పారడైజ్ షాక్, కేంద్రమంత్రి, మాన్యతా నుంచి జగన్ వరకు: ఎవరి పేరు ఎందుకు?
ప్రపంచంలోని చాలా చిన్న దేశాల్లో పన్నులు లేవు. దీంతో ప్రముఖులు అక్రమంగా లేదా సక్రమంగా సంపాదించిన సొమ్మున అక్కడి కంపెనీల్లో పెట్టుబడులుగా పెడుతున్నారు.
Recommended Video
అమరావతి/హైదరాబాద్: ప్రపంచంలోని చాలా చిన్న దేశాల్లో పన్నులు లేవు. దీంతో ప్రముఖులు అక్రమంగా లేదా సక్రమంగా సంపాదించిన సొమ్మున అక్కడి కంపెనీల్లో పెట్టుబడులుగా పెడుతున్నారు. ఇలాంటి అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తోంది అంతర్జాతీయ పరిశోధనాత్మక పాత్రికేయుల సమాఖ్య (ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్).
కలకలం: పాదయాత్ర టైంలో వైసీపీకి భారీ షాక్, పారడైజ్ పేపర్స్లో జగన్ పేరు
తాజాగా, ఐసీఐజే పారడైజ్ పేపర్స్ పేరుతో చాలామంది, సంస్థల పేర్లు వెలుగులోకి తెచ్చింది. ఇందులో భారత్కు చెందిన 714 మంది పేర్లు ఉన్నాయి. ఇది కలకలం రేపుతోంది. ఇందులో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు.. ఇలా ఎందరో ఉన్నారు.
ఎన్నో అవమానాలు: తన క్షోభను బయటపెట్టిన అమితాబ్ బచ్చన్
అమితాబ్ నుంచి మాల్యా వరకు
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా, కార్పొరేట్ దళారీ నీరా రాడియా, కేంద్రమంత్రి జయంత్ సిన్హా, హైదరాబాద్కు చెందిన హెటెరో డైరెక్టర్లు వెంకట నరసారెడ్డి, పార్థసారథిరెడ్డి తదితరుల పేర్లు ఈ పత్రాల్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
అలా వైయస్ జగన్ పేరు
వైసిపి అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. సీబీఐ కేసులో ఆయన ఎదుర్కొంటున్న తాజా ఆర్థిక సంబంధాలు ఈ పత్రాల్లో బయటపడ్డాయని తెలుస్తోంది. అలాగే, సన్ టీవీ- ఎయిర్సెల్- మ్యాక్సిస్ కేసు, ఎస్సార్ 2జి కేసు, రాజస్థాన్ అంబులెన్సుల కుంభకోణం, వాటితో సంబంధం ఉన్నవారి పేర్లు వీటిల్లో చోటు చేసుకున్నాయి.
పనామా, పారడైజ్లలో పేర్లు, దర్యాఫ్తుకు ఆదేశం
అనేక కార్పొరేట్ కంపెనీల పేర్లూ జాబితాలో ఉన్నాయి. పనామా పత్రాల కేసులో ఉన్న పేర్లలో కొన్ని ఈ కేసులోనూ ఉండడం గమనార్హం. రాజకీయ నాయకులు, కార్పొరేట్లు, సినీ స్టార్ల పేర్లు బయటకు రావడంతో బహుళ సంస్థలతో దర్యాప్తు జరిపించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.
కేంద్రమంత్రి జయంత్ సిన్హా పేరు ఎందుకంటే
కేంద్రమంత్రి జయంత్ సిన్హా శాన్ఫ్రాన్సిస్కోలో ఉన్న డి లైట్ డిజైన్ అనే సంస్థకు డైరెక్టర్గా పని చేశారు. అదే పేరుతో కేమ్యాన్ ఐలాండ్లో అనుబంధ విభాగాన్ని ఏర్పాటు చేసింది. అందులో ఒమిడ్యార్ నెట్వర్క్ అనే సంస్థ మూడు మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. ఈ సొమ్మును ఒమిడ్యార్.. నెదర్లాండ్కు చెందిన ఫైనాన్స్ సంస్థ నుంచి అప్పుగా తీసుకొంది. ఈ నిర్ణయాలు తీసుకొనే సమయంలో జయంత్ సిన్హా డి లైట్ సంస్థకు డైరెక్టర్గా ఉండేవారు. ఆయన ఒమిడ్యార్ నెట్వర్క్ భారత్ విభాగానికి మేనేజింగ్ డైరెక్టర్గా కూడా పని చేశారు. ఆయన 2009 సెప్టెంబరులో ఆ సంస్థలో చేరి 2013 డిసెంబరులో రాజీనామా చేశారు. ఒమిడ్యార్ సంస్థలో డైరెక్టర్, మేనేజింగ్ డైరెక్టర్లుగా పని చేసిన విషయాన్ని ఆయన ఎన్నికల ధ్రువీకరణ పత్రంలో స్పష్టంగా వెల్లడించలేదు. అయితే ఒమిడ్యార్ నెట్వర్క్ ప్రస్తావన మాత్రం ఉంది. జయంత్ సిన్హా పేరు రావడంపై పీఎంవో స్పందించింది. ఒమిడ్యార్లో జయంత్ కొన్ని పెట్టుబడులు పెట్టారని, దానిపై ఎలాంటి వడ్డీ వచ్చినా ప్రస్తుతానికి లెక్కించే పరిస్థితి లేదని పీఎంవో వెబ్ సైట్ పేర్కొంది.
