శ్రీని మరో బాగోతం: సభ్యులపై గూఢచర్యం
ముంబై: బిసిసిఐ మాజీ అధ్యక్షుడు, ఐసిసి చైర్మన్ ఎన్ శ్రీనివాసన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. భారత క్రికెట్ను ఎంతో కాలం తన గుప్పిట్లో పెట్టుకున్న శ్రీనివాసన్ బోర్డు సభ్యులపై గూఢచర్యం చేశారని తెలుస్తోంది. సభ్యుల కదలికపై నిఘా పెట్టేందుకు లండన్కు చెందిన ఓ ప్రైవేటు ఏజెన్సీకి బోర్డు ఖజానా నుంచి రూ. 14 కోట్లు ముట్టజెప్పినట్టు ఆదివారం జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
సభ్యుల ఫోన్లు ట్యాప్ చేయడంతో పాటు వారి ప్రైవేటు ఈ మెయిల్స్ను శ్రీనివాసన్ ట్రాక్ చేయించారని తెలుస్తోంది. దీనిపై విచారణ చేపట్టేందుకు బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలో బీసీసీఐ ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.
సహచర సభ్యులపై శ్రీని ఎందుకు నిఘా పెట్టారు, ఇటువంటి పనులకు బోర్డు సొమ్మును వాడుకునేందుకు ఆయనకు ఎవరు అధికారం ఇచ్చారనే విషయాలపై ఈ కమిటీ విచారణ చేపట్టనుంది. చెన్నై సూపర్ కింగ్స్ విక్రయం మొత్తాన్ని తక్కువగా చూపించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాసన్ ఇప్పుడు ఈ వివాదంలో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఇదిలావుంటే, ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ను తన అనుబంధ సంస్థకు తక్కువ మొత్తానికి విక్రయించిన వివాదంపై న్యాయ సలహా తీసుకోవాలని బీసీసీఐ నిర్ణయించింది. ఆదివారం జరిగిన బోర్డు వర్కింగ్ కమిటీ సమావేశంలో చెన్నై విలువ మదింపు వ్యవహారంపై ప్రశ్నలు రావడంతో ఈ నిర్ణయానికి వచ్చింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో శ్రీనివాసన్కు చెందిన ఇండియా సిమెంట్స్ చెన్నై జట్టును తన అనుబంధ సంస్థకు రూ. ఐదు లక్షలకే విక్రయించినట్టు పేర్కొన్న సంగతి తెలిసిందే.
దీనిపై ఐపీఎల్ నూతన పాలక మండలి సమావేశంలోనూ చర్చ జరిగింది. కాగా, ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరైన బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ వివాదంపై తమిళనాడు క్రికెట్ సంఘం ఉపాధ్యక్షుడు పీఎస్ రామన్తో చర్చించనట్టు సమాచారం. రూ. 1500 కోట్లు విలువ చేసే జట్టు విక్రయ విలువను కేవలం ఐదు లక్షలుగా మదింపు చేయడం వెనకున్న కారణం ఏమిటో రామన్ను మనోహర్ అడిగారని తెలుస్తోంది.