా చేయించి అహ్మద్ పటేల్ కు ప్రతిగా రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచేలా తెర వెనుక వ్యూహం అమలు చేసింది. వాఘేలా వైదొలిగిన వెంటనే ఆరుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. మరొక ఎమ్మెల్యేను జిల్లా ఎస్పీ కిడ్నాప్ చేసేందుకు కూడా వెనుకాడలేదని ఆరోపణలు వచ్చాయి.
ప్రతిగా కర్ణాటక మంత్రి ఇంటిపై సీబీఐ దాడులు
దీంతో 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకు తరలిస్తే.. వరదల వేళ జల్సాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీపై ప్రతి విమర్శలకు దిగారు కమలనాథులు. కానీ దేశవ్యాప్తంగా వరదలు పోటెత్తుతున్నా.. వారికి ఉపశమన చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారని కాంగ్రెస్ ఘాటుగా సమాధానం ఇచ్చేసరికి 24 గంటల్లో రూట్ మార్చారు. కర్ణాటక మంత్రి శివకుమార్.. గుజరాత్ ఎమ్మెల్యేలకు ఆశ్రయం కల్పించినందుకు ఆయన నివాసాలపై ఐటీ దాడులు చేసింది. దీనిపై నిలదీస్తే తమకు సంబంధం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దాటేశారు. కానీ ఐటీ దాడులు చేయడంపై అభ్యంతరాలు లేవు. కానీ రాజకీయ శిబిరం నిర్వహిస్తున్నప్పుడు చేయడమే సందేహాలకు తావిస్తున్నది.
బీజేపీ కార్యకర్త అరెస్ట్ ఇలా
ఇవన్నీ ఇలా ఉంటే వరద బాధిత ప్రాంతాల్లో పర్యటనకు గుజరాత్ వెళ్లిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిపై బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు రాళ్లతో దాడికి దిగారు. ఎస్పీజీ భద్రత ఉండటంతో తప్పించుకోగలిగారు. దేశ స్వాతంత్రోద్యమానికి సారథ్యం వహించి, నవ భారత ప్రగతికి ఊపిరిలూదిన కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహిస్తున్న రాహుల్ గాంధీ ఫొటో పబ్లిసిటీ కోసం గుజరాత్ పర్యటనకు వెళ్లారని, కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాల వల్లే గుజరాతీలు రాళ్లు రువ్వారని బీజేపీ నేత సాంబిత్ పాత్ర ఎదురు దాడికి దిగారు. కానీ ఆచరణలో పోలీసులు ఒక బీజేపీ కార్యకర్తను అరెస్ట్ చేశారని వార్తలొచ్చాయి. వీటికి ప్రత్యామ్నాయం ఏమిటన్న విషయం గానీ, ఆధిపత్య రాజకీయాలకు ఎప్పుడు చరమ గీతం పాడతారా? అన్న విషయమై గానీ సమస్య ప్రశ్నార్థకంగా మారింది.