రెండు సార్లు మంత్రిగా పనిచేశాడు, స్వంత ఇల్లు కూడ లేదు
ఒక్కసారి ప్రజా ప్రతినిధిగా గెలిస్తే చాలు కోట్లు సంపాదించుకొనేవారున్న ఈ రోజుల్లో రెండు దఫాలు మంత్రిగా, నాలుగు దఫాలు ఎంఏల్ఏగా విజయం సాధించిన జమునా ప్రసాద్ బోస్ కు కనీసం స్వంత ఇల్లు కూడ లేదు.
కాన్పూర్ :రాజకీయాల్లోకి డబ్బులు సంపాదించేందుకు వచ్చారనే అభిప్రాయం ప్రస్తుతం నెలకొని ఉంది.అయితే రెండు దఫాలు మంత్రిగా, నాలుగ దఫాలు ఎంఏల్ఏగా పనిచేసిన ఓ వ్యక్తికి కనీసం స్వంత ఇల్లు కూడ లేదు. ఇది నమ్మడానికి కొంత ఆశ్చర్యంగా అన్పించినా ఇది నిజమే.
వార్డు మెంబర్ గానో, సర్పంచ్ గానో, మున్సిఫల్ కౌన్సిలర్ గానో, కార్పోరేటర్ గానో విజయం సాధిస్తే తన టర్మ్ పూర్తయ్యేసరికి లక్షల రూపాయాలను పోగుచేసుకొనే ప్రజాప్రతినిధుల గురించి వినే ఉంటాం, చూసే ఉంటాం. కాని అలాంటి రెండు దఫాలు మంత్రిగా, నాలుగు దఫాలు ఎంఏల్ఏగా పనిచేసిన ఓ వ్యక్తికి కనీసం స్వంత ఇళ్ళు కూడ లేదు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ కు 125 కిలోమీటర్ల దూరంలోని బందా పట్టణంలో జమునా ప్రసాద్ బోస్ నివాసం ఉంటున్నాడు. రెండు గదుల అద్దె ఇంట్లో ఆయన నివాసం ఉంటున్నాడు.ఆయన తన ఇంట్లో ఓ గోడకు వేలాడుతూ ఉన్న సుబాష్ చంద్రబోస్, వినోభా బావేల ఫోటోలు ఉన్నాయి.
ఇంటి మధ్యలో చిన్న మంచం,తినే గిన్నెలు మినహ ఇతర ఆస్తులు మాత్రం ఆయనకు లేవు. జమునా ప్రసాద్ బోస్ కు వచ్చే పెన్షన్ పై ఆదారపడి మాత్రమే జీవనం సాగిస్తున్నాడు.
రెండు దఫాలు మంత్రిగా పనిచేశారు
1977, 1989 లలో ఉత్తర్ ప్రదేశ్ లో పంచాయితీ రాజ్ , గ్రామీణాభివృద్ది, పశుసంవర్థక, మత్స్యశాఖలకు ఆయన మంత్రిగా పనిచేశారు. రెండు దఫాలు మంత్రిగా పనిచేసినా ఆయన డబ్బు సంపాదించలేదు. ప్రజల సేవ కోసమే ఆయన పనిచేశాడు. ప్రజల సేవకోసం సర్వస్వాన్ని త్యాగం చేశాడు.
వారసత్వంగా తనకు సంక్రమించిన ఇంటిని సోదరి వివాహం కోసం విక్రయించాడు.దీంతో ఆయనకు స్వంత ఇల్లు లేకుండా పోయింది .దీంతో ఆయన రెండు గదుల అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు.జమునా ప్రసాద్ బోస్ భార్య చాలా క్రితమే చనిపోయింది. ముగ్గురు కొడుకులు బతుకుదెరువుకోసం ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు.
సుభాష్ చంద్రబోస్ ను ఆయన స్పూర్తిగా తీసుకొన్నారు. ఆయన బాటలోనే నడుస్తారు. అందుకే జమునా ప్రసాద్ ను స్థానికులు బోస్ అని ముద్దుగా పిలుచుకొంటారు.
1962,1967లలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 1969 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యాడు.అయితే ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో ఆయన విజయం సాధించాడు. వరుసగా నాలుగు దఫాలు ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రెండు దఫాలు మంత్రిగా కూడ పనిచేశారు. కాని, పైసా కూడబెట్టుకోలేదు. ఆయన ఈ తరం ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలుస్తారు.