ఆ రూ.4లక్షల కోట్ల బ్లాక్మనీనే టార్గెట్: రంగలోకి ఐటీ, ఈడీ
పెద్ద నోట్ల రద్దు అనంతరం కేంద్ర ప్రభుత్వం నల్లధనంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది.
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం కేంద్ర ప్రభుత్వం నల్లధనంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. నోట్ల రద్దు అనంతరం బ్యాంకు డిపాజిట్లలో రూ.3-4 లక్షల కోట్ల మేర పన్ను ఎగవేత సొమ్ము(నల్లధనం) ఉండొచ్చని విశ్లేషిస్తోంది. ఆ వివరాలను నిశితంగా పరిశీలించి, ఆ సొమ్మును జమ చేసినవారికి నోటీసులు పంపాలని ఆదాయ పన్ను (ఐటీ) విభాగాన్ని ఆదేశించింది. నిర్దిష్ట మొత్తం కన్నా ఎక్కువగా సాగిన డిపాజిట్లు, జన్ధన్ ఖాతాలపైనా దృష్టి పెట్టింది.
గత నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 30 వరకూ వాటిని బ్యాంకుల్లో జమ చేసేందుకు గడువిచ్చిన విషయం తెలిసిందే. సదరు గడువులో.. పాత నోట్లతో చేసిన డిపాజిట్లపై ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలు మదింపు చేస్తున్నాయి. 'మా వద్ద పెట్టెల కొద్దీ డేటా ఉంది. దాన్ని విశ్లేషించినప్పుడు.. నోట్ల రద్దు తర్వాత 60 లక్షలకుపైగా బ్యాంకు ఖాతాల్లో రూ.2లక్షలకు పైబడిన డిపాజిట్లు జరిగినట్లు స్పష్టమైంది. ఈ ఖాతాల్లో జమైన మొత్తం సొమ్ము రూ.7.34లక్షల కోట్లుగా ఉంది' అని ఓ అధికారి తెలిపారు.
అందులో 6.8 లక్షల ఖాతాల్లోని వివరాలు.. పలు మార్గాల్లో ప్రభుత్వం సేకరించిన డేటాబేస్లోని వివరాలతో సరిపోలాయని వెల్లడించారు. వీటిపై ఐటీ విభాగాన్ని అప్రమత్తం చేసినట్లు తెలిపారు. దీంతో జన్ధన్ యోజన ఖాతాల్లో జరిగిన డిపాజిట్లను ప్రభుత్వం విశ్లేషించింది. రూ.లక్షకుపైబడిన డిపాజిట్లపై నిఘా సమాచారం ఆధారంగా పరిశీలన జరుగుతుంది.
'నవంబర్ 8 తర్వాత నుంచి విభిన్న వర్గాల ప్రజలు చేసిన నగదు డిపాజిట్లకు సంబంధించిన వివరాలను బ్యాంకుల నుంచి తెప్పించుకున్నాం. ప్రభుత్వ డేటా బేస్ల వద్ద ఉన్న నిఘా సమాచారంతో ఈ వివరాలను పోల్చి చూస్తూ విశ్లేషణలు సాగించాం' అని ఆ అధికారి తెలిపారు.
లోతైన మదింపు తర్వాత ఈ వివరాలను ఆదాయ పన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఇతర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు పంపినట్లు చెప్పారు. ఉగ్రవాద బాధిత రాష్ట్రాల్లోని బ్యాంకు డిపాజిట్ల వివరాలను సంబంధిత ప్రభుత్వ యంత్రాంగాలకూ పంపినట్లు వివరించారు.
'నిఘా సమాచారం ఆధారంగా ఆదాయ పన్ను శాఖ పలు చర్యలను చేపట్టింది. వీటిలో కొన్ని కేసులను సమాంతర దర్యాప్తు కోసం ఈడీ, సీబీఐలకు పంపింది. ఈ చర్యల వల్ల రిటర్నులు దాఖలు చేయనివారు, లెక్కల్లో చూపని సొమ్ము, డొల్ల కంపెనీలు వంటివి వెలుగు చూశాయి' అని చెప్పారు. పాన్ వివరాలు ప్రస్తావించకుండా రూ.50వేలకుపైగా సొమ్మును జమ చేసిన వారిపై చర్యలు మొదలైనట్లు వివరించారు. ఈ చర్యల వల్ల రానున్న రోజుల్లో పన్ను చెల్లింపుదారుల సంఖ్య భారీగా పెరగనుందని తెలిపారు.