స్మార్ట్సిటీ, హైద్రాబాద్: తెలంగాణకు ఎందుకు రాలేదు?
హైదరాబాద్/న్యూఢిల్లీ: స్మార్ట్ సిటీ నగరం కోసం తెలంగాణ నిరీక్షించినప్పటికీ, ఫలితంలేదు. స్మార్ట్ సిటీల జాబితాలో తెలంగాణకి స్థానం లభించలేదు. దేశంలో 20 నగరాలను స్మార్ట్సిటీలుగా కేంద్రం అభివృద్ధి చేయనుంది. దశలవారీగా 100 నగరాలను అభివృద్ధి చేయాలని కేంద్రం గతంలోనే నిర్ణయించింది.
తొలిదశలో 20 నగరాలను కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు గురువారం ప్రకటించారు. కేంద్రం రూపొందించిన మార్గదర్శకాల మేరకు స్మార్ట్సిటీలను ఎంపిక చేసేందుకు రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీని సర్కారు నియమించింది.
తెలంగాణలోని రాష్ట్రంలోని 68 పురపాలక సంఘాల మధ్య వివిధ అంశాల్లో పోటీలను నిర్వహించింది. ఆన్లైన్ సేవల నుంచి ఆస్తి పన్ను వసూళ్ల వరకు వివిధ అంశాల్లో ఆయా మున్సిపాలిటీల పని తీరు ఆధారంగా నగరాలకు ర్యాంకులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.
ఆ పోటీల్లో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లు తొలి ముడు స్థానాల్లో నిలిచాయి. ఆయా నగరాల సమగ్రాభివృద్ధి కోసం కన్సల్టెంట్లను నియమించి ప్రణాళికలను రూపొందించింది. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ను కేంద్రానికి తొలుత ప్రతిపాదించింది.
ఆయా నగరాల అభివృద్ధికి నిధుల కేటాయింపు తీరు తెన్నులపై విధి విధానాలను కేంద్రం విడుదల చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. కేంద్రం ఇచ్చే నిధులు హైదరాబాద్ నగరాన్ని స్మార్ట్సిటీగా అభివృద్ధి చేసేందుకు సరిపోవన్న అభిప్రాయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది.
ఈ నేపథ్యంలో ఆ ప్రతిపాదనల నుంచి హైదరాబాద్ నగరాన్ని తప్పించాల్సిందిగా కేంద్రాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పోటీల్లో మూడో స్థానంలో నిలిచిన కరీంనగర్ను స్మార్ట్సిటీల జాబితాలో చేర్చాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
వరంగల్, కరీంనగర్ నగరాలతో నూతన ప్రతిపాదనలను కేంద్రానికి పంపింది. తెలంగాణ నుంచి రెండు నగరాలను ప్రతిపాదించినప్పటికీ తొలి జాబితాలో ఒక్క నగరానికి కూడా చోటు లభించలేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖపట్నం, కాకినాడ నగరాలు ఎంపికయ్యాయి.
స్మార్ట్సిటీల జాబితా నుంచి హైదరాబాద్ను తొలగించకపోయిఉంటే తెలంగాణకు తొలి జాబితాలో ప్రాతినిధ్యం ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం ఇచ్చే నిధులు సరిపోవనే రాష్ట్ర ప్రభుత్వం భాగ్యనగరాన్ని జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించిందని వార్తలు వస్తున్నాయి.