యుపి బరి: కాంగ్రెసు టికెట్ల కోసం నగ్మా, జయప్రద
ఒకప్పుడు జవహర్లాల్ నెహ్రూ పోటీ చేసిన ఫుల్పూరు లోకసభ స్థానం నుంచి సినీ తార నగ్మా పోటీ చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. బాలీవుడ్లోనూ టాలీవుడ్లోనూ పలు సినిమాల్లో నటించిన నగ్మా ఆ తర్వాత భోజ్పురి సినిమాల్లో నటించి గ్రామీణ ప్రజల ఆదరణ పొందారు. ఎన్నికల ప్రచారానికి నగ్మాను వాడుకోవడానికి కూడా కాంగ్రెసు నాయకత్వం వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎఐసిసి సభ్యురాలైన నగ్మా 2004 లోకసభ ఎన్నికల నుంచి కాంగ్రెసు ప్రచారంలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు.
మరో భోజ్పురి నటుడు రవి కిషన్ తూర్పు ఉత్తరప్రదేశ్ నుంచి లోకసభ బరిలోకి కాంగ్రెసు తరఫున బరిలోకి దిగుతారని భావిస్తున్నారు. భోజ్పురి సినీరంగాన్ని ఏలుతున్న ఈ నటుడు రాజకీయాల్లో తగిన స్థానం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ విడత ఆయన కాంగ్రెసు తరఫున పోటీ చేస్తారని అనుకుంటున్నారు.
రాంపురి కీ కాళీగా పేరు పొందిన సినీ తార, లోకసభ సభ్యురాలు జయప్రద కూడా కాంగ్రెసు టికెట్పై బరిలోకి దిగుతారని భావిస్తున్నారు. రాంపూర్ నియోజకవర్గం నుంచి సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఆమె విజయం సాధించారు. అయితే, ఈసారి ఆమె కాంగ్రెసు టికెట్పై మొరదాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో గెలిచిన హైదరాబాద్ మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజరుద్దీన్ ఈసారి పశ్చిమ బెంగాల్ నుంచి లోకసభకు పోటీ చేసే అవకాశాలున్నాయి.