ప్రధాని బ్యాటింగ్ చేస్తే గ్రౌండ్ బయటకు బంతి: లలిత్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీకి ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ కితాబిచ్చారు. ప్రధాని మోడీ అత్యంత సమర్థుడని పేర్కొన్నారు. ఆయనకు తన సలహా అక్కరలేదన్నారు. ఆయన బ్యాటింగ్ చేస్తుంటే బంతి గ్రౌండ్ బయటకు వెళ్లేలా కొట్టగలరని చెప్పారు.
మీడియాను మేనేజ్ చేయడంలో ఇబ్బంది పడుతున్న మన ప్రధాని మోడీకి మీరు ఏమైనా సలహా ఇస్తారా అని ట్విట్టర్లలో అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా స్పందించారు. కాగా, లలిత్ మోడీ, సుష్మా స్వరాజ్, వసుంధర రాజేల వ్యవహారంపై బీజేపీ విపక్షాల నుండి ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
తొమ్మిదోసారి మన్ కీ బాత్లో మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్లో ఆదివారం నాడు మాట్లాడారు. ఆయన తొమ్మిదోసారి మన్ కీ బాత్లో మాట్లాడారు. యోగా డేను ప్రపంచ దేశాలు నిర్వహించడం గర్వకారణమని మోడీ అన్నారు. ఐరాస చీఫ్ యోగా చేయడం చూసి తాను సంతోషించానని చెప్పారు.
ప్రతి నీటి చుక్కను మనం సద్వినియోగం చేసుకోవాలన్నారు. తమది క్రియశీలక ప్రభుత్వం అని నిరూపించామని చెప్పారు. రక్షాబంధన్ నాటికి మహిళల కోసం ఓ ప్రత్యేక కార్యక్రమం చేపడతామన్నారు. మొక్కలు నాటే కార్యక్రమం పైన ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
2022 నాటికి అందరికీ ఇళ్లు తమ ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. బాలికల విద్యకు తాము అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నట్లు చెప్పారు. మూడు ముఖ్యమైన సామాజిక భద్రత భీమా పథకాలను ప్రారంభించామని చెప్పారు.