మతతత్వవాదికాదు: మోడీని వెనుకేసుకొచ్చిన ముఫ్తీ
శ్రీనగర్: ప్రధాని నరేంద్ర మోడీకి తన మిత్రపక్షం పిడిపి నుంచి మంచి మద్దతు లభించింది. ప్రస్తుతం దేశంలో మత అసహనం పెరిగిందంటూ పలువురు సాహితీవేత్తలు అవార్డులు వెనక్కి ఇచ్చేస్తున్నారు. దీనికి బిజెపి నేతలు గట్టి కౌంటర్ ఇస్తున్నారు.
అయితే, బిజెపి నేతృత్వంలోని ఎన్డీయేలో ఉన్న మిత్ర పక్షాల నుంచి ఇప్పటి వరకు సరైన మద్దతు లభించలేదు. తాజాగా జమ్ము కాశ్మీర్లో బిజెపి - పిడిపి ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో పిడిపి అధ్యక్షులు, జమ్ము కాశ్మీర్ మఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్... ప్రధాని మోడీకి అండగా నిలిచారు.
ప్రధాని మోడీ మతతత్వవాది కాదని చెప్పారు. బిజెపి - పిడిపి కూటమి అనుబంధం బలంగా ఉందని చెప్పారు. జమ్మూ కాశ్మీర్ పర్యటనలో భాగంగా శ్రీనగర్లో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మనోడీ కచ్చితమైన సందేశాన్ని ఇస్తారని చెప్పారు.
భారత్లోని భిన్నత్వం, బహుళత్వం పైన తన విశ్వాసాన్ని ప్రకటిస్తారని ఆశిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఇష్టానుసారంగా మాట్లాడుతూ, మత ఉద్రిక్తలు పెంచుతున్న పార్టీ నేతలకు ప్రధాని మోడీ కళ్లె వేస్తారని అభిప్రాయపడ్డారు.
త్వరలో ప్రధాని మోడీ జమ్మూ కాశ్మీర్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మిత్రపక్షం పిడిపి నుంచి మోడీకి బలమైన మద్దతు లభించంది. ప్రధాని మోడీని ముఫ్తీ మహమ్మద్ సయీద్ వెనుకేసుకొచ్చారు.
రాష్ట్రం విషయమై మాట్లాడుతూ... జమ్మూ కాశ్మీర్కు తాము ప్రత్యేకంగా ప్యాకేజీ అడగడం లేదని, 2003లో వాజపేయి తరహాలోనే మోడీ కూడా కాశ్మీర్కు ప్యాకేజీ ప్రకటించడంతో పాటు పాకిస్తాన్కు స్నేహహస్తం అందిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
దాద్రీ ఘటన బాధాకరం, దురదుష్టకరమని చెప్పారు. అయితే, ప్రధాని మోడీ అజెండా మాత్రం అందరికీ సాయం, అందరి వికాసం అని అభిప్రాయపడ్డారు. ఆయన మతవాది కానేకాదన్నారు. త్వరలోనే తన పార్టీలో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్న నేతలకు కళ్లెం వేస్తారన్నారు. ఆయన పైన తనకు నమ్మకం ఉందన్నారు.
ప్రధాని మోడీ నియంతృత్వ వాది ఏమాత్రం కాదనేది తన అనుభవం అని చెప్పారు. తమతో పొత్తు పెట్టుకునే ముందు ఆయన చాలామందితో చర్చించారని, మోడీకి మరో ప్రత్యామ్నాయం లేదని, అందుకే సంకుచిత రాజకీయాల నుంచి బయటకు వచ్చి.. ఆర్థికాభివృద్ధి, రాజకీయ ఏకాభిప్రాయం దిశగా కృషి చేస్తున్నారన్నారు.