భారత్ భేష్: సొంత సైన్యంపై దుమ్మెత్తిపోసిన చైనా మీడియా
బీజింగ్: తమ సైన్యం పైన చైనా మీడియా ఆగ్రహం వ్యక్తం చేసింది. నేపాల్ భూకంపం నేపథ్యంలో భారత్ చేస్తున్న పనిని మన సైన్యం ఎందుకు చేయడం లేదని స్థానిక మీడియా మండిపడింది. నేపాల్లో చిక్కుకుపోయిన వేలాదిమంది భారతీయులను రక్షించేందుకు భారత సైన్యం ఎంతో బాగా పని చేస్తోందని, అక్కడి వారిని స్వదేశానికి తరలిస్తోందని, అదే పనిని తమ సైన్యం ఎందుకు చేయడం లేదని మీడియా దుమ్మెత్తిపోసింది.
ప్రపంచంలోనే పెద్దదైన సైన్యంగా పేర్కొంటున్న పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) ఈ విషయంలో ఎందుకు విఫలమైందని మీడియా ప్రశ్నించింది. నేపాల్లో చిక్కుకుపోయిన ఎనిమిది వేల మంది చైనీయులను కాపాడేందుకు వారిని తరలించేందుకు భారత్లాగా వాయుబలగాలను ఎందుకు వినియోగించలేదంది. చైనా రక్షణ శాఖ ప్రతినిధి గెంగ్ యాన్షెంగ్ను విలేకరులు సూటిగా ప్రశ్నించారు.
దానికి గెంగ్ యాన్షెంగ్... దానితో అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని, అందుకే అంత వేగంగా చేయలేకపోయామని సమాధానమిచ్చాడు.
కాగా, భారత ఎయిర్ ఫోర్స్ నేపాల్లో చిక్కుకుపోయిన ఇండియన్ సిటిజన్స్తో పాటు వందలాది మంది ఇతర దేశాల వారిని కూడా రక్షిస్తోంది. పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపడుతోంది. పదిహేను దేశాలకు చెందిన వందలాదిమందిని రక్షించింది. చాలామందిని బస్సులు, ఇతర వాహనాల ద్వారా బీహార్ సరిహద్దులకు తరలించారు.