పనామా పేపర్స్ కలకలం: తెలుగు కుబేరుల పేర్లు కూడా!
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపిన పనామా పేపర్స్ ఇప్పుడు తెలుగు ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. సెంట్రల్ అమెరికా నుంచి బహిర్గతమైన పనామా పేపర్స్ లో పలువురు తెలుగువాళ్ల పేర్లు తెరమీదకు రావడం గమనార్హం. ఈ మేరకు ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం ప్రచురితం చేసింది.
నల్లధన కుబేరుల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మోటూరి శ్రీనివాస ప్రసాద్, వోలం భాస్కరరావు, భావనాశి జయకుమార్ పేర్లు ప్రధానంగా ఈ పేపర్లలో కనిపిస్తున్నాయి.
మొసాక్ ఫోన్సెకా బయటపెట్టిన ఈ జాబితాలో మోటూరి శ్రీనివాస ప్రసాద్ 2011లో నమోదైన నాలుగు సంస్థల్లో విదేశీ డైరెక్టరుగా కొనసాగుతోంటే, మరో ఇద్దరు వోలం భాస్కరరావు, భావనాశి జయ కుమార్లు ఎస్డి వెంచర్స్, సికా సెక్యురిటీస్, భాసు కేపిటల్స్, బీపీ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్లో వాటాదారులుగా పేర్కొంది.
అయితే వీరు చట్టబద్ధంగా తమ ధనాన్ని దాచుకున్నారా? లేక అది నల్లధనమా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా పనామాలో తెలుగోళ్ల పేర్లు బయటకురావటం హైదరాబాద్ వ్యాపారవర్గాల్లో సంచలనంగా మారింది.
కాగా, తెలుగు కుబేరుల వివరాలు, స్పందన:
1. మోటూరి శ్రీనివాస్ ప్రసాద్... హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త. ఇతనికి బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్లో 4 ఆఫ్షోర్ సంస్థలు ఉన్నట్లు మొసాక్ ఫోన్సెకా సంస్థ నుంచి లీకైన పత్రాల్లో తేలింది. ఈయనకు చెందిన యెస్ దే వెంచర్స్ ఎస్ఏ.. సికా సెక్యూరిటీస్ లిమిటెడ్.. భాసు క్యాపిటల్స్ లిమిటెడ్.. బీ పీ ఇన్వెస్టిమెంట్స్ కార్ప్ సంస్థలలో హైదరాబాద్కు చెందిన ఓలం భాస్కర్రావు.. భవనాసి జయ కుమార్లు డైరెక్టర్లుగా.. షేర్ హోల్డర్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సంస్థలు 2011లో రిజిస్టరై ఉన్నట్లు పత్రాల్లో తేలింది.
మోటూరి శ్రీనివాస్ ప్రసాద్ ప్రస్తుతం నందన్ క్లీన్టెక్ సంస్థకు ఎగ్జిక్యుటివ్ ఛైర్మన్గా.. ఎండీగా వ్యవహరిస్తున్నారు. అలాగే సికా సెక్యూరిటీస్ లిమిటెడ్లోమ భాగస్వామిగా ఉన్నారు. అక్రమంగా బయో డీజిల్ను విదేశాలకు ఎగుమతి చేస్తున్నాడన్న ఆరోపణలతో 2012లో అరెస్టై బెయిల్పై విడుదలయ్యారు.
స్పందన: 2005- 2006లో ఆ సంస్థలను ప్రారంభించామని.. ప్రస్తుతం అవన్నీ పనిచేయడం లేదని శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. వాటిలో ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదన్నారు.
2. భావనాసి జయకుమార్.. హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్లోని కొన్ని సంస్థలకు డైరెక్టరుగా ఉన్నట్లు చెబుతున్నారు. నందన్ టెక్నాలజీస్ లిమిటెడ్కు అనుబంధంగా ఉన్న ఆరు కంపెనీలకు ఈయన డైరెక్టర్గా వ్యవహరించినట్లు పత్రాల్లో తేలింది.
స్పందన: ఆ ఆఫ్షోర్ కంపెనీలతో నేను చేసేది ఏమీ లేదు. వాటికి ఓలన్ భాస్కర్ రావు ఎండీగా ఉన్నారు. అన్ని విషయాలూ ఆయనే చూసుకుంటారు. విదేశీ ఖాతాల గురించి నాకు తెలియదు. నందన్ టెక్నాలజీస్ 2014లోనే మూతపడింది. రెండు సంస్థలు తన భార్యకు చెందినవని తెలిపారు.
3. ఓలం భాస్కర్ రావు
నందన్ టెక్నాలజీస్తో పాటు.. మరో 6 అనుబంధ సంస్థలకు ఎండీగా ఉన్నారు. సికా సెక్యూరిటీస్ లిమిటెడ్లో భాగస్వామి అని రికార్డులు చెబుతున్నాయి. నందన్ క్లీన్టెక్ లిమిటెడ్కు ప్రమోటర్గా.. 2008 ఏప్రిల్ నుంచి ఎండీగా ఉన్నారు. ప్రస్తుతం ఎక్కువగా యూకేలో ఉంటున్నారు.
స్పందన: ఓలన్ భాస్కర్రావు కుమారుడు మాట్లాడుతూ..'' మా నాన్న రిటైర్ అయినప్పటి నుంచి ఆ కంపెనీలను మోటూరి శ్రీనివాస్ ప్రసాద్ చూస్తున్నారు. నాలుగేళ్ల కింద ఆ కంపెనీలను స్థాపించారు. అనుమతులు.. నిర్వహణ కోసం పెట్టుబడులు భారీగా పెట్టాల్సి వచ్చింది'' అని అన్నారు. ఆ సంస్థలకు సంబంధించి నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని వివరించారు.
కాగా, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు తమ దేశాలను వదిలి పన్ను ఎగవేతకు స్వర్గాల్లాంటి విదేశాల్లో డమ్మీ కంపెనీలు పెట్టి, వాటిలోకి ఇన్వెస్ట్మెంట్లు తరలించిన విషయాలను పనామా పేపర్స్ బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. మొదటి జాబితాలోనే పలువురు భారత ప్రముఖుల పేర్లను వెల్లడించిన పనామా పేపర్స్.. ఈ వ్యవహారంలో భారతీయులకు సంబంధించి మంగళవారం రెండో జాబితాను కూడా బయటపెట్టింది.