సంచలనం సృష్టిస్తోన్న ప్యారడైజ్ పేపర్స్?: చిక్కుల్లో అమితాబ్, ఆ కంపెనీలో పెట్టుబడులపై అనుమానాలు!..
భారత్ లోని నల్లకుబేరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన పనామా పేపర్స్ లీక్ ఇంకా మరిచిపోకముందే మరో లీక్ కలకలం రేపుతోంది.
Recommended Video
న్యూఢిల్లీ: భారత్ లోని నల్లకుబేరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన పనామా పేపర్స్ లీక్ ఇంకా మరిచిపోకముందే మరో లీక్ కలకలం రేపుతోంది. ప్యారడైజ్ పేపర్స్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా పన్ను ఎగ్గొట్టిన నల్లకుబేరుల జాబితా ఒకటి బయటపడింది.
ఇందులో 180 మంది దేశాలకు చెందిన బడాబాబుల డేటా లీకవగా.. అందులో భారత్ నుంచి 714మంది ఉండటం గమనార్హం. లీకైన డేటా పరంగా భారత్ 19వ స్థానంలో ఉన్నట్టు తెలుస్తోంది.
13.4 మిలియన్ పేపర్స్ లీక్
ఈ లీకేజీ వెనుక ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) సంస్థ ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు 13.4 మిలియన్ పేపర్లను లీక్ చేసినట్టు సమాచారం. గతంలో పనామా పేపర్స్ను లీక్ చేసింది కూడా ఐసీఐజేనే కావడం గమనార్హం.
పన్నుల నుంచి తప్పించుకునేందుకు బడా బాబులు, కంపెనీలు తమ ఆస్తులను ఎలా దాచుకున్నదీ ఈ పేపర్లలో విపులంగా ఉంది. పేపర్ల లీకేజీపై స్పందించిన 'అప్లెబీ' తమ సమాచారం అపహరణకు గురైందని, అయితే తమ వద్ద ఎటువంటి అవకతవకలు జరగలేని స్పష్టం చేసింది.
పుతిన్ అల్లుడి పేరు కూడా
పనామా పేపర్స్ కుంభకోణంలో చిక్కుకున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీప్ తన పదవిని కోల్పోవడంతో.. తాజా పారడైజ్ లీక్స్ వ్యవహారం ఎవరెవరి మెడకు చుట్టుకుంటుందనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది.
లీకైన డాక్యుమెంట్లలో అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్ రోస్ పేరు కూడా ఉంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అల్లుడికి చెందిన 'నేవిగేటర్ హోల్డింగ్స్'లో అతనికి వాటా ఉన్నట్టు వెల్లడించింది.
అమితాబ్ ఒప్పందంపై
ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం ప్రకారం.. పారడైజ్ లీక్స్ లో అమితాబ్ పేరు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రామానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన మరుసటి సంవత్సరం 2002లో.. బెర్మడాకు చెందిన ఓ డిజిటల్ మీడియా కంపెనీతో ఆయన ఒప్పందం చేసుకున్నట్టు పారడైజ్ లీక్స్ లో వెల్లడైనట్టు సమాచారం. నిజానికి విదేశాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే భారతీయులెవరైనా ఆర్బీఐ అనుమతి పొందాల్సిందే.
చిక్కుల్లో అమితాబ్:
అప్లెబీ నుంచి లీకైన డేటా ప్రకారం.. బచ్చన్, సిలికాన్ వాలీ వెంచర్ ఇన్వెస్టర్ నవీన్ చద్ద జాల్వా మీడియా లిమిటెడ్ లో జూన్ 19, 2002లో షేర్ హోల్డర్స్ గా ఉన్నట్టు వెల్లడైంది. బెర్ముడాలో 2002లో ప్రారంభమైన ఈ కంపెనీ 2005లో మూతపడినట్టు తెలుస్తోంది.
బెర్ముడా కన్నా ముందు కాలిఫోర్నియాలో నలుగురు భారతీయ పారిశ్రామికవేత్తలు ఇదే కంపెనీని జనవరి, 2000వ సంవత్సరంలో అక్కడ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత బెర్మడాలోను ఏర్పాటు చేశారు. అయితే ఈ కంపెనీ కేవలం పేపర్స్ మీదనే చలామణి అయిందన్న ఆరోపణలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో షేర్ హోల్డర్ గా ఉన్న అమితాబ్ మెడకు ఈ వ్యవహారం చుట్టుకునే అవకాశాలున్నాయి.
పారడైజ్ పేపర్స్లో 'మంత్రి జయసిన్హా'
సివిల్ ఏవియేషన్ మినిస్టర్ జయంత్ సిన్హా పేరు కూడా పారడైజ్ పేపర్స్లో ఉన్నట్టు తెలుస్తోంది. లోక్సభకు ఎంపిక కాకముందు ఓమిద్యార్ కంపెనీకి ఆయన మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. ఈ కంపెనీ అమెరికాలోని డి.లైట్ డిజైన్ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. అప్లెబీ నుంచి లీకైన డేటా ప్రకారం.. డి.లైట్ డిజైన్ అనే కంపెనీకి కూడా జయంత్ సిన్హా మేనెజింగ్ డైరెక్టర్ గా చేసినట్టు వెల్లడైంది.
కానీ 2014లోక్ సభ ఎన్నికల సందర్భంగా సమర్పించిన డిక్లరేషన్ లో జయంత్ సిన్హా ఈ విషయాన్ని ఎక్కడా పేర్కొనలేదు. ఆ తర్వాత లోక్ సభ సెక్రటేరియట్ కు గానీ ప్రధాని కార్యాలయానికి గానీ ఆ వివరాలు అందించలేదు. ఇప్పుడు పారడైజ్ పేపర్స్ రూపంలో ఆ వివరాలు వెల్లడి కావడంతో.. వాటిని సీక్రెట్ గా ఎందుకు ఉంచాల్సి వచ్చిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇదిలా ఉంటే, తనపై వస్తున్న ఆరోపణలను జయంత్ సిన్హా ఖండించారు. సంస్థలో తన లావాదేవీలన్ని పారదర్శకంగానే ఉన్నాయని, సంబంధిత అధికారులకు డాక్యుమెంట్స్ కూడా సమర్పించానని అన్నారు.