అంతా నాటకమేనా?: ఈ ప్రశ్నలకు బదులేది.. బాబు 'తెగదెంపుల' పర్వం వెనుక..
Recommended Video
అమరావతి: మొత్తానికి ఇన్నాళ్ల కలహాల కాపురం తర్వాత ఎన్డీయే నుంచి బయటకొచ్చేందుకు టీడీపీ వడివడిగా పావులు కదుపుతోంది. తెగదెంపులకు అవసరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసేందుకు సీఎం చంద్రబాబు నుంచి అందుకు అవసరమైన లీకులు అందుతున్నాయి.
రాజీపడే ప్రసక్తే లేదు.. మిత్రపక్షం అని గమ్మున ఉన్నా: కేంద్రంపై చంద్రబాబు
అంతా బాగానే ఉంది కానీ.. ఈ నాలుగేళ్ల ప్రయాణంలో ఎన్నడూ కేంద్రాన్ని గట్టిగా నిలదీయని చంద్రబాబు.. ఇప్పుడు కూడా మరో కొత్త నాటకానికే తెరదీశారా? అన్న సందేహాలు ప్రత్యర్థి శిబిరం నుంచి వ్యక్తమవుతున్నాయి.
ప్యాకేజీ నుంచి హోదా వైపు..:
కేంద్రం చెప్పిన ప్యాకేజీకి కట్టుబడి దానితోనే సర్దుకుపోవాలని నిర్ణయించుకుంది టీడీపీ. పైగా హోదా అనేది సంజీవని ఏమి కాదని, అనవసరంగా ప్రజల్లో అపోహలను రేకెత్తించవద్దని సీఎం చంద్రబాబే పలుమార్లు పలు వేదికలపై చెబుతూ వచ్చారు.
కానీ తీరా ఇప్పుడు ఆయన మాట మళ్లీ హోదా వైపు షిఫ్ట్ అయింది. హోదా ఇస్తేనే తప్ప బీజేపీతో కలిసి సాగే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు.
ప్లేటు ఫిరాయించారా?:
కేవలం తన తప్పులన్నింటిని కేంద్రంపై నెట్టివేయడానికే చంద్రబాబు ఈ తెగదెంపుల నాటకానికి తెరలేపారని ప్రత్యర్థి శిబిరం ఆరోపిస్తోంది. పోలవరం నిధుల విషయంలో సమాధానం చెప్పలేక.. ఓటుకు నోటు కేసు భయంతోనూ ఇన్నాళ్లు కేంద్రానికి సాగిలపడుతూ వచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు ప్రజలంతా తిరగబడే సమయం ఆసన్నమయ్యేసరికి ప్లేటు ఫిరాయించారని వారు ఆరోపిస్తున్నారు.
ఈ ప్రశ్నలకు బదులేది?:
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో టీడీపీ బృందం భేటీ అనంతరం ఈ తెగదెంపుల లీకులు తెరపైకి వచ్చాయి. అయితే ఈ బేటీలో జైట్లీ అడిగిన చాలా ప్రశ్నలకు టీడీపీ బృందం వద్ద బదులే లేకుండా పోయిందనేది కూడా ప్రత్యర్థి పార్టీ ఆరోపణ.
టీడీపీ బృందం హోదా గురించి జైట్లీని ప్రశ్నించిన సమయంలో.. అదేంటి? గతంలో మీరే ప్యాకేజీ బ్రహ్మాండంగా ఉందన్నారు కదా! అని బదులిచ్చారట. దీంతో టీడీపీ బృందానికి మాట పడిపోయినట్టు చెబుతున్నారు.
పోలవరం, రాజధాని నిధులపై..:
ఇక పోలవరం, రాజధాని అమరావతిల కోసం కేటాయించిన నిధుల గురించి ప్రశ్నిస్తే.. దానికి కూడా టీడీపీ బృందం వద్ద బదులే లేకుండా పోయిందంటున్నారు.
అలాగే ప్రత్యేక ప్యాకేజీ విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలపై సమాధానం చెప్పడానికి ఎందుకు జాప్యం చేస్తున్నారని జైట్లీ ప్రశ్నించగా.. మా నాయకుడితో చర్చించి చెబుతామని బయటకొచ్చేసినట్టు సమాచారం.
బీజేపీని దోషిగా నిలబెట్టడానికేనా?:
కేంద్రం ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేక.. ఇక ఇరుక్కుపోక తప్పని పరిస్థితి తలెత్తడంతోనే చంద్రబాబు తెగదెంపుల పర్వాన్ని తెర పైకి తీసుకొచ్చారని అంటున్నారు. తన తప్పిదాలను కప్పి పుచ్చుకుని హోదా మాటున కేంద్రాన్ని దోషిగా నిలబెట్టాలనేదే ఆయన ప్రయత్నమని వైసీపీ గట్టిగా ఆరోపిస్తోంది.