అవును అదే జరిగింది: ‘పద్మావతి’ వాయిదా.. భన్సాలీ, దీపికలకు వెల
షూటింగ్ ప్రారంభం నుంచే వివాదాల్లో చిక్కుకున్న ‘పద్మావతి’ విడుదల ఎట్టకేలకు వాయిదా పడింది. మళ్లీ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నదీ మున్ముందు గానీ తేలదు.
Recommended Video
ముంబై: అనుకున్నంతా అయ్యింది. రాజపుత్రుల వంశీయురాలు 'రాణి పద్మిని' జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన చారిత్రక చిత్రం 'పద్మావతి' వివాదాలు, హెచ్చరికల మధ్య విడుదల ఎట్టకేలకు వాయిదా పడింది. ఈ సినిమాలో బాలీవుడ్ కథా నాయిక దీపికా పదుకునే టైటిల్ రోల్ పోషించారు. చిత్తోడ్గఢ్ రాజు రతన్ సింగ్ పాత్రలో షాహిద్ కపూర్, అల్లా ఉద్దీన్ ఖిల్జీ పాత్రలో రణ్వీర్సింగ్ నటిస్తున్నారు.
ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం చుట్టూ ఎన్నో వివాదాలు ముసురుకున్నాయి. తొలుత చిత్ర బృందం ఈ సినిమాను డిసెంబర్ ఒకటో తేదీన ప్రేక్షకుల ముందుకు తేనున్నట్లు వెల్లడించింది. తాజాగా సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
వక్రీకరణలే లేవన్న సంజయ్ లీలా భన్సాలీ
‘పద్మావతి' చిత్రాన్ని డిసెంబర్ 1న విడుదల చేయటం లేదు. వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్, స్టూడియో ఈ మేరకు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకుంది' అని ఓ ప్రకటనలో తెలిపింది. సినిమా ఆన్ సెట్స్లో ఉన్నప్పుడే చరిత్రను వక్రీకరించారంటూ రాజ్పుత్ కర్ణి సేనలు ఆరోపణలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అటువంటిది ఏమీ లేదని దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ చెబుతున్నారు. మరి, విడుదల ఎందుకు వాయిదా వేశారో? బీటౌన్లో ఏం జరుగుతుందో? మున్ముందు వేచి చూడాల్సిందే మరి.
ప్రీవ్యూలపై సీబీఎఫ్సీ చైర్మన్ ప్రసూన్ జోషి తీవ్ర వ్యతిరేకత
‘చట్టం, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ)లను గౌరవిస్తున్నాం' అని వయాకామ్18 అధికార ప్రతినిధి తెలిపారు. సినిమా విడుదల చేసేందుకు కావాల్సిన అనుమతులు త్వరలోనే వస్తాయన్న నమ్మకం ఉందని తెలిపారు. సినిమాను సెన్సార్ బోర్డు కన్నా ముందే వివిధ మీడియా ఛానల్స్ ప్రతినిధులకు ప్రదర్శించడాన్ని సీబీఎఫ్సీ చీఫ్ ప్రసూన్ జోషి తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో దరఖాస్తు అసంపూర్ణంగా ఉందని సినిమాను సీబీఎఫ్సీ వెనక్కి పంపింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని వైకామ్ స్టూడియో తెలిపింది.
ఎవరి మనోభావాలను కించపర్చడం లేదని వివరణలు ఇలా
‘పద్మావతి' సినిమా చిత్రీకరణ సమయంలోనే పలు అడ్డంకులు ఎదుర్కొన్నది. పలువురు సినిమా షూటింగ్ను సైతం అడ్డుకున్నారు. ఈ చిత్రానికి సంబంధించి అక్టోబర్లో తొలి పోస్టర్ను విడుదల చేయగా, అప్పటి నుంచి వివాదం మరింత ముదిరింది. భన్సాలీ చరిత్రను వక్రీకరిస్తున్నారని, రాణి పద్మావతిని కించపరిచేలా చిత్రంలో చూపిస్తున్నారని ఆరోపించారు. దీనిపై చిత్ర బృందం వివరణ ఇచ్చింది. ఎవరి మనోభావాలను దెబ్బ తీయకుండా సినిమాను తెరకెక్కించినట్లు తెలిపింది. సినిమా విడుదలకు ముందే తమకు చూపించాలని పలు వర్గాల ప్రజలు డిమాండ్ చేశారు.
ఆందోళనల పట్ల దీపిక విస్మయం!
చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన ‘పద్మావతి' సినిమాపై వివాదం రోజురోజుకు తీవ్రం అవుతోంది ‘పద్మావతి' సినిమాను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు సంజయ్లీలా భన్సాలీకి బెదిరింపులు ఆగడం లేదు. తాజాగా భన్సాలీ తలకు అఖిల భారతీయ క్షత్రియ మహాసభ వెలగట్టింది. భన్సాలీ తలను నరికి తెచ్చిస్తే రూ. 10 కోట్లు ఇస్తామని తీవ్ర వివాదాస్పద వ్యాఖ్య చేసింది. హర్యానా బీజేపీ నేత సూరజ్ పాల్ అము స్పందిస్తూ భన్సాలీ, పదుకునే తలలు నరికిన వారికి రూ.10 కోట్ల చొప్పున బహుమతి ఇస్తామని ప్రకటించేందుకు కూడా వెనుకాడలేదు.
మన:స్థాపానికి గురయ్యానన్న దీపిక
ఇక ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషించిన దీపికా పదుకోన్ ఆందోళనలపై మరోసారి స్పందించింది. ‘పద్మావతి' సినిమాను వివాదాస్పదం చేయడంపై ఆమె విస్మయం వ్యక్తం చేశారు. సినిమాలో ఎక్కడా అభ్యంతరకర సన్నివేశాల్లేవని దీపికా పదుకునే స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థపై తనకు నమ్మకముందని, కచ్చితంగా తమకు న్యాయం జరుగుతుందని ఆమె అన్నారు. ఒక మహిళ, కళాకారిణిగా రెండేళ్ల పాటు ఈ సినిమా కోసం పని చేశానని చెప్పారు. తాజా పరిస్థితులతో మన:స్తాపానికి గురయ్యానని, కోపంగా ఉన్నాని చెప్పారు. తాజా పరిస్థితుల్లో దాంతో చిత్రబృందమే ‘పద్మావతి'పై పరదా వేసింది. మరి, ప్రేక్షకులకు చిత్రాన్ని ఎప్పుడు చూపిస్తారనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. కాకపోతే కేంద్రంలోని అధికార బీజేపీ, కాంగ్రెస్ ఒకే వైఖరి ప్రదర్శించాయి. ఈ సినిమాను వాయిదా వేయాలని రాజస్థాన్ సీఎం వసుంధరా రాజె సింధియాకు చిత్తోడ్ గఢ్ ఎంపీ సీపీ జోషి వినతిపత్రం సమర్పించి సినిమా వాయిదా వేయించాలని కోరారు. రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ మాట్లాడుతూ భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో చరిత్రను వక్రీకరించొద్దని వ్యాఖ్యానించారు.