హైద్రాబాద్ను ముంచేసిన వర్షం: భయం గుప్పిట్లో...
హైదరాబాద్: చినుకుపడితే చాలు... హైద్రాబాద్వాసులు భయంతో వణికిపోతున్నారు. వరుస సెలవులతో స్వంత ఊర్లకు వెళ్ళి తిరుగు ప్రయాణమైన నగరవాసులకు సోమవారం కురిసిన కుండపోత వర్షం చుక్కలు చూపించింది. వరసుగా కురుస్తున్న వర్షంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. విశ్వనగరంగా హైద్రాబాద్ను తీర్చిదిద్దుతామని చెబుతున్న పాలకుల మాటల నీటిమూటలేనని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
హైద్రాబాద్ నగరంలో ఇంకా రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో జిహెచ్ఎంసి అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటున్నారు.
Recommended Video
హైద్రాబాద్ నగరంలో డ్రైనేజీ వ్యవస్థ పెరిగిన జనాభాకు అనుగుణంగా లేకపోవడంతో పాటు నాలాలు, చెరువులు, కాలువలపై అక్రమంగా నిర్మాణాలను చేయడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
అయితే చెరువులు, కుంటలపై అక్రమంగా నిర్మించిన నిర్మాణాల కారణంగానే హైద్రాబాద్లో వర్షపు నీరు నిలిచిపోతోందనే అభిప్రాయాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తేనే హైద్రాబాద్లో వర్షం వస్తే ఇబ్బందులు తప్పే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.
మరో 48 గంటల పాటు వర్షాలు
తెలంగాణలో బుధ, గురువారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులతో పాటు కొన్నిచోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకుడు వై.కె.రెడ్డి తెలిపారు. మంగళవారం సైతం పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకూ రాష్ట్రంలో 520 ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. తెలంగాణ వ్యాప్తంగా వర్ష ప్రబావం ఉందని అధికారులు ప్రకటించారు.
93 ప్రాంతాల్లో కుంభవృష్టి
రాష్ట్రంలో సోమవారం నాడు 93 ప్రాంతాల్లో కుంభవృష్టి మాదిరిగా పడింది. యాదాద్రి జిల్లా రాజాపేట మండలం పాముకుంటలో రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా 15.15, హైదరాబాద్ శివారు బండ్లగూడలో 15.02 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.క్యుములోనింబస్ మేఘాల కారణంగా భారీ వర్షం కురిసింది.
నీటిలోనే వందలాది కాలనీలు
హైద్రాబాద్లో సోమవారం నుండి కురుస్తున్న వర్షం కారణంగా వందలాదీ కాలనీలు, బస్తీలు ఇంకా తేరుకోలేదు. వందల ఇళ్ళలోకి నీళ్లు చేరాయి.మంగళవారం కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. వందలాది కాలనీలు నీటిలోనే నానుతున్నాయి. చెరువులు పూర్తిగా నిండటం, నాలాల్లోని ప్రవాహం కాలనీల్లోకి మళ్లడంతో ప్రజలు అవస్థ పడుతున్నారు. పలు కాలనీల్లో ముంపు తగ్గిపోయినా, మురుగు అడుగు మందం మేర పేరుకుపోయింది.
పునరావాస కేంద్రాలకు బాధితుల తరలింపు
వర్షాల కారణంగా హైద్రాబాద్ నగరంలో పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సరైన తాగునీరు, ఆహారం అందక కాలనీలవాసులు బిక్కుబిక్కుమంటూ ఇబ్బంది పడుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.బంజారహిల్స్లోని సింగిడికుంట, అంబర్పేట పరిధిలోని బగ్గీఖానా, హబ్సిగూడ, శివరాంపల్లి, ప్రభాకర్జీ కాలనీ, తదితర బస్తీల్లో జీహెచ్ఎంసీ ప్రమాదకరంగా ఉన్న ఇళ్లను గుర్తించింది. గృహస్తుల్ని ఖాళీ చేయించి దగ్గర్లోని పునరావాస కేంద్రాలకు తరలించారు.