అమితాబ్ బచ్చన్ పేరు ఎందుకంటే
అమితాబ్ బచ్చన్ పదిహేడేళ్ల క్రితం బెర్ముడాలో నమోదైన జల్వా మీడియా లిమిటెడ్ అనే కంపెనీలో వాటాదారు అయ్యారు. 2004లో కేంద్రం సరళీకృత విదేశీ పెట్టుబడుల విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. అంతకుముందు విదేశాల్లో పెట్టే పెట్టుబడులకు ఆర్బీఐ నుంచి అనుమతి తీసుకోవాలి. బెర్ముడా కంపెనీలో పెట్టుబడి పెట్టేందుకు అమితాబ్ బచ్చన్ ఆర్బీఐ అనుమతి తీసుకున్నారా లేదా వెల్లడికాలేదు. కాగా ఈ కంపెనీని 2005లో రద్దు చేశారు. దీనిపై అమితాబ్ స్పందిస్తూ.. పనామా, బోఫోర్స్ సందర్భంలోను తన పేరును ఎవరో తెరపైకి తీసుకు వచ్చారని, దర్యాఫ్తుకు సహకరిస్తున్నానని, ఈ సమయంలో తనకు ప్రశాంతంత అవసరమని పేర్కొన్నారు.
ఇదీ బీజేపీ ఎంపీ ఆర్కే సిన్హా
బీజేపీ ఎంపీ ఆర్కే సిన్హా స్ధాపించిన ప్రయివేటు సెక్యూరిటీ సేవల సంస్థ అయిన ఎస్ఐఎస్కు రెండు విదేశీ సంస్థలతో సంబంధం ఉన్న విషయం ప్యారడైజ్ పేపర్స్ ద్వారా వెలుగులోకి చూసింది. మాల్టాలో దీనికి అనుబంధంగా 2008లో మరో సంస్థను ఏర్పాటు చేశారు. ఇందులో ఆయన భార్య రీతా కూడా డైరెక్టర్. ఈ కంపెనీలో బ్రిటిష్ వర్జిన్ ఐల్యాండ్స్లో ఏర్పాటు చేసిన ఎస్ఐఎస్ కూడా వాటాదారుగా ఉంది. ఎన్నికల పత్రాల్లో తన భార్య వాటికి డైరెక్టర్లుగా ఉన్న విషయం వెల్లడించలేదు. కానీ 2017లో సెబీ వద్ద దాఖలు చేసిన పత్రాల్లో సమాచారం ఇచ్చారు. పారడైజ్ పత్రాల్లో పేరుపై స్పందిస్తూ.. తాను ప్రస్తుతం మౌనవ్రతంలో ఉన్నానని, ఇప్పుడు స్పందించలేనని చెప్పారు.
మాన్యతా దత్ పేరు ఎందుకంటే
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ సతీమణి మాన్యతా దత్ అసలు పేరు దిల్ నాషిన్. బహమాస్ రిజిస్ట్రీ ప్రకారం సన్ జాయ్ కంపెనీ అక్కడ ఏర్పాటయింది. ఇందులో దిల్ నాషిన్ డైరెక్టర్. మాన్యత ఇతర కంపెనీల్లోను డైరెక్టర్గా ఉన్నారు. దీనిపై మాన్యత అధికార ప్రతినిధి స్పందిస్తూ.. ఈ సమాచారం అంతా ఐటీ శాఖకు తెలిపిందేనని, కొత్త విషయం లేదన్నారు.
నీరా రాడియా పేరు ఎందుకంటే
నీరా రాడియా మాల్టాలో 2012లో ఏర్పడిన సూయజ్ లా వ్యాలెట్టి లిమిటెడ్ అనే సంస్థకు డైరెక్టర్, లీగల్ అండ్ జ్యుడీషియల్ ప్రతినిధిగా ఉన్నారు. పెగసస్ ఇంటర్నేషనల్ అడ్వైజర్స్ లిమిటెడ్ అనే సంస్థలోనూ డైరెక్టర్. ఈ రెండు సంస్థల నుంచి 2014లో ఆమె తప్పుకున్నారు. పనామా పేపర్స్లోనూ నీరా రాడియా పేరు బయటకు వచ్చింది. భారత్లో కమ్యూనికేషన్ల వ్యాపారం నుంచి తప్పుకున్న అనంతరం మాల్టా కంపెనీలో డైరక్టర్గా చేరేందుకు అంగీకరించారని రాడియా ప్రతినిధి తెలిపారు.
విజయ్ మాల్యా సహా మరెందరో పేర్లు
పారడైజ్ పేపర్లలో విజయ్ మాల్యా, ఇంజినీరింగ్ కోచింగ్ సంస్థ ఫిట్జీ, హెటిరో, జీఎంఆర్, జిందాల్, హావెల్స్్, హిందూజా, వీడియోకాన్ తదితర పేర్లు ఉన్నాయి. తన పేరుతో ఎలాంటి విదేశీ ఖాతాలు లేవని హెటిరో గ్రూప్ చైర్మన్ స్పష్టం చేశారు. దాదాపు అన్ని సంస్థలు పారడైజ్ పేపర్స్ లీక్ పైన స్పందించాయి. విదేశీయుల్లో బ్రిటిష్ రాణి ఎలిజబెత్, అమెరికా వాణిజ్య మంత్రి విల్పర్ రాస్, కెనడా ప్రధాని జస్టిస్ ట్రుడో సన్నిహితుడు స్టీఫెన్ బ్రాన్ఫ్మన్, పాప్ దిగ్గజం మడోన్నా తదితరుల పేర్లు ఉన్నాయి.