నెహ్రూకు ఆమెతో ఎఫైర్: తెలుసుకుందామనుకన్న కూతురు.. పుస్తకంలో ఇలా రాసింది!
'డాటర్ ఆఫ్ యాన్ ఎంపైర్: లైఫ్ యాజ్ ఏ మౌంట్ బాటన్' అనే పుస్తకంలో పమేలా హిక్స్ నీ మౌంట్ బాటన్ పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: నెహ్రూ-ఎడ్వీనాల అనుబంధంపై ఇప్పటికీ చాలా అపోహలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా వీరిద్దరి మధ్య శారీరక సంబంధం కొనసాగిందన్న ప్రచారం చాలా కాలంగా ఉంది. అయితే ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేలా.. ఎడ్వీనా కూతురు పమేలా స్వయంగా తన రచన ద్వారా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
భారత ప్రధాని నెహ్రూ, చివరి వైస్రాయ్ మౌంట్ బాటన్ భార్య ఎడ్వీనాల మధ్య ఎటువంటి శారీరక సంబంధం లేదని 'డాటర్ ఆఫ్ యాన్ ఎంపైర్: లైఫ్ యాజ్ ఏ మౌంట్ బాటన్' అనే పుస్తకంలో పమేలా హిక్స్ నీ మౌంట్ బాటన్ పేర్కొన్నారు. వారిద్దరిది అద్భుత అనుబంధమని, ఇద్దరి మధ్య పరస్పర గౌరవాభిమానాలు ఉండేవని, అందరూ అనుకున్నట్లు వారి మధ్య శారీరక సంబంధమేమి లేదని అందులో చెప్పుకొచ్చారు.
నిజానికి వారిద్దరికీ అంత ఏకాంత సమయం లభించే పరిస్థితి కూడా లేదని పమేలా చెప్పారు. వారి చుట్టూ ఎప్పుడూ సిబ్బంది, పోలీసులు.. ఇలా ఎవరో ఒకరు ఉండేవారని పేర్కొన్నారు. నెహ్రూ.. అమ్మ(ఎడ్వీనా)ల మధ్య వాస్తవ సంబంధమేంటో తెలుసుకోవాలని తనకూ ఉండేదని, అయితే నెహ్రూ రాసిన లేఖలను చదివాక వారి ప్రేమానుబంధాన్ని సరిగా అర్థం చేసుకోగలిగానని అన్నారు.
'తాను కోరుకున్న వ్యక్తిత్వం, మేధస్సును అమ్మ నెహ్రూలో చూసింది' అని తన రచన ద్వారా తెలిపారు. భారత్ నుంచి వెళ్లిపోయే సమయంలో.. తనకిష్టమైన ఎమరాల్డ్ ఉంగరాన్ని నెహ్రూకు ఇవ్వాలని ఎడ్వీనా భావించినట్లు చెప్పారు. అయితే నెహ్రూ అందుకు అంగీకరించకపోవడంతో.. ఆయన కుమార్తె ఇందిరాగాంధీకి ఆ ఉంగరాన్ని ఇచ్చారని పమేలా వెల్లడించారు.