అప్పటి దాకా ఎందుకు ఆగాలి: సచిన్ 'రియో' సూచనపై మోడీ
న్యూఢిల్లీ: స్వాతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోట పైన భారత జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని నరేంద్ర మోడీ రియో అథ్లెట్లకు మానసిక ధైర్యాన్ని కలిగించేలా మాటలు చెప్పాలని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ విజ్ఞప్తి చేశారు. దానికి ప్రధాని మోడీ వెంటనే స్పందించారు.
ఆ ఆలోచన చేసిన సచిన్ను అభినందించారు. అంతేకాదు, మాస్టర్ సచిన్ 70వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అథ్లెట్లను ఉత్సాహపరిచేలా మాట్లాడాలని చెప్పారని, అప్పటి దాకా కూడా నేను ఆగనని, ఇప్పుడే చేస్తానని ప్రధాని మోడీ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఆయన ఇందుకు సంబంధించి వరుస ట్వీట్లు పెట్టారు.
'భారత క్రీడాకారుల్లో అత్యంత అభిమానాన్ని సంపాదించుకున్న భారతరత్న సచిన్ టెండూల్కర్, అథ్లెట్ల గురించి ఆగస్టు 15 ప్రసంగంలో మాట్లాడాలని సూచించారు. ఆయన ఆలోచనను అభినందిస్తున్నా. ఈ విషయం మాట్లాడేందుకు ఆగస్టు 15 వరకూ ఆగడం ఎందుకు? ఇప్పుడే మాట్లాడుతా' అని పేర్కొన్నారు.
'రియో ఒలింపిక్స్లో మన ఆటగాళ్లుండటం ఎంతో గర్వకారణం. వారెంతో శ్రమిస్తున్నారు. విజయం, పరాజయం జీవితంలో ఓ భాగం. మిగిలిన అన్ని ఆటల్లో పోటీ పడుతున్న వారు తమ అత్యుత్తమ ఆట తీరును కనబర్చాలి. ఫలితం విషయంలో బెంగ వద్దు. ఓర్పు, సంకల్పం, అంకితభావంతో ప్రతి భారత అథ్లెట్ ముందుకు సాగాలి. ఆటగాళ్లంతా భారత్కు గర్వకారణం. వారు జాతి యావత్తూ గర్వపడేలా చేయాలి' అని మరో పోస్ట్ పెట్టారు.