ఐపీఎల్: కూలీ కొడుక్కి రూ.3.2 కోట్లు, ఎవరీ నాథూ?
బెంగళూరు: రంజీల్లో విశేషంగా రాణించడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంలో నాథూ సింగ్ను ముంబై ఇండియన్స్ రూ.3.2 కోట్లకు వెచ్చించి కొనుగోలు చేసింది. నాథూ సింగ్ ఓ కార్మికుడి తనయుడు కావడం గమనార్హం. ఇంత పెద్ద ధర పలకడం అతడు నమ్మలేకపోయాడు.
20 ఏళ్ల నాథూ జైపూర్లో ఓ ఫ్యాక్టరీ కార్మికుడి కొడుకు. ఎంతో కష్టపడి ఈ స్థితికి వచ్చాడు. మాజీ ఆటగాడు రాహుల్ ద్రావిడ్ ఓసారి మాట్లాడుతూ... నాథూ ప్రతిభావంతుడని ప్రశంసించాడు. తనను ముంబై రూ.3.2 కోట్లకు కొనుగోలు చేయడంపై నాథూ సింగ్ స్పందించాడు.
ఆ సొమ్ముతో ముందు తన తల్లిండ్రులు, తమ్ముడి కోసం పెద్ద ఇంటిని నిర్మించాలనుకుంటున్నట్లు చెప్పాడు. మా అమ్మానాన్నల కోసం పెద్ద ఇంటిని నిర్మించాలన్నదే తన కోరిక అని భావోవ్వేగంతో చెప్పాడు. భారత జట్టులో చోటు సంపాదించడానికి ఐపీఎల్ చక్కని వేదిక అని చెప్పాడు.
నిజానికి వేలంలో నాథూ సింగ్కు అంత ధర పలికిందని చాలా సేపటివరకు అతడి తండ్రి భరత్ సింగ్కు తెలియదు. ఫ్యాక్టరీలో పనిలో ఉన్న అతనికి ఎవరో చెబితే గానీ విషయం తెలియలేదు. తన కొడుకు రూ.3.2 కోట్లకు అమ్ముడుపోవడంపై తండ్రి భరత్ సింగ్ మాట్లాడుతూ.. చాలా సంతోషంగా ఉందని, నాథూ కష్టం ఫలించిందన్నాడు.
రాజస్థాన్లోని జైపూర్కు చెందిన ఓ ఫ్యాక్టరీలో నాథూ సింగ్ తండ్రి భరత్ సింగ్ ర్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు. భరత్ సింగ్... తన కొడుకు నాథూ సింగ్ లోని ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించాడు. తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతోనే నాథూ సింగ్ ఆడిన సత్తా చాటాడు.
నాథూ సింగ్ బంతి తీసుకున్నాడంటే ప్రత్యర్థి బ్యాట్స్మెన్ బెంబేలెత్తాల్సిందే. ఎందుకంటే, రావల్పిండి ఎక్స్ప్రెస్గా పేరొందిన పాక్ మాజీ ఫేసర్ షోయబ్ అక్తర్, ఆసీస్ స్పీడ్ స్టర్ బ్రెట్ లీ తరహాలో నాథూ సింగ్ కూడా గంటకు 160 మైళ్ల వేగంతో బంతులను వేస్తాడు.
ఇప్పటిదాకా దేశవాళీలో పదకొండు ట్వంటీ 20 మ్యాచ్ లు మాత్రమే నాథూ సింగ్ ఆడాడు. ఈ అతి స్వల్ప కాలంలోనే అతడిలోని ప్రతిభను భారత్-ఏ కోచ్ రాహుల్ ద్రావిడ్ గుర్తించాడు. అంత ధర దక్కడంపై నాథూ సింగే ఆశ్చర్యానికి గురయ్యాడు.