విభజనపై యూ టర్న్: కిరణ్ కుమార్ రెడ్డి ఆశలు
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నోట్ తయారవుతోందని ప్రభుత్వం ప్రకటన చేసినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చర్యలు తీసుకునేందుకు తన వాదనలు గట్టిగా తెలియజేస్తున్నట్లు సమాచారం. ఆయన శుక్రవారం మాట్లాడారు. కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన నిర్ణయంపై యూ టర్న్ తీసుకునే అవకాశాలున్నాయని తెలిపారు.
సీఎం క్యాంపు కార్యాలయంలో సీమాంధ్ర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కిరణ్కుమార్ రెడ్డిని కలిశారు. శుక్రవారం కిరణ్ 54వ జన్మదినం కావడంతో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కిరణ్ సీమాంధ్ర మంత్రులతో మాట్లాడారు. విభజనకు హైదరాబాద్ సమస్యగా మారిందని, దీంతో రాష్ట్ర విభజన నిర్ణయంపై అధిష్టానం వెనక్కి తగ్గే అవకాశం ఉందని సీఎం తెలిపారు.
తెలంగాణపై కేంద్ర హోంశాఖ తయారు చేస్తున్న నోట్ కేంద్ర కేబినెట్లో ఆమోదం పొందకముందే ఢిల్లీకి వెళ్లి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అధిష్టానంపై ఒత్తిడి తీసుకురావాలని సీఎం కిరణ్కుమార్ రెడ్డిని సీమాంధ్ర మంత్రులు కోరారు. అయితే హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయకుండా తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు రాజధాని చేయడం సాధ్యం కాదని సీమాంధ్ర మంత్రులకు సీఎం కిరణ్ తెలిపారు.
కాంగ్రెస్ అధిష్టానానికి హైదరాబాద్పై రెండు అవకాశాలున్నాయని, ఒకటి హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడం, లేదా ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని కిరణ్ తెలిపారు. అయితే ఈ రెండు ప్రతిపాదనలకు తెలంగాణ ప్రజలు, నేతలు అంగీకరించరని దీంతో అధిష్టానం విభజనపై నిర్ణయం తీసుకునే అవకాశం లేదని ఆయన తెలిపారు. కానీ సీఎం కిరణ్ వ్యాఖ్యలపై తమకు అనుమానాలున్నాయని, కిరణ్ విభజనపై అధిష్టానం నిర్ణయానికే కట్టుబడే అవకాశం ఉందని కొందరు సీమాంధ్ర మంత్రులు అన్నారు.
కాగా మరికొంత మంది మంత్రులు సీఎం కిరణ్కుమార్ రెడ్డి వైఖరి పట్ల తమకు పూర్తి నమ్మకముందని తెలిపారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎం పదవికి గానీ, పార్టీకి గానీ రాజీనామా చేయడం లేదని, కొత్త పార్టీ కూడా పెట్టడం లేదని వారు తెలిపారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సమైక్య రాష్ట్రానికి కట్టుబడి ఉన్నానని చెబుతూనే విభజనపై సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పినట్లు సీమాంధ్రకు చెందిన ఓ మంత్రి తెలిపారు.