మైసూరా షాకింగ్ నిర్ణయం: జగన్కు మొదటి నుంచీ అండ, ఏం చెప్తారు?
విజయవాడ: సీనియర్ రాజకీయ నాయకుడు మైసూరా రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకున్నారు. ఆయన బుధవారం నాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. గత కొద్ది రోజులుగా డజనుకు పైగా వైసిపి ఎమ్మెల్యేలు, ఇతర నేతలు సైకిల్ ఎక్కుతున్న విషయం తెలిసిందే.
చాలామంది ప్రజాప్రతినిధులు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన అసంతృప్తితో టిడిపిలో చేరుతున్నారు. మైసూరా రెడ్డి కూడా జగన్ తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, త్వరలో ఆయన కూడా టిడిపిలో చేరుతారనే వాదనలు వినిపించాయి.
అయితే, ఆయన మాత్రం సంచలన నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చు. వైసిపికి రాజీనామా చేసిన ఆయన తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని, పుస్తకాలు రాస్తానని చెప్పారు. రాజకీయాల్లో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్నారని భావిస్తున్నారు.
అయితే, తాను పుస్తకాలు రాస్తానని మైసూరా రెడ్డి చెప్పారు. ఇది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆయన తన రాజకీయ అనుభవాల పైన కూడా పుస్తకాలు రాసే అవకాశాలు ఉన్నాయి. దీంతో, అందులో ఆయన ఏం రాస్తారనే చర్చ అప్పుడే ప్రారంభమైంది.
మైసూరా రెడ్డి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి నన్నిహితుడు. చాలాకాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. రాజ్యసభకు వెళ్లారు. అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైయస్ సన్నిహితుడైనందున ఆయనకు వ్యతిరేకంగా రాసే అవకాశాలు చాలా తక్కువ.
అయితే, చంద్రబాబు, జగన్ల గురించి ఆయన ఏం రాస్తారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. గత ఏడాది మాజీ మంత్రి హరిరామ జోగయ్య తీసుకు వచ్చిన పుస్తకం చర్చనీయాంశమైంది. రాజకీయాల్లో విజ్ఞుడిగా పేరొందిన మైసూరా రెడ్డి పుస్తకాలు రాస్తే అవి మరింత చర్చకు దారి తీస్తాయని అంటున్నారు.
జగన్కు మొదటి నుంచి అండగా..
మైసూరా రెడ్డి వైసిపి అధినేత జగన్కు మొదటి నుంచి అండగా నిలబడ్డారు. జగన్ను సిబిఐ అరెస్టు చేసినప్పుడు.. కష్టాల్లో ఉన్న పార్టీని ముందుకు నడిపించడంలో మైసూరా కీలకంగా వ్యవహరించారు. పార్టీ కోసం ఎంత కష్టపడినా పార్టీలో కనీస గౌరవం లేకపోయిందని ఆయన అసంతృప్తికి లోనయ్యారని, అందుకే పార్టీని వీడారని అంటున్నారు.