టెండూల్కర్ దత్తత గ్రామంపై ఎన్ఎఫ్డిసి హ్యాపీ
నెల్లూరు: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ దత్తత గ్రామం అభివృద్ధిపై జాతీయ చలనచిత్రాభివృద్ధి సంస్థ (ఎన్ఎఫ్డిసి) సంతోషం వ్యక్తం చేసింది. ఎన్ఎఫ్డిసి క్రియేటివ్ డైరెక్టర్ ఆకాష్ అహుజా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల బృందం సచిన్ టెండూల్కర్ దత్తత తీసుకున్న నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజు కండ్రిగ గ్రామంపై డాక్యుమెంటరీని నిర్మిస్తోంది.
భోపాల్లో సెప్టెంబర్ 23, 24 తేదీల్లో జరిగే సంసద్ ఆదర్స్ గ్రామ యోజనపై జరిగే వర్క్షాపులో ఆ గ్రామం అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన తీరుపై నిర్మిస్తున్న ఆ డాక్యుమెంటరీని ప్రదర్శిస్తారు. ఈ చిత్రాన్ని 20 భాషల్లోకి అనువాదం చేస్తారు. సంసద్ ఆదర్స్ గ్రామ యోజన కింద ఎంపిక చేసిన మరిన్ని గ్రామాలపై చిత్రించిన డాక్యుమెంటరీలను కూడా ఇతర భాషల్లోకి అనువదిస్తారు.
తెలుగు భాషలోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో వచ్చే ఆ డాక్యుమెంటరీని దూరదర్శన్ (డిడి 1)లో ప్రతి సోమవారం సాయంత్రం ఆరు లేదా ఆరున్నర గంటలకు ప్రసారం చేస్తారు. పుట్టంరాజు కండ్రిగ అభివృద్ధి చెందిన తీరుపై ఆకాష్ అహుజాతో పాటు నితీష్ అహుజా, జితేంద్ర భార్గవ్ ఆనందం వ్యక్తం చేశారు.
అద్భుతం, విశిష్టమని ఆకాష్ అహుజా అన్నారు. మౌలిక సదుపాయాలను, జీవన మనుగడకు ప్రభుత్వం అందించిన సాయాన్ని ఉద్దేశించి ఆయన ఆ విధంగా అన్నారు.