మునిగిన కాలనీలివే
మల్కాజిగిరి పరిధిలోని ఈస్ట్ ఆనంద్బాగ్, ఎన్ఎండీసీకాలనీ, కాప్రా పరిధిలోని హెచ్బీకాలనీ, ఈసీఐల్, నాచారం, కుషాయిగూడ, భరత్నగర్తో పాటు మియాపూర్, దీప్తిశ్రీనగర్, గచ్చిబౌలి, బంజారహిల్స్, జూబ్లిహిల్స్లోని మురికివాడలు, కాటెదాన్, మీరాలం, పాతబస్తీ, మలక్పేట, ఎల్బీనగర్, నాగోల్, ఉప్పల్లో వందలాది కాలనీలు ఇంకా నీటిలోనే ఉన్నాయి.
మూసీలో కొత్త నీటి ప్రవాహం
ఎగువ నుంచి వచ్చే వరదతో చాలా రోజుల తర్వాత మూసీలో కొత్త నీటి ప్రవాహం కనిపించింది. గ్రేటర్ పరిధిలోని 185 చెరువులకు గాను 105 పూర్తిగా నిండిపోయాయని బల్దియా అధికారులు తెలిపారు. బల్కంపేట్, కూకట్పల్లి, బేగంపేట నాలాల నుంచి వచ్చే వరదతో హుస్సేన్ సాగర్ సైతం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది.అదనపు జలాలు మారియట్ హోటల్ వద్దనున్న మత్తడి ద్వారా మూసీలోకి మళ్లాయి.
భారీ వర్షాలు కురిస్తే హైద్రాబాద్ నరకమే
కుంభవృష్టి వర్షంతో మహానగరం ఇంకా కోలుకోలేదు. ఇప్పటికే నగరంలోని చెరువులు, నాలాలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చినుకు వర్షం పడినా నగర పరిస్థితి ఏమిటీ అన్న భయం వ్యక్తమవుతోంది. ఫలితంగా రద్దీ కూడళ్లు, ప్రాంతాల్లోని రహదార్లు మంగళవారం సాయంత్రం కూడా చెరువులను తలపించాయి.ఇప్పటికే నగరం, శివార్లలో 105 చెరువులు నిండాయి. వాతావరణ శాఖ హెచ్చరికల ప్���కారం మళ్లీ వర్షం కురిస్తే పరిస్థితి ఏమిటీ? అన్న అంశంపై వివిధ శాఖల అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఒక వేళ భారీ వర్షం కురిస్తే ఈ చెరువులకు దిగువన ఉన్న మురికివాడలు, కాలనీల పరిస్థితి ఏమిటీ? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.
హుస్సేన్సాగర్లోకి వరద నీరు
హుస్సేన్సాగర్లోకి రోజుకీ 4వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో, ఔట్ ఫ్లో ప్రవాహం ఉంటుంది. ఇందులో 1700 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తుండగా, 1400 క్యూసెక్కుల నీరు రోజుకి ఇందులోకి చేరుతోంది. గరిష్ట నీటి మట్టం 513 అడుగులుండగా, 514.75 వరకు నీరు వచ్చినా మెయింటైన్ చేయవచ్చునని దీంతో ఎలాంటి ఢోకా లేదని జిహెచ్ఎంసి చెరువుల విభాగం ఎస్ఈ శేఖర్రెడ్డి తెలిపారు.
ఐటి కారిడార్ అతలాకుతలం
భారీ వర్షానికి ఐటి కారిడార్ అతలాకుతలమైయింది. సాయంత్రం ఇంటికి చేరుకునే సమయంలో కురిసిన భారీ వర్షం ప్రజలకు, పోలీసులుకు వాహనదారులకు నరకాన్ని చూపింది. ఉదయం అదే పరిస్థితి. డ్యూటీలకు ఉద్యోగులందరూ వర్షానికి భయపడి కార్లలో రావడంతో హైటెక్ రోడ్లు ట్రాఫిక్ చక్రబంధంలో ఇరక్కుపోయారు. లింగంపల్లి నుండి రాయదుర్గం వరకు, గచ్చిబౌలి నుండి ఫైనాన్సియల్ డిస్టిక్ వరకు, నానక్రాంగూడ నుండి గచ్చిబౌలి చౌరస్తా వరకు, హఫీస్పేట నుండి గచ్చిబౌలి వరకు, హైటెక్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుండి మాదాపూర్ రహేజా మైండ్స్పేస్ వరకు అన్ని రోడ్లు ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుపోయాయి.ఖాజగూడ జంక్షన్ నుండి విప్రో వరకు, బయోడైవర్సిటీ నుండి రహేజా మైండ్స్పేస్ వరకు వాహనాలతో రహదారులు నిండి పొవడంతో ఉద్యోగులు, ప్రజలు, పోలీసులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.
జెసిబిలతో డివైడర్ల తొలగింపు
రోడ్లపై నాలుగు అడుగులు నీరు నిలిచి పోవడంతో, నీరును మళ్లించే పనులకు అంతరాయం ఏర్పడింది. సైబరాబాద్ కమిషనరేట్ నుండి రాయదుర్గం మార్గంలోని ఇంజనీరింగ్ స్ట్ఫా కాలేజీ వద్ద నదిలా వరద ప్రవహిస్తుండడంతో జిహెచ్ఎంసి సిబ్బంది స్పందించి జెసిబిలతో రోడ్డుకి అండంగా ఉన్న డివైడర్ను తొలగించి వరదను మళ్లించారు. బయోడైవర్సిటీ వద్ద ఉన్న రత్నదీప్ సూపర్ మార్కెట్ సెల్లార్ మునిగి పోవడంతో బైసైకిల్ స్టాండ్లోకి వర్షం నీరు చేరుకుంది. లుంబిని లేఔట్లోని ఇళ్లు, సెలార్లతో పాటు పక్కనే ఉన్న లేబర్ కాలనీలు నీట మునిగిపోయాయి. సర్కిల్-20 ఉప కమిషనర్ మమత ఉదయం ఐదు గంటల నుండే సహాయక చర్యలకు ఉపక్రమించారు.
ట్రాఫిక్ మళ్ళింపు
మాదాపూర్ ట్రాఫిక్ డిసిపి ఎఆర్ శ్రీనివాస్ రావు స్వయంగా రంగంలోకి దిగి సిబ్బందికి సూచనలు సలహాలు ఇచ్చారు. ఉదయం పరిస్థితిని గమనించిన డిసిపి.. ఐటి గచ్చిబౌలిలోని విప్రో, ఇన్ఫ్సిస్, ఐసిఐసిఐ బ్యాంకులకు వెళ్లెవారిని ఖాజాగూడ వైపు లింగంపల్లి నుండి రహేజా మైండ్స్పేస్కు వచ్చే వాహనాలను బొటానికల్ గార్డెన్ నుండి వెళ్లాలని ఐటి సంస్థలకు పంపించారు. మధ్యాహానానికి కొంత ట్రాఫిక్ తగ్గింది. సోమవారం కురిసిన భారీ వర్షానికి రోడ్డు కొట్టుకుపోవడంతో రహదారులు గుంతల మయంగా మరాయి. ఒకవైపు గుంతల రోడ్లు, మరోవైపు నాలుగు అడుగుల లోతు.. నీళ్లు ఎక్కడ గుంతలున్నాయో తేలియని పరిస్థితి దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ట్రాఫిక్ అంతరాయానికి ప్రధాన కారణం రోడ్లు సరిగా లేకపోవడంతో పాటు ఉద్యోగులందరూ కార్లలో కార్యాలయాలకు రావడం సమస్యగా ఏర్పడిందని అధికారులు చెప్పారు.
ఎమ్మెల్యే, కమిషనర్ సూచనలు
సైబరాబాద్ కమిషనరేట్ ముందే గంటల తరబడి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడంతో కమిషనర్ సందీప్ శాండిల్య స్వయంగా రంగంలోకి దిగి ఎందుకు ట్రాఫిక్ జామ్ అవుతుంతో అడిగి తెలుసుకున్నారు. అప్పటికే అక్కడే ఉన్న ఎమ్మెల్యే గాంధీ కూడా వచ్చి సమస్యను వివరించారు. ట్రాఫిక్ అంతరాయం కాకుండా నానక్రాంగూడ వైపు వెళ్లే వాహనాలను ఖాజాగూడ నుండి మళ్లించాలని సూచించారు. త్వరగా ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని కోరారు.
జలమండలి అధికారులు అప్రమత్తంగా ఉండాలి
నగరానికి మరో 72 గంటల పాటు అతిభారీ వర్షసూచన ఉండటంతో జలమండలి అధికారులు కూడా 24 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఖైరతాబాద్లోని బోర్డు ప్రధాన కార్యాలయంలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. జలమండలి సంబంధిత ఫిర్యాదుల కోసం నగరవాసులు 155313, అలాగే సెల్ నెంబరు 9989996948కు ఫోన్ చేయవచ్చునని సూచించారు.
14.బారీ ఎయిర్టెక్, మినీ ఎయిర్ టెక్ మిషన్ల ఏర్పాటు
వర్షం కురుస్తున్నపుడు, లేక ఆ తర్వాత నగరానికి అతి భారీ వర్షసూచన ఉన్నంత కాలం రాత్రింపగళ్లు భారీ ఎయిర్టెక్, మినీ ఎయిర్టెక్ మిషన్లు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. పారిశుద్ద్యానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం జలమండలి ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ బృందాలు జిహెచ్ఎంసి కంట్రోల్ రూమ్లో విధులు నిర్వర్తించనున్నట్లు జలమండలి ఎండీ దానకిషోర్ చెప్పారు.
15. మ్యాన్హోల్స్ జాగ్రత్తగా పరిశీలించాలి
డిజిఎంలు తమ పరిధిలోని అన్ని మ్యాన్హోళ్లను పరిశీలించి, వాటిపై ఉంచిన మూతల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని ఆదేశించారు. తెరిచిన మ్యాన్హోళ్ల వద్ద హెచ్చరిక బోర్డులు, అలాగే ఎరుపు రంగు జెండాలను ప్రజలకు తెలిసేలా ఉంచాలన్నారు. కాలుష్య నివారణ కోసం బస్తీల్లో క్లోరిన్ మాత్రలను పంపిణీ చేయటంతో పాటు ఏదైనా లోపంతో సాధారణ నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడితే, అది పునరుద్ధరించే వరకు మంచినీటి ప్యాకెట్లను పంపిణీ చేయాలని ఆదేశించారు
16. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదు
నగరానికి మరో రెండురోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు హెచ్చరికలున్నందున, ప్రజలు అత్యవసరమైతే తప్పా బయటకు రావద్దని జిహెచ్ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి సూచించారు. ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఐఎండి వెబ్సైట్ ద్వారా వాతావరణం గురించి తెల్సుకుని అతి భారీ వర్ష సూచనలున్నపుడు బయటకు రాకుండా ఉంటే మంచిందని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం సాయంత్రం కేవలం నాలుగైదు గంటల వ్యవధిలోనే 12 నుంచి 13 సెంటీమీటర్ల వర్షం కురిసిందున చాలా ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వటం, మరికొన్ని ప్రాంతాల్లో నాలాలు వంటివి ప్రవహించటంతో ఇళ్లలోకి నీరు వచ్చినట్లు జిహెచ్ఎంసి కమిషనర్ జనార్థన్రెడ్డి వివరించారు.
17. కంట్రోల్ రూమ్ ఏర్పాటు
నిత్యం నీరు నిలిచే సమస్యాత్మకమైన సుమారు 400 ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల వివరాలను కూడా జిహెచ్ఎంసి వెబ్సైట్లో ఉంచినట్టు కమిషనర్ జనార్థన్రెడ్డి చెప్పారు. అతి భారీ వర్ష సూచనలున్నపుడు ప్రజలు అవి చూసుకోవాలని ఆయన కోరారు. వర్షానికి సంబంధించిన ఏ ఫిర్యాదు కోసమైన ప్రజలు డయల్ 100, 21111111 నెంబర్కు ప్రధాన కంట్రోల్ రూంకు తెలియజేయవచ్చునని ఆయన సూచించారు. వీటితో పాటు వివిధ శాఖల వారీగా కూడా కంట్రోల్ రూంలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
18.పంటల మునక
జిల్లాల్లో పలుచోట్ల వర్షపు నీటిలో పైర్లు మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నీరు వెళ్లిన తరవాత పంటనష్టాలను అంచనా వేయనున్నట్లు వ్యవసాయశాఖ తెలిపింది. . కృష్ణానదికి వరద వస్తున్నందున జూరాలలో జలవిద్యుదుత్పత్తి పెరిగింది. మొత్తం 400 మెగావాట్ల వరకూ ఉత్పత్తి చేస్తున్నారు. సింగూరులో 15, పోచంపాడులో 9 మెగావాట్లను ఉత్పత్తి చేస్తున్నట్లు జెన్కో సీఎండీ డి.ప్రభాకరరావు తెలిపారు. వర్షాల వల్ల రాష్ట్రంలో కరెంటు వినియోగం గణనీయంగా తగ్గింది. వారం క్రితం రోజూవారీ వినియోగం 9 వేల మెగావాట్లకు పైగా ఉంటే మంగళవారం 6,800 మెగావాట్లకు తగ్గడంతో విద్యుత్తు పంపిణీ సంస్థలు వూపిరి పీల్చుకున్నాయి.