'సత్యం రామలింగ రాజు వెనుక టీడీపీ చంద్రబాబు'
హైదరాబాద్: సత్యం రామలింగ రాజు కుంభకోణం పైన కేంద్రం విచారణ చేపట్టాలని, రామలింగ రాజుకు టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్ని విధాలా సహకరించారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు ఆదివారం మండిపడ్డారు. ఆయన సీఎళ్పీ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు.
సుభాష్ చంద్రబోస్ కుటుంబంపై నిఘా సాకుతో మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పైన విచారణ జరపాలని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు డిమాండ్ చేయడం దుర్మార్గమన్నారు. భూసేకరణ ఆర్డినెన్స్ను నిరసిస్తూ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ర్యాలీ నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఎన్డీయే ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేసిందన్నారు.
నెహ్రూ పేరెత్తడం మాని సత్యం రామలింగ రాజు కుంభకోణంపై కేంద్రం విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. వెంకయ్య నాయుడికి దమ్ముంటే సత్యం కుంభకోణంపై వెంటనే విచారణ జరిపించాలన్నారు. రామలింగ రాజుకు చంద్రబాబు అన్ని విధాలా సహకరించారని ఆరోపించారు.
రామలింగ రాజు వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసునన్నారు. రామలింగ రాజు హఠాత్తుగా వెలుగులోకి రావడానికి కారణం చంద్రబాబు అన్నారు. నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్తో ప్రత్యేక ఇంటర్వ్యూ కూడా ఆయన కారణంగానే అన్నారు.
వెంకయ్య నాయుడు బాగా ఆస్తులు సంపాదించారని, ఆయన పైన కూడా విచారణ జరిపే రోజు త్వరలో వస్తుందన్నారు. స్వచ్చంద స్స్థ పేరిట వెంకయ్య నాయుడు కుమార్తె ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారో అందరికీ తెలుసునని విమర్శించారు. కేంద్రమంత్రి పదవి చేపట్టాక వెంకయ్య ఆస్తులు భారీగా పెరిగాయని ఆరోపించారు.