మోడీ 'ఒక్క' దెబ్బకు లక్ష కంపెనీలు రద్దు, 37వేలు బోగస్వి
నోట్ల రద్దు తర్వాత అనుమానాస్పద లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు లక్షకు పైగా కంపెనీలు జీఎస్టీ ప్రభావంతో రిజిస్ట్రేషన్ కోల్పోయాయని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు.
ఢిల్లీ: నోట్ల రద్దు తర్వాత అనుమానాస్పద లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు లక్షకు పైగా కంపెనీలు జీఎస్టీ ప్రభావంతో రిజిస్ట్రేషన్ కోల్పోయాయని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. నల్లధనంపై ఇది తమ రెండో దాడి అని ఆయన వ్యాఖ్యానించారు.
జీఎస్టీ చారిత్రక అవసరం, దోపిడీదారులపై కఠిన వైఖరి : మోడీ
జీఎస్టీకి సరిగ్గా 48 గంటల ముందు ఒక్క పెన్ను పోటుతో లక్షకు పైగా కంపెనీల రిజిస్ట్రేషన్ రద్దయిందన్నారు. మరో రెండు లక్షల కంపెనీలపై నిఘా పెట్టినట్టు చెప్పారు. ఈ కంపెనీలన్నీ అవాస్తవ లావాదేవీలు నిర్వహిస్తున్నట్టు తేలిందన్నారు.
మనీ లాండరింగ్కు పాల్పడుతూ నల్ల ధనానికి ఊతమిస్తున్న 37 వేల షెల్ కంపెనీలను గుర్తించినట్టు తెలిపారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ (ఐసీఏఐ) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మోడీ మాట్లాడిన విషయం తెలిసిందే.
నల్లధనం, అవినీతిపై తమ యుద్ధం కొనసాగుతుందన్నారు. అందులో భాగంగా తీసుకుంటున్న చర్యల్లో జీఎస్టీ కూడా ఓ భాగమన్నారు. ఒకే ఒక్క నిర్ణయంతో లక్ష కంపెనీలు రిజిస్ట్రేషన్కు నోచుకోకుండా పోయాయన్నారు.
రాజకీయ ప్రయోజనాలతో గత ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోయిందన్నారు. దేశాన్ని ప్రేమించేవారు మాత్రమే ఇటువంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారన్నారు.
పన్ను ఎగవేతకు పాల్పడుతున్న కంపెనీలపై కఠిన చర్యలు తప్పవని ప్రధాని మోడీ హెచ్చరించారు. నల్లధనం దాచుకునే వారికి సహకరించేవారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇలాంటి గట్టి చర్యల వల్ల ఎదురయ్యే రాజకీయ పరిణామాలను గురించి తాను పట్టించుకోనని చెప్పారు. పన్నులు కట్టించకుండా ఎంతమందిని రక్షించామనే గొప్పలు చెప్పుకోవడం కాకుండా ఎందరు ప్రజల్ని పన్ను పరిధిలోకి తీసుకు రాగలిగారో చెప్పుకొనేలా వ్యవహరిస్తామని సీఏలు ప్రతిజ్ఞ తీసుకోవాలన్నారు.
తమ వ్యాపారం పెరగాలంటే ప్రజలు రోగాల పాలు కావాలని వైద్యులు కోరుకోరని, అదే విధంగా సీఏలూ సమాజ ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడాలని, తమ క్లయింట్లు నిజాయతీగల పన్ను చెల్లింపుదారులుగా తయారయ్యేలా ప్రోత్సహించాలన్నారు.