మోడీ చొరవతో హైదరాబాద్కు: ఎవరీ నిక్కీ జోసెఫ్?
హైదరాబాద్: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) కోసం పనిచేస్తూ పట్టుబడిన మహిళ నిక్కీ జోసెఫ్ హైదరాబాదీయేనని తేల్చారు. ఆమెను పట్టుకోవడానికి ఏడాదిగా పోలీసులు నిఘా పెట్టారు. చివరకు ఆమెను హైదరాబాద్ పోలీసులు పట్టుకోగలిగారు.
సల్మాన్ మొయినుద్దీన్ చెప్పిన వివరాల మేరకు ఆమెను బ్రిటిష్ జాతీయురాలిగా భావించారు. అబూదాబిలో స్థిపరడిన నిక్కీ జోసెఫ్ హైదరాబాద్లోని టోలీచౌకీ ప్రాంతానికి చెందిందని విచారణలో తేలింది. ఆమె అసలు అఫ్షా జబీన్. ఆమెను శుక్రవారం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
గత నెలలో ప్రధాని నరేంద్ర మోడీ దుబాయ్ పర్యటన సమయంలో భారతదేశానికి చెందినవారు ఐఎస్ఐఎస్లో చేరే ప్రయత్నాల్లో ఉన్నట్లు గుర్తిస్తే వారిని తిరిగి స్వదేశానికి పంపాలని ఆ దేశ నాయకులను కోరారు. దాంతో ఆమెను యూఏపీ ప్రభుత్వం భారత్కు పంపేసినట్లు సమాచారం. దాంతో ఆమె హైదరాబాదు పోలీసులకు చిక్కిందని భావిస్తున్నారు.
దేశంలో పోలీసులు అరెస్టుచేసిన ఐఎస్ఐఎస్ సానుభూతిపరుల్లో మొట్టమొదటి మహిళ జోసఫేనని పోలీసులు తెలిపారు. భర్త దేవేందర్బాత్రా, ఇద్దరు పిల్లలతో కలిసి దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఆమెను అరెస్టు చేశారు. గత జనవరిలో హైదరాబాద్కు చెందిన సల్మాన్ మొయినుద్దీన్ అనే యువకుడు ఐఎస్ఐఎస్లో చేరేందుకు దుబాయ్, టర్కీ మీదుగా సిరియాకు వెళ్ళేందుకు ప్రయత్నించాడు. ఈ విషయం తెలుసుకుని పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
విచారణలో అతను నిక్కీ జోసెఫ్ ప్రోత్సాహంతో ఐఎస్ఐఎస్లో చేరేందుకు వెళ్తున్నట్లు చెప్పాడు. నిక్కీ జోసెఫ్ లండన్ వాసి అని, దుబాయ్లో స్థిరపడి ఐఎస్ఐఎస్ సానుభూతిపరురాలిగా సోషల్ మీడియా ద్వారా యువతను ఆకర్షిస్తున్నదని సల్మాన్ మొయినుద్దీన్ విచారణలో చెప్పాడు. దాంతో ఏడాది కాలంగా నిక్కీ జోసెఫ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. సల్మాన్ ఇచ్చిన సమాచారంతో ఆమె కదలికలపై నిరంతరం నిఘా పెట్టిన కేంద్ర నిఘా సంస్థల అధికారులు, సైబరాబాద్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
నిక్కీ జోసెఫ్ను లండన్ వాసిగా భావించిన పోలీసులు దర్యాప్తులో ఆమె హైదరాబాద్లోని టోలిచౌకీ ప్రాంతానికి చెందిన మహిళగా గుర్తించారు. చిన్న వయసులోనే ఆమె కుటుంబం అబూదాబికి వలస వెళ్లింది. అక్కడ ఇంటర్మీడియట్ వరకు చదివిన ఆమె, డిగ్రీని హైదరాబాద్ షాదాన్ కాలేజీలో పూర్తి చేశారు.
నగరానికే చెందిన దేవేందర్ బాత్రాను వివాహం చేసుకొని తిరిగి అబూదాబికి వెళ్లిపోయారు. ఆమె భర్త దుబాయ్లో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో పని చేస్తుండటంతో వారికుటుంబం అక్కడే స్థిరపడిందని శంషాబాద్ ఆర్జీఐఏ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు.
నిక్కీ జోసెఫ్ దుబాయ్లో ఉంటూ దాదాపు మూడేళ్లుగా సోషల్ మీడియాలో జిహాద్ను ప్రోత్సహిస్తూ ఉగ్రవాద సంస్థవైపు యువతను ఆకర్షిస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. సోషల్మీడియాలో పరిచయమైన యువతను దుబాయ్కి రప్పించి అక్కడి నుంచి టర్కీ మీదుగా సిరియాకు పంపించే ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. దాదాపు 500 మందిని ఐఎస్ఐఎస్లో చేరేలా ఆమె ప్రోత్సహించినట్లు తెలిసింది.
చివరకు నగరానికి చెందిన సల్మాన్ మొయినుద్దీన్ను సిరియాకు పంపే ప్రయత్నంలో ఆమె గుట్టు పోలీసుల చేతికి చిక్కింది. ఆ కేసులో నిక్కీ జోసెఫ్ రెండో నిందితురాలిగా ఉండటంతో ఆమెను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
నిక్కీ జోసెఫ్ పశ్చాత్తాపం
ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థకు సహకరించి పొరపాటు చేశానని నిక్కీ జోసెఫ్ పశ్చాత్తాపం వ్యక్తంచేశారు. ఆ సంస్థ ఇస్లాంను రక్షిస్తుందన్న నమ్మకంతో వారికి అండగా ఉండాలనుకొన్నానని, తన వంతు సహకారంగా సోషల్ మీడియాలో యువతను జిహాద్వైపు మళ్లించేందుకు సాహిత్యాన్ని ప్రచారం చేశానని చెప్పింది.
కానీ వారు ఇస్లాంకు వ్యతిరేకంగా పనిచేస్తుండటం తనకు బాధ కలిగించిందని చెప్పిందని సమాచారం.అందుకే ఈ ఏడాది మార్చి నుంచి ఐఎస్ఐఎస్ వ్యవహారాలకు దూరంగా ఉన్నాను అని పోలీసు విచారణలో ఆమె చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.