రాజకీయ పార్టీలకు పవన్ కళ్యాణ్ ఫీవర్
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వస్తారని ఊహాగానాలు చెలరేగడమే తరువాయి రాజకీయ పార్టీలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. ఆయన కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తారని ప్రచారం సాగింది. అదే సమయంలో పార్టీ ఏర్పాటు నుంచి వెనక్కి తగ్గి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగుతారని కూడా ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ స్థితిలో పవన్ కళ్యాణ్ మద్దతు కోసం రాజకీయ పార్టీలు ముందుకు దూకాయి.
ఆమ్ ఆద్మీ పార్టీ, లోకసత్తాలతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా పవన్ కళ్యాణ్తో బేరసారాలకు దిగినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ అనకాపల్లి నుంచి గానీ మల్కాజిగిరి నుంచి గానీ లోకసభ బరిలోకి దిగుతారని ప్రచారం సాగింది. ఈ స్థితిలో పవన్ కళ్యాణ్తో చర్చలకు తెలుగుదేశం పార్టీ ఇద్దరు పారిశ్రామికవేత్తలను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.
ఇద్దరు పారిశ్రామికవేత్తలు చర్చలు జరిపి, వివిధ ఆపర్లు ఇచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ ఏదీ తేల్చలేదని అంటున్నారు. పవన్ కళ్యాణ్ లోకసభ ఎక్కడి నుంచి పోటీ చేసినా తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని రంగంలో ఉంచదని, పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతుందని తెలుగుదేశం ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పార్టీ పెట్టకుండా తన అభ్యర్థులను పవన్ కళ్యాణ్ రంగంలోకి దించదలుచుకుంటే 25 స్థానాల్లో బలపరుస్తామని, దానికి ప్రతిగా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేయాలని అడిగినట్లు తెలుస్తోంది.
తాను మార్చి రెండో వారంలో రాజకీయ ప్రకటన చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పినప్పటికీ బుధవారంనాడే ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారని ఊహాగానాలు చెలరేగాయి. బుధవారంనాడు మీడియా సమావేశం ఏర్పాటు చేయకపోవడంతో పార్టీ పెట్టే ఆలోచన నుంచి వెనక్కి తగ్గినట్లు ప్రచారం ముందుకు వచ్చింది. ఏమైనా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫీవర్ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు పట్టుకుంది. ఆయన ఏం చేస్తాడో, ఏం చెపుతాడో చూడాల్సిందే